Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా సామాజిక మాధ్యమంలో కొన్ని పోస్టులు తిరుగుతున్నాయి. ఒకదానిలో ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశంలోనే ముందుస్తుగా కోవాక్సిన్ పంపిణీ కార్యక్రమం, నరేంద్రమోడీకే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలో సాధించిన విజయాలను ఎవరైనా పొగిడితే పోయేదేమీ లేదు. అబద్ధాల ప్రచారాన్ని చూసి ప్రపంచమంతా నవ్వితే ఎవరికి నష్టం. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. కరోనా పోరులో ఉన్న మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఇతరులకు ఉచితంగా వేస్తామని, అందుకయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించలేకపోతే కేంద్రమే భరిస్తుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సాధారణ పౌరులకూ అలాగే వేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో వెనకో ముందో అనేక దేశాల్లో కరోనా పోరులో 200 వరకు వాక్సిన్ల తయారీకి కసరత్తు జరుగుతోంది. వాటిలో మన దేశంలో హైదరాబాదు కేంద్రంగా భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పేరుతో ఒక దాన్ని తయారు చేస్తున్నది.
ఇక ఇతర దేశాల విషయానికి వస్తే ఉచిత వ్యాక్సిన్ వేయాలని జపాన్ పార్లమెంటులో చట్టపరమైన నిర్ణయం చేశారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, నార్వే వంటి అనేక దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. అన్నింటి కంటే చైనాలో ఉచితంగా, ప్రయోగాత్మకంగా వాక్సిన్ ఇవ్వటం గతేడాదే ప్రారంభించారు. ప్రచార కండూతి లేదని ఒక వైపు చెప్పుకుంటూనే బీజేపీ తన ప్రచార సేన ద్వారా సామాజిక మాధ్యమంలో ఇలాంటి పోస్టులు పెట్టించుకోవటం ఎవరెరుగనిది! గుడ్డిగా నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకు లేదు.
మరో పోస్టు కూడా తిరుగుతోంది. ప్రపంచానికి అమెరికా ఆయుధాలు ఇచ్చింది చంపుకోమని, పాకిస్థాన్ ఉగ్రవాదులను ఇచ్చింది చంపమని, చైనా కరోనాను ఇచ్చింది అందరూ చావాలని, నా భారత దేశం మాత్రమే మెడిసిన్ ఇస్తుంది అందరూ బతకాలని, అని దానిలో రాశారు. ఇది కాషాయ దళాల ఫ్యాక్టరీ ఉత్పత్తి అని వేరే చెప్పనవసరం లేదు. 2010-14 సంవత్సరాలతో పోల్చితే 2015-19 మధ్య (ట్రంప్ ఏలుబడి) అమెరికా అమ్మిన ఆయుధాలు 23శాతం పెరిగాయి. అనేక దేశాల మీద యుద్ధాలు చేస్తూ, చేయిస్తూ ఆయుధ పరిశ్రమలకు లాభాల పంట పండిస్తున్న అమెరికా మనల్ని కూడా వదల్లేదు. చైనా మీదకు మనల్ని ఉసిగొల్పటం, చైనాను బూచిగా చూపి దాని ఆయుధాలను మనకూ అంటగడుతోంది. తన దగ్గర కాకుండా రష్యా దగ్గర కొనుగోలు చేస్తామంటే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తోంది.అలాంటి ట్రంప్కు మద్దతు ఇచ్చిన పెద్దమనిషి నరేంద్రమోడీ, అమెరికా మనకు భాగస్వామి అని, ఎలా కౌగిలింతలతో గడిపారో తెలిసిందే. మన అదృష్టం కొద్దీ ట్రంప్ ఓడిపోయాడు గానీ లేకుంటే పరిస్ధితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే !
ప్రపంచానికి భారత్ మాత్రమే మెడిసిన్ ఇస్తుందా? 2019లో బ్లూమ్బెర్గ్ అనే అమెరికా కార్పొరేట్ సంస్థ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల సూచిక అంటూ 169 దేశాల జాబితా ఇచ్చింది. దానిలో మన స్థానం 2017తో పోల్చితే 119 నుంచి 120కి పడిపోయింది. ఈసూచికకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశం ఎన్ని ఔషధాలు తయారు చేస్తున్నది అని కాదు, మోడీ పాలనలో జనాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచారో అని గర్వపడాలి. ఎందుకంటే కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది బీజేపీనే కనుక ఆ ఖ్యాతి కూడా మోడీ ఖాతాకే జమకావాలి!
ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనా మూడు స్థానాలను పెంచుకొని 52వ స్ధానంలో ఉంది. మన పక్కనే ఉన్న శ్రీలంక 66, బంగ్లాదేశ్ 110 స్థానాల్లో ఉండగా, మన 120వ స్థానానికి దగ్గరగా పాకిస్థాన్ 124లో ఉంది. ఆరుదశాబ్దాలకు పైగా అష్టదిగ్బంధనలో ఉన్న క్యూబా 31 నుంచి 30వ స్ధానానికి ఎదగ్గా, దాన్ని నాశనం చేయాలని చూస్తున్న అమెరికా 34నుంచి 35కు పడిపోయింది. జనం ఆరోగ్యానికి తోడ్పడని ఔషధాలు ఎన్ని తయారు చేస్తే ప్రయోజనం ఏముంది? అదేదో సినిమాలో అన్నట్టు దీనమ్మ జీవితం ఏది మాట్లాడినా నరేంద్రమోడీకే తగులుతోంది.
మన దేశం ఔషధాల ఉత్పత్తిలో ముఖ్యంగా వాక్సిన్లు, జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నమాట వాస్తవం. అదేదో ఆరున్నరేండ్ల నరేంద్రమోడీ పాలనలోనే సాధించినట్టు చిత్రిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఔషధాల ప్రయోగాలకు దొరికే వలంటీర్ల ఖర్చు మన దగ్గర చాలా తక్కువ, సకల రోగాలకు నిలయంగా ఉంది గనుక ప్రయోగాలూ ఇక్కడ ఎక్కువే. నిపుణులు ఉండటం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వంటి అంశాలు మన దేశంలో ఔషధ పరిశ్రమ అభివృద్దికి తోడ్పడ్డాయి. అయితే ప్రపంచంలో మన స్ధానం ఎక్కడ అని చూస్తే మొదటి 15దేశాలలో 2018 సమాచారం ప్రకారం 16.8శాతంతో జర్మనీ ప్రధమ స్ధానంలో ఉండగా 12.2, 7.5శాతాలతో స్విడ్జర్లాండ్, బెల్జియం తరువాత ఉన్నాయి. మన దేశం 3.8శాతంతో 12స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న జర్మనీ ఎగుమతుల విలువ 62.3 బిలియన్ డాలర్లు కాగా మన విలువ 14.5బి.డాలర్లు. మన ఈ స్థానానికి చైనా కూడా ఒక కారణం. మన ఔషధ ఉత్పత్తులకు అవసరమైన ముడి సరకుల్లో చైనా నుంచి 60నుంచి 70శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం. మిగతా దేశాలతో పోలిస్తే అవి చౌక గనుకనే ఆ దిగుమతులు అన్నది గమనించాలి. అందువలన గొప్పలు చెప్పేవారు ఇంటా బయటా నిజంగా నరేంద్రమోడీ పరువు పెంచాలనుకుంటున్నారా తుంచాలనుకుంటున్నారో ఆలోచించుకుంటే మంచిది. ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుంటే నరేంద్రమోడీకి గౌరవం, మర్యాద మిగులుతాయి.
కరోనా వాక్సిన్ మనదేశంలో తయారు చేసినా మరో దేశంలో రూపొందించినా అది శాస్త్రీయ ప్రాతిపదికన తయారు చేస్తున్నది తప్ప మాయలు మంత్రాలతో కాదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని గతంలో చెబితే ఇప్పుడు ఆవు మూత్రం-పేడలో లేనిదేమీ లేదు అని చెప్పటాన్ని చూస్తున్నాం. మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ముంచుకువచ్చినా దాని నుంచి రక్షించేందుకు వాటినేవీ బయటకు తీయలేదంటే ఉన్నాయని చెబుతున్నవారినేమనాలి? నిజంగా అవి ఉండీ ఉపయోగం ఏముందీ!
ఊహలను వాస్తవాలుగా సాక్షాత్తూ నరేంద్రమోడీయే చెప్పటాన్ని చూశాం. వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏనుగుతల అంటించటం, కృత్రిమ గర్భం ద్వారా కర్ణుడిని కనటం వేల సంవత్సరాల క్రితమే ఉందని నరేంద్రమోడీయే సెలవిచ్చారు. గురుత్వాకర్షణ, అణు సిద్ధాంతం అన్నీ పాతవే, మనవే అని చెప్పిన తీరూ చూశాం. ఇన్ని చెప్పిన వారు ఆవు మూత్రంలో ఏమున్నాయో తెలుసుకొనేందుకు పరిశోధనలు జరపమని పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటాన్ని ఏమనాలి. వేదాల్లో, సంస్కృత గ్రంథాల్లో అన్నింటి గురించీ చెప్పారు గానీ ఆవు మూత్రంలో ఏమున్నాయో చెప్పలేదా! పోనీ ఆవు మూత్రం నుంచి కరోనా వాక్సిన్నూ రూపొందించలేదూ?
ప్రపంచమంతా కరోనా కల్లోలం గురించి ఆందోళన పడుతుంటే బీజేపీ, ఇతర కాషాయ పెద్దలు చెప్పిందేమిటి? గతంలో ఆవు మూత్రం తాగితే క్యాన్సరే మాయం అవుతుందన్నారు. తాజాగా దాన్ని కరోనా వైరస్కు ఆపాదించారు. దీపాలు వెలిగిస్తే వైరస్ భస్మం అవుతుందన్నారు. జనం అవన్నీ మరచిపోయారని కాబోలు ఇప్పుడు తమ నరేంద్రమోడీయే దగ్గరుండి వాక్సిన్ తయారు చేయిస్తే ఓర్చుకోలేకపోతున్నారని ఎదురుదాడికి దిగారు. ''ఆర్థికంగా, వైద్యపరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్కులు, శానిటైజర్లు వాడని హిందూ వ్యతిరేక మతాల మధ్య భారత్ కరోనా భరతం పట్టిందని, రెండు టీకాలు కనిపెట్టిందని'' తిప్పుతున్న పోస్టులో మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అనుమతించిన రెండింటిలో భారత్ బయోటెక్ వాక్సిన్ మాత్రమే మనది. మన దేశంలో సీరం సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్ బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రజెనికా తయారు చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా కొరవడిన పోస్టు అది.
ముస్లిం మత పెద్దలు కూడా తక్కువ తినలేదు. ఐదుసార్లు కడుక్కుంటే కరోనా అంటుకోదన్నారు. మసీదులను మూసివేస్తే దేవుడికి ఆగ్రహం వస్తుందన్నారు. మహిళల చెడునడత కారణంగా దేవుడికి కోపం వచ్చి కరోనా రూపంలో శిక్షిస్తున్నాడన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు చైనా వారే వైరస్ను ప్రపంచం మీదకు వదిలారని చెప్పారు. మనుషుల బుర్రలను నియంత్రించేందుకు యూదులు కరోనా వాక్సిన్ ఉన్న చిప్స్ ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారని ముస్లిం మతోన్మాదులు చెబుతున్నారు.
ఇంటా బయటా మతశాస్త్రాల బోధన - విద్యాలయాల్లో విజ్ఞానశాస్త్ర బోధన జరుగుతున్నా మూఢత్వం వదలని కారణంగా మొదటిదాని మీద ఉన్న విశ్వాసం రెండవదాని మీద లేదు. ఒక వేళ ఉంటే మోడీ వంటి పెద్దలు ఆశాస్త్రీయ, ఊహాజనిత అంశాలను ప్రచారం చేయగలరా ? ఆవు చేలో ఉంటే దూడలు గట్టున ఉంటాయా? బీజేపీ ఎంపీ, మాలెగావ్ పేలుళ్ల కేసు ముద్దాయి ప్రజ్ఞాసింగ్ ఒక టీవీలో మాట్లాడుతూ ఆవు మూత్రం కలిపినదానిని తాగితే తన రొమ్ముక్యాన్సర్ నయమైనట్టు చెప్పారు. పాలకులకు తాన తందాన పలికే ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జి నాగేశ్వరరావు కొన్నివేల సంవత్సరాల క్రితమే కణ పరిశోధనలు జరిపారని, వంద మంది కౌరవులు ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పుట్టారని సైన్స్ కాంగ్రెస్ సభలోనే సెలవిచ్చారు. అంతటితోనే ఆగలేదు నియంత్రిత క్షిపణులంటే వేరే ఏమీ కాదు విష్ణు చక్రం అన్నారు. పురాతన భారత్ను పొగిడే పేరుతో మత రాజ్యాలవరకు జనాన్ని తీసుకుపోవటమే వీరి లక్ష్యం. కాలుష్య నివారణకు యజ్ఞాల గురించి చెప్పేవారిని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, లక్ష సంవత్సరాలనాడే హిందూ రుషులు అణుపరీక్షలను జరిపారని చెప్పే శాస్త్రవేత్తలను, అప్పడాలు తింటే కరోనా పోతుందని చెప్పిన వారినీ చూశాం. కరోనా దెబ్బతో అలాంటి సొల్లు కబుర్లు చెప్పేవారి నోళ్లు కొంత మేరకు మూతపడ్డాయి. అలాంటి వారికి కరోనా సోకినప్పుడు ఆస్పత్రుల్లో చేరి ఉపశమనం పొందారు తప్ప ఆవు మూత్రం, అప్పడాల మీద ఆధారపడలేదు. ప్రతిదానికి ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తున్నది. దీనిలో రెండు రకాలు... అసలు మోడీ ఏం చేసినా విమర్శించ కూడదు అనే ఒక ప్రమాదకరమైన ధోరణితో కావాలని అడిగేవారు ఒక తరగతి. ఏదో చేస్తున్నారు కదా కాస్త సమయం ఇవ్వాలి కదా అప్పుడే విమర్శలెందుకు అని అడిగేవారు మరికొందరు.రెండో తరగతి కల్మషం లేని వారు.
విమర్శకు పెద్ద పీట వేసేది ప్రజాస్వామ్యం. నియంతృత్వ లక్షణాల్లో భజనకు అగ్రపీఠం ఉంటుంది. అధికారంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వాన్ని గాక ఇతరులను విమర్శిస్తే అర్ధం ఏముంది? ఏమైనా సరే మా మోడీని విమర్శిస్తే సహించం అంటే కుదరదు. గతంలో ఇందిరే ఇండియా - ఇండియా ఇందిర అన్న కాంగ్రెస్ భజన బృందం కంటే ఇప్పుడు మోడీ దళం ఎక్కువ చేస్తోంది. అది మోడీకే నష్టం కాదంటారా? కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినన్ని దశాబ్దాలు బీజేపీకి జనం ఇవ్వరు!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288