Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేసేది తక్కువ... చెప్పుకునేది ఎక్కువ... ఇది రాజకీయ నాయకుల సహజ లక్షణంగా మారిపోయింది. అవసరం లేకున్నా హడావుడీ. మంచి జరిగిన ప్రతిసారి తమ వల్లే జరిగిందని చెప్పుకునేందుకు ఆరాటం, చెడు జరిగితే అది ప్రత్యర్థుల వల్లే జరిగిందని చెప్పే యత్నం సర్వసాధారణమై పోయాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడిన వేళ డాక్టర్లు, నర్సులు తదితర వైద్యసిబ్బంది తమ ప్రాణాలు ఫణంగా ప్రజలను కాపాడారు. పారిశుధ్య కార్మికులు శానిటేషన్ పనులు చేస్తూ ప్రజారక్షణలో పాల్గొన్నారు. కరోనా వారియర్లుగా ఎల్లడెలా ప్రశంసలందు కున్నారు. అనేక మంది కరోనా బారినపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. పలువురు ఆ వ్యాధితో మరణించారు. అదే రాజకీయ నాయకులు, సంపన్నులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ముఖమే చూడలేదు. కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమాల ప్రారంభానికి మాత్రం ఫొటోలకు ఫోజులిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వ్యాక్సిన్ కేంద్రాలకు రాజకీయ నాయకులు బారులు తీరుతున్నారు. పలు చోట్ల తమను పిలవలేదంటే తమను పిలవలేదంటూ ఘర్షణలు పడి వారియర్లను ఇబ్బందికి గురిచేశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కాస్తా రాజకీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- కె.ప్రియకుమార్