Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది వ్యవసాయక దేశం. నూటికి 90 మంది ఒకనాడు వ్యవసాయం పైనే జీవించే వారు. ఇప్పుడు 70శాతం అంటు న్నారు. ఈదేశంలో సాగు భూములు సుమారుగా 40కోట్ల ఎకరాలు న్నాయి. ఇవిగాక బంజర్లు, అటవీ భూములు, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, ఆక్రమణలకు గురైనవి, దేవాదాయ భూములు.. కబ్జాల పాలైనవి యింకా వేలకోట్ల ఎకరాలు ఉండవచ్చు.. ప్రభుత్వ 'మేసిన' లెక్కల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదొక అంశం అయితే..
ఉత్పత్తి ఖర్చుల ప్రాతిపదికన మద్దతు ధర(లు) నిర్ణయిస్తోంది సర్కార్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తున్నాడు మన తెలంగాణ పాలకుడు కేసీఆర్. సరైన మద్దతు ధర, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. పట్టణాల్లో మధ్యతరగతి వేతన జీవులు షాపింగ్ మాల్స్లో కిలో టమోటా ధర రూ.30 నుంచి 40 వరకు ఖరీదు చేస్తున్నారు. వాస్తవంలో మార్కెట్ యార్డ్లో టమోటా కిలోకు రూ.2కూడా ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. సుబాబుల్ (యూకలిప్టస్ లాంటిది) క్వింటాలు రూ.4,300 ఉంటే రూ.1,800కు కొంటున్నారు. ఇది దోపిడీకాదా? పెట్టిన పెట్టుబడి రాక, అప్పులపాలై దివాళా తీస్తున్నాడు రైతు. నిత్యం పెరిగే వ్యవసాయ ఖర్చులు, (విత్తనాల కొనుగోలు, ఎరువు, పురుగు మందులు, చీడపీడలు, కలుపుతీత) తట్టుకోలేక ఈ నూతన శతాబ్దంలో 20ఏండ్లలో 30లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టిన విషాద భారతం ఇది. 2019 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలూ హామీలూ ఇచ్చింది. పెట్టుబడి ఖర్చులకు మరో 50శాతం కలిపి మద్దతుధరలు ప్రకటిస్తానని కొత్తగా రైతులను నట్టేట ముంచే మూడు కొత్త చట్టాలు తేవడంతో ఢిల్లీలో రైతులు రెండు నెలలుగా ఉద్యమిస్తున్నారు. కేవలం కార్పొరేట్ వ్యవసాయాన్ని నెలకొల్పడానికి ఈ చట్టాలు, పన్నాగాలు. ''మద్దతు ధర ప్రస్థావనే లేకుండా ఈ చట్టాలు చేసారు.'' ఈ అశాస్త్రీయ ధరల విధానం అన్నదాత(ల)ను కృంగదీస్తుంది. నష్టం కలిగిస్తుంది. గత 20 సంవత్సరాలలో వ్యవసాయపంటల ధరలు కేవలం 20శాతం మాత్రమే పెరిగాయి. మరో వైపు పారిశ్రామిక వస్తువుల ధరలు - వివిధ శాఖల్లో ఉద్యోగ వేతనాలు 150శాతం నుంచి 350శాతం వరకు పెరిగాయి. తాము పండించిన అన్ని రకాల పంటలకు ''కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే'' రైతుల డిమాండ్లో న్యాయం ఉంది. అలాగే రైతుల వెన్నెముక విరిచే విద్యుత్ సవరణ బిల్లు. నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ కోసం ఢిల్లీలో రైతుల ఆందోళన సహేతకమైనదే. ఒక సైనికాధికారి తుపాకీతో కాల్చుకొని రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఆత్మహుతి అయ్యాడు. దాదాపు 50మంది రైతులు ఈ పోరాటంలో మృతి చెందారు. కార్పొరేట్ వ్యవసాయం కోసం, కార్పొరేట్ సంస్థల బాగు కోసం, నయా జమీందారీ వ్యవస్థను రాష్ట్రాల వారిగా దేశం అంతా వ్యాపింపచేయాలనే కేంద్ర ప్రభుత్వ దుష్ట ఆలోచనకు అద్దమే ఈ నూతన వ్యవసాయ చట్టాలు. వీటిని తక్షణం రద్దు చేయాలంటూ 4డిగ్రీల చలిలో ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల నుంచి 99వేల ట్రాక్టర్లతో లక్షలాది రైతులు ఢల్లీీకి కదిలొచ్చిన తెగువ అభినందనీయం... దేశ ఆర్థిక వ్యవస్థను, రక్షణ వ్యవస్థను - ఆఖరుకుసేద్యాన్నీ (భూముల్ని) ప్రయివేటుపరం చేయాలనే కేంద్ర పాలకుల కుట్రలో భాగమే. ఈ నూతన వ్యవసాయ చట్టాలని అర్థం చేసుకోవాలి. 74ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో యింకా బడుగు, బలహీన వర్గాల జీవన స్థితిగతులను ఈ ప్రభుత్వాలు మార్చలేకపోయాయి. సామాజిక న్యాయం, సాధికారత, అణగారిన వర్గాలకు అందని ద్రాక్షే అవుతోంది. ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటు వారికి ఇస్తున్నారు. కేంద్రం చేతుల్లోని ఎన్నో సంస్థలు కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో చేరుతుఉన్నాయి. రక్షణరంగం సైతం ప్రవేటీకరించబడుతోంది. ఇప్పుడు వ్యవసాయం రంగం వంతు వచ్చింది.
గత సెప్టెంబర్లో కార్పొరేట్ ట్యాక్స్ను 30శాతం నుంచి22 శాతానికి తగ్గించింది ఢిల్లీ మోడీ ప్రభుత్వం. ఈ పన్ను తగ్గింపుతో కేంద్ర ఖజానాకు రూ.61వేల కోట్ల కోత పడినట్టు సీజీఓ (కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్) వెల్లడించింది. కార్పొరేట్లకు ఎన్నో పన్ను రాయితీలు.. వేల కోట్ల రుణమాఫీలు, చౌకగా భూములు ధారాదత్తం చేస్తోంది. పారిశ్రామిక రంగ లాభాల కోసం విశేషంగా కృషి చేసే కేంద్రం - కర్షకులపై మాత్రం ఎందుకు ఇంత కక్ష కట్టిందో చెప్పాలి.
విజరుమాల్యా, నీరవ్ మోడీ లాంటివారు బ్యాంకుల్ని ముంచేస్తున్నారు. ఇటీవల ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. రుణాలు ఎగ్గొట్టిన వారిలో మోడీ మిత్రులున్నారు. ఇలా బ్యాంకులు మూతపడటం వెనుక.. క్రోనీ క్యాపటలిజం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేఫ్ కాఫీడే, సీజీ పవర్, జెట్ ఎయిర్వేస్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ఎఫ్ఎస్, అనీల్ అంబానీ, మాల్యా, జీనెట్వర్క్ సుభాష్చంద్ర, ఇలా పెద్ద లిస్టే వస్తుంది. కానీ, ట్రాక్టర్ రుణం తీర్చని రైతును బేడీలు వేసి హింసించే పోలీసుల్ని చెన్నైలో చూసాం. అప్పుల ఊబిలో ఉసురు తీసుకొనే రైతన్నల వార్తలురోజూ ఉంటున్నాయి. బహుళజాతి కంపెనీలకు కొమ్ముకాసే ప్రభుత్వాలు ఆ కంపెనీల ప్రయోజనాలకే తప్ప జాతి సంక్షేమం కోసం అవి పాటుపడవు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
మల్టీ నేషన్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ప్రయివేటు సంస్థల యొక్క లాభాల కోసమే పాలక పక్షాలు ఈ దేశంలో 30ఏండ్ల నుంచి తీవ్రంగా కృషిచేసాయి. చేస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాలు, అమెరికా అనుకూల విధానాలు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ రెండే! పార్టీలే వేరు.. విధానాలు ఒక్కటే. చమురు కంపెనీలన్నీ కార్పొరేట్లకు అమ్మడం ఎవరి కోసం? ఈ దేశంలో పత్తి, చెరకు, పుసుపు, మిరప, ధాన్యం, గోధుమ మొదలైన పంటలు కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతాయని వ్యవసాయ రంగ నిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాల్ని, అభివృద్ధి పేరిట భూసేకరణచట్టాల్ని, వ్యవసాయ వ్యతిరేక విద్యుత్ చట్టాల్ని తక్షణం ఎత్తివేయాలి. ఈ డిమాండ్స్తో దేశం అంతా పోరాడాలి. రైతులతో మోడీ మంత్రుల చర్చలు విఫలం కావడం విచారకరం. దాదాపు 41 రైతు సంఘాలు.. యావత్ భారతదేశ రైతు ఘోషను - ప్రాణాలు ఫణంగా పెట్టి, చలిలో ధృడంగా నిలబడి వినిపిస్తుంటే... పట్టించుకోని బధిర కేంద్ర ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కేంద్రం కండ్లు తెరవాలి. కనీస మద్దతు ధరకు చట్టం తేవాలి. కొత్తగా వ్యవసాయ చట్టాలు ఎత్తివేయాలి. జై ప్రజలంతా ఏకమై కేంద్రంపై పోరాటం చేస్తే చట్టాలు, ప్రభుత్వాలు కుప్పకూలుతాయి. నియంతలు, ఫాసిస్ట్లు, జనాగ్రహంతో కనుమరుగైన చరిత్ర. పునరావృతం కానుంది.
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472