Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో వ్యవ సాయ రంగం తర్వాత ప్రజలకు అత్యధికంగా ఉపాధిని ఇచ్చే రంగాల్లో భవన నిర్మాణ రంగం ఒకటి. కానీ ఇటీవల సిమెంట్ కంపెనీలు సిండికేట్గా మారి సిమెంటు ధరలు అమాంతంగా పెంచేశాయి. బస్తా సిమెంట్కి వంద రూపాయలకుపైగా పెరగడంతో సుమారు 25 శాతానికిపైగా పెంచిన ధరలతో నిర్మాణరంగం కుదేలయింది. స్టీల్ ధరలు కూడా 50శాతం పైగా పెరగడంతో నిర్మాణరంగం నడ్డి విరిగింది. అసలే కరోనా కష్టకాలంలో లాక్డౌన్ పీరియడ్లో 2020 మార్చి చివరి నుండి జూన్ దాకా మొదటి మూడు నెలలు నిర్మాణరంగం పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా మొదలై ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో సిమెంట్, స్టీల్ ధరలు అడ్డగోలుగా పెరగడంతో భవన నిర్మాణాలు చాలావరకు ఆగిపోయాయి. బిల్డర్లు సిమెంటు ధరలు తగ్గకపోతాయా అని నిర్మాణాలను తాత్కాలికంగా ఆపివేశారు. ప్రభుత్వమేమో సిమెంట్ ఉత్పత్తిదారుల సిండికేట్ల ఆగడాల పట్ల మౌన ప్రేక్షకుడిగా మారింది. ఈ నిర్మాణ రంగం సంక్షోభం కాస్త నిర్మాణ రంగ కార్మికుల ఉపాధిని దెబ్బ తీస్తున్నది.
తెలుగు రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు తక్కువ కాకుండా నిర్మాణం అవుతున్నాయి. విద్య, ఆరోగ్య ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు, నగరాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. నిర్మాణ రంగం దినదినాభివృద్ధి చెందుతూ కొనసాగుతోంది. ఈ స్థితిలో సిమెంట్ ఉత్పత్తిదారులు ఏకమై సిమెంట్ రేటును అడ్డగోలుగా పెంచడంతో, చదరపు అడుగు ఇంటి నిర్మాణానికి రెండు వందల రూపాయలకు పైగా అదనపు భారం పడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న స్టీలు ఎగుమతులు, దిగుమతుల విధానం మూలంగా మన దేశంలో ఇనుము ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నిర్మాణ రంగం కుదేలయింది.
సిమెంటు స్టీల్ వ్యాపారులు సిండికేట్లు కావడం మన దేశంలో కొత్త కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ప్రధాన కంపెనీలు ఇవే. అందుకే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం కోసం ఇలాంటి కంపెనీల మీద రాజకీయ పార్టీలు ఆధారపడతాయి. అందుకే వారు అడ్డగోలుగా రేట్లు పెంచేసినా ప్రభుత్వాలు కండ్లు మూసుకుని చూస్తూ ఉంటాయి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. సిమెంటు ఉత్పత్తికి సున్నపురాయి ప్రధాన ముడిసరుకు. సిమెంట్ కంపెనీలకు భూమిలో ఉండే సున్నపురాయి నిక్షేపాలు కేటాయించేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సిమెంట్ ఉత్పత్తి దారులతో కుమ్మక్కై సున్నపు గనులను నామమాత్రపు లీజుకు కేటాయిస్తుంటారు. లీజుకు తీసుకున్న గనులకు తోడు అదనంగా ఇంకా కొంత ప్రాంతాన్ని ఈ వ్యాపారులు ఆక్రమించుకొని అడ్డగోలుగా అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇందులో వందల కోట్ల రూపాయలు అధికారులకు రాజకీయ నాయకులకు ముడుపులుగా చెల్లిస్తున్నారు. దీంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సిమెంట్ ఉత్పత్తి అయిన తరువాత కూడా అడ్డగోలు రేట్లకు అమ్ముకునే స్వేచ్ఛను వారికి ఇస్తున్నారు. నిర్మాణ రంగం కుదేలు అయిపోయి సిమెంటు రేట్లు పడిపోయినప్పుడు సిమెంటు ఉత్పత్తిదారులు సిండికేట్గా మారి తమ కంపెనీల రోజువారి ఉత్పత్తిని కావాలనే కుట్రపూరితంగా తగ్గిస్తున్నారు. మార్కెట్లో కత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారు. ఉత్పత్తి తగ్గించడం వల్ల తమ కంపెనీలో పనిచేసే కార్మికులను నిర్దాక్షిణ్యంగా, నిరుద్యోగులుగా మారుస్తున్నారు.
స్టీలు విషయానికి వస్తే అంతర్జాతీయ ధరలను అనుసరించి ఇక్కడి స్టీల్ రేట్లు నిర్ధారణ అవుతాయి. బయట దేశాలలో పెరిగిన సందర్భంలో మన దేశం నుంచి ఎగుమతులను ప్రోత్సహించడం, మన దేశంలో ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా మామూలే. కానీ మన దేశ అవసరాలు తీరిన తర్వాత ఎగుమతులకు అవకాశం ఇవ్వాలన్న కనీస వ్యాపార సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. అందుకే ఉక్కు ధరలు పెరగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంతైనా ఉంది.
భవన నిర్మాణ రంగాన్ని పరిశ్రమ అని పేరుకు మాత్రమే అంటున్నారు. కానీ నిజానికి ఇతర పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కానీ ఇతర ప్రోత్సాహకాలు కానీ భవన నిర్మాణ రంగానికి ఉండడం లేదు. ఇంటి నిర్మాణానికి పునాది వేసినప్పటినుంచి మొదలుకొని ఇల్లు పూర్తయి అంతిమంగా ఇంటికి అందమైన రంగులు వేసే వరకు ప్రతి నిర్మాణ రంగ సామాగ్రిపై ప్రభుత్వాలు రకరకాల పన్నులు వసూలు చేసుకుంటున్నాయి. అంతెందుకు ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చే నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్) కోసం వసూలు చేసే పన్ను నుంచి మొదలుకొని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభజించి వాటికి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసే వరకు ప్రతి దశలో ప్రభుత్వం పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఇక అభివృద్ధి చెందిన లేఅవుట్లలో ఎవరైనా వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుక్కున్న ప్రతిసారీ, క్రయ విక్రయాలు జరుగుతున్న సమయంలో రిజిస్ట్రేషన్ల ఫీజు రూపేనా కూడా ప్రభుత్వానికి పన్నులు దక్కుతాయి. అలాగే అపార్ట్మెంట్ల నిర్మాణంలో కూడా ప్రభుత్వానికి మనం చెల్లించే పన్నుల వాటా చాలా ఎక్కువే. కానీ నిర్మాణ రంగానికి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు ఇవ్వడం లేదు. పైగా ఎప్పటికప్పుడు ఈ రంగంపై పన్నులు వేస్తూ మరింత బాధిస్తుంది. దీంతో బిల్డర్ల సంగతి అటుంచి సామాన్యుడు పైసా పైసా కూడపెట్టుకొని ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుందామంటే ''ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు'' అన్న సామెత అక్షరాలా నిజమై కూర్చుంది. చాలామంది సగంలోనే ఇళ్ల నిర్మాణం ఆపేసి ఇంకా అద్దె ఇండ్లలోనే ఉంటున్నారు. ప్రజల గృహ అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు ''అమ్మ పెట్టదు అడుక్కు తిన నివ్వదు ''అన్న చందాన గృహ నిర్మాణ సామాగ్రి రేట్లు కూడా పెంచేసి చూస్తూ కూర్చుంటుంది. సామాన్య ప్రజలకు కనీస అవసరాలైన ''కూడు గుడ్డ నీడ'' కల్పించాల్సిన ప్రభుత్వం ప్రజల నుండి పన్నులు మాత్రం వసూలు చేస్తూ తమ బాధ్యతను మరచి పోతున్నది.
సిమెంట్ ఉక్కు ధరలు పెరగడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పేదల ఇండ్ల నిర్మాణం కూడా కష్ట సాధ్యంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కేవలం ఐదు ఆరు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. స్టీలు సిమెంటు ధరల పెరుగుదలతో బడ్జెట్ మరో రెండు లక్షలకు పైగా పెరుగుతుంది. దీంతో పన్నుల రూపంలో మళ్లీ ప్రజల మీద భారం పడుతుంది.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి సిమెంటు ఉత్పత్తి ధరకు యాభై శాతం మించకుండా సిమెంట్ రేట్లు నియంత్రించాలి. అలాగే దేశ అవసరాలకు సరిపడా సరిపడినంతగా ఉక్కు ఉత్పత్తిని పెంచాలి. మన అవసరాలకు మించితేనే ఎగుమతులు చేయాలి. నిర్మాణ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడమే కాదు, ఇతర పరిశ్రమలకు ఇచ్చినట్లుగానే రాయితీలు ఇవ్వాలి. ''ఆఫర్డబుల్ ప్రైసెస్'' అందుబాటు ధరలో సామాన్య పేద మధ్యతరగతి వారికి ఇండ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలి.
- బి. రామ్మోహనరావు
సెల్ 9866074027