Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ చేపట్టిన పులుల సంరక్షణ ఆదివాసీలకు తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నది. జిల్లాలోని దహేగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు సిడెం విఘ్నేష్పై ఈనెల 11న పులి దాడిచేసి చంపివేసిన సంఘటన యాదృచ్చికంగా జరిగింది కాదు. ప్రభుత్వం, అటవిశాఖ అధికారుల విధానాల వలన జరిగింది. ఇందుకు ఆధారం ఆ సంఘటన జరిగిన మర్నాడు ఆసిఫాబాద్ డీఎఫ్ఓ శాంతారావు మాట్లాడుతూ 2016 నుంచి కాగజ్ నగర్ డివిజన్లోని ''కడంబా''అడవి ప్రాంతంలో పులుల సంరక్షణ చేపడుతున్నామని, అందులో అందులో భాగంగా పాల్గుణా అనే పులికి 2016లో, ఇప్పుడు మొత్తం ఎనిమిది పులులు జన్మించాయని అవన్నీ ప్రాణాలతో ఆరోగ్యంగా ఉన్నాయని ప్రకటించడం. నిజానికి ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు కొరకు తద్వారా ఆదివాసీలను నిర్వాసితులగా మార్చేందుకు ప్రభుత్వం, అటవీ అధికారులు పూనుకున్నారేది స్పష్టమవుతున్నది. అసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట, బెజ్జూర్, దహెగాం, కాగజ్ నగర్, సిర్పూర్ మండలాలలోని దిగిడ, గుండెపల్లి, మొట్లగూడ, రాంపూర్, జిల్లేడ, మొర్లిగూడ, కమర్ గావ్, గెర్రె, సులుగు పల్లి వంటి సుమారు 50 గిరిజన గూడేలకు ఈ ప్రమాదం పొంచివుంది.
గత మూడు నెలలుగా ఈ గ్రామాలలో పులి పశువులపై దాడి చేస్తున్నది. అక్టోబర్ 29నాడు పెంచికల్ పేట్ మండలంలోని జిల్లేడ గ్రామానికి చెందిన కుడ్మెత తులసిరామ్కి చెందిన ఎద్దుపై పంట చేనులో దాడి చేసి, అనంతరం గ్రామ సమీపానికి వచ్చింది. 30 అక్టోబర్ నాడు బెజ్జూరు మండలంలోని సులుగుపల్లిలో కూలీలను బయపెట్టింది. ఈ విధమైన వరుస ఘటనలు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టకపోవడంతోనే విగేష్ మరణించాడు. చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు ఈ గ్రామాల పరిధిని టైగర్ కారిడార్ అని అనధికారికంగా పిలుస్తున్నారు.
ఇందులోని చాలా గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో ఉన్నందున ఈ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే పెసా (జూaఅషష్ట్రaya్ర జుఞ్వఅరఱశీఅ ్శీ రషష్ట్రవసబశ్రీవస Aతీవaర) చట్టం 1996 ప్రకారం వివిధ గ్రామాల ''గ్రామ సభ'' అనుమతులు తప్పనిసరి. కానీ అటవీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండానే పులుల సంరక్షణ ఈ ప్రాంతంలో చేపడుతున్నారు. ఈ ప్రాంతంలోని గిరిజన ప్రజలు ఇదంతా,టైగర్ జోన్ ఏర్పాటు కోసమేనని భావిస్తున్నారు. భవిష్యత్తులో పులుల సంఖ్య పెరిగి టైగర్ జోన్ ఏర్పడితే ఈ అటవీ ప్రాంతంలో నివసించే కోయా, గోండు, కొలాం, ప్రధాణ్ వంటి ఆదివాసీ తెగల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2012లో ఏర్పాటు చేసిన ''కవ్వాల్ రిజర్వుడ్ ఫారెస్ట్-టైగర్ జోన్'' వలన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసాపేట, రాంపూర్, కొలాంగూడ, అలీనగర్,దొంగపల్లి వంటి 25 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. 2015లో ప్రభుత్వం (ణూ×జ) డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీని ఏర్పాటుచేసి వీరిని వెల్దూర్ గ్రామంలోని పునరావాస కేంద్రానికి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే అక్కడి ఆదివాసులు టైగర్ జోన్ కు వ్యతిరేకంగా ఉద్యమించారు. పాలకుల ఒత్తిడితో వీరిలో కొన్ని గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్తే ఎక్కువ గ్రామాల ప్రజలు అలాగే ఉండిపోయారు.
ఇప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలోని పులుల ప్రభావిత ఆదివాసి గూడేలలోని ప్రజలు తమని కూడా ప్రభుత్వం ''టైగర్ జోన్'' పేరుతో తమ ఆవాసాల నుండి, అడవి నుండి గెంటేస్తుందని బయపడుతున్నారు. ఇదివరకు తమ నుంచి పోడు భూములను గుంజుకున్న ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద విషయం కాదు అనేది వారు మాట్లాడు కుంటున్నారు. తమ ప్రాంతంలో పులుల సంరక్షణ చేపట్టకూడదని అంటున్నారు.
రిహబీషన్ చట్టంలో బాగంగా గిరిజనులను మైదాన ప్రాంతానికి తరలించినప్పుడు వారి జీవన అస్తిత్వం (మనుగడ) ప్రమాదంలో పడుతుంది. ఆదివాసీలు వారి భూమిని, అటవీ ఉత్పత్తులను, ఆహరం, సంస్కృతిని, ఆచారాలను, అన్నిటికీ మించి వారి జన్మహక్కు అయిన స్వయంపాలననూ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. వీటితో పాటు వారి రాజ్యాంగ హక్కులైన అటవీ హక్కుల చట్టం 2006, 1/70 పెసా వంటి చట్టాలు నిరుపయోగంగా మారుతాయి. మైదాన ప్రాంత వాతావరణంలో నివసించలేక అనారోగ్యాల బారినపడి నాగరికతకు మూలమైన ఆదివాసి తెగలు అంతరించే ప్రమాదం ముంచుకొస్తోంది. అందుచేత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ఔన్నత్యం కోసం పులుల సంరక్షణ చేపట్టాలను కున్నప్పుడు మరో వైపు వాటి బారినుంచి ప్రజల ప్రాణాలు కూడా కాపాడాల్సిన భాద్యత కూడా తీసుకోవాలి. పెద్ద సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మొదట ప్రజల సంరక్షణ-ఆ తర్వాతనే పులుల సంరక్షణ అనే విధానాన్ని అవలంబించాలి. ప్రభుత్వాలతో పాటు వివిధ యూనివర్సిటీలలో చదువుతున్న జంతు శాస్త్ర పరిశోధక విద్యార్థులు, సంస్థలు, చదువుకున్న యువకులు గిరిజనప్రజలకు అవగాహన కల్పించాల్సిన భాద్యత ఉన్నది.
- కె. ఆనంద్
సెల్:9652357076.