Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా సిడ్నీలో ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరిగిన మూడవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో కొందరు ప్రేక్షకులు టీమ్ ఇండియాని లక్ష్యంగా చేసుకొని జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలో కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్స్ స్లెడ్జింగ్ చేసి ఇతర దేశాల క్రీడాకారుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమ్ ఇండియాకు క్షమాపణలు చెప్పడం కొంతలో కొంత ఊరట కల్గించే అంశం. భారత క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
భారత్లో కులవివక్ష ఉన్నట్లే, విదేశాల్లో జాతివివక్ష నేటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ ఆఫ్రికా, మరికొన్ని యూరోప్ దేశాల్లో ఈ వివక్ష ఎక్కువగా ఉంది. శ్వేత జాతీయులలో కొంతమంది అందరికంటే తామే తెలివిగలవారమనే భావంతో ఉంటారు. వారు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో పలు దేశాలను ఆక్రమించుకొని వాటిని వలస రాజ్యాలుగా మార్చారు. ఆయా దేశాలలోని స్థానిక సంస్కతులని నాశనం చేశారు. ముడివనరులని దోచుకున్నారు. ప్రజల హక్కులని కాలరాసారు.
గాంధీజీ సైతం దక్షిణాఫ్రికాలో వివక్షకు గురైయ్యారు. అమెరికాలో నల్లజాతీయులపై ఇంకా ఏదో ఒక రూపంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికాలో నెల్సన్ మండేలా వంటివారు ఏండ్ల తరబడి జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాడారు. మధ్యాయుగాల్లో నల్లజాతీయులని బానిసలుగా మార్చారు. వివక్ష అనేది పలు రూపాల్లో ఉంటుంది. రంగు, అంగవైకల్యం, వయస్సు, పేదరికం, కులం, మతం, జాతి, లింగం, వర్గం తదితర రూపాల్లో వివక్ష కొనసాగుతుంది. కెంట్ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం ఇంగ్లాండ్లో వయసుపైబడి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల 29శాతం మంది వివక్షకు గురవుతున్నారు. జాతి వివక్షతతో నల్ల జాతీయులతో సహా పలువురు తమ హక్కులని కోల్పుతున్నారు. ట్రంప్ పాలనా కాలంలో అమెరికాలో జాతీయవాదం పెరిగింది. ఈ వాదం అమెరికా ప్రజలకి మేలు చేయలేదు. గతంలో ఆస్ట్రేలియాలో కూడా పలువురు భారతీయ విద్యార్థులపై దాడులు జరిగాయి. మనదేశంలో దళితులు ఇంకా అంటరానివారిగానే కొనసాగుతున్నారు. అంబేద్కర్ మహాశయుడు ఇటువంటి వివక్షను ఇండియాలో ఎదుర్కొన్నారు. జాతి, కుల వివక్షను ఎదుర్కొనేవారు మనవహక్కులని కోల్పోతారు. వీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతుంటారు. దేశ సరిహద్దులలో నివసిస్తున్న ప్రజలకి పౌరసత్వ సమస్యలు తలెత్తుతున్నాయి. పటిష్టమైన మానవహక్కుల చట్టాలని వివిధ దేశాలు రూపొందించాలి.
జార్జ్ ఫ్లాయుడ్ని దారుణంగా హతమార్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతివివక్షపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలోని సిబిఎస్ న్యూస్ అంచనా ప్రకారం 2020 జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు అమెరికా పోలీసులు 164మంది నల్లజాతీయులని వివిధ కారణాలతో చంపారు. అన్ని హక్కులకంటే జీవించే హక్కే ప్రధానమని ఇటీవల మద్రాస్ హైకోర్టు తెలిపింది. కానీ వివక్ష వల్ల వివిధ ప్రాంతాల్లో అణగారిన వర్గాల ప్రజలు జీవించే హక్కుని కోల్పోతున్నారు. మానవ హక్కుల కమిషన్లని వివిధ ప్రాంతాల్లో పటిష్ట పరచాలి. సమాజంలో శాస్త్రీయ ఆలోచనల్ని పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. హక్కులు కోల్పోయిన వారికి వెంటనే పునరావాసం కల్పించాలి. అమ్నెష్టి ఇంటర్నేషనల్ వంటి సంస్థలు మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారా కొంతవరకైనా జాతి, కులవివక్ష తగ్గే అవకాశం ఉంటుంది.
- ఎం. రామ్ ప్రదీప్
సెల్: 9492712836