Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కులంలో లేదా ఒక వర్గంలో కొందరు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఆ కులం మొత్తానికి లేదా ఆ వర్గం మొత్తానికి ఆపాదించకూడదు. సమాజంలో మంచి, చెడులు ఉంటాయి. అణగారిన వర్గాలవారి అభ్యున్నతికి ఆధిపత్య వర్గాల లోని ఎందరో కృషి చేసారు. అటువంటి వారిలో త్రిపురనేని రామస్వామి ఒకరు. ఆయన న్యాయవాదిగా, హేతువాద రచయితగా, సంఘ సంస్కర్తగా. కవిరాజుగా పేరు పొందారు. హేతువాదం, మానవతావాదాన్నీ తెలుగు కవిత్వం, సాహిత్యాల్లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవి ఆయన. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. రాజా రామ్ మోహన్రారు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు. రైతు కుటుంబంలో పుట్టినా, చిన్నప్పటినుంచి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరం ఆయన పల్నాటి యుద్ధం ఆధారంగా కారెంపూడి కధనం, మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించాడు. 1911లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరులోని నోబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యాన్ని, అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు. 1914లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు.1917లో భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయ వత్తిని చేపట్టారు. కొద్ది కాలంలోనే గొప్ప న్యాయవాదిగా పేరు పొందారు. సనాతన మతంలో ఉన్న ఆశాస్త్రీయ విషయాలను తన రచనల ద్వారా ప్రశ్నించాడు. కుల వ్యవస్థపై, సాంఘిక దురాచారాలపై రాజీలేని పోరుసల్పారు. 1925లో ఆయన తెనాలి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికై దేవాలయాల్లో జంతు బలులను నిషేధించారు. సంస్కృతంలో ఉన్న పెండ్లి మంత్రాలని తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహావిధిని తయారుచేసారు. సూత పురాణం, రాణా ప్రతాప్, గోపాలరాయ శతకం, ఖూనీ, ధూర్తమానవ శతకం, శంబూక వధ వంటి రచనలు చేశారు. తెలుగునాట హేతువాద ఉద్యమానికి తన సాహిత్యం ద్వారా పునాదులు వేశారు. సనాతన సంప్రదాయాల వల్ల సామాన్యులు చదువులకి దూరం అయ్యారని తెలిపారు. రామస్వామి కుమారుడు గోపిచంద్ కూడా మంచి రచయిత కావడం విశేషం. గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర రచనతో తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించారు. రామస్వామి సాహిత్యానికి చేసిన కృషికి ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదు నిచ్చింది.1943 జనవరి 16న ఆయన తుదిశ్వాస విడిచారు. మనవసేవే ముఖ్యమని నమ్మి ఆచరించారు. పురాణాలపై తనదయిన శైలిలో వ్యాఖ్యానాలు చేశారు. ఇవి మనుషుల్లో అసమానతలని పెంచాయన్నారు. సైన్స్, హేతువాద ఉద్యమాలను ముందుకు నడిపించడం ద్వారానే సమాజాన్ని ముందుకు నడిపించగలమని ఎలుగెత్తడమే కాదు, బతికినంతకాలం అందుకు కృషి చేశారు. త్రిపురనేని స్పూర్తిని నేడు కొనసాగించడమే ఆయనకు నివాళి.
- ఎం. రామ్ ప్రదీప్
సెల్:9492712836