Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఒక మాటను నొక్కి వక్కాణించారు. అదేమంటే.. 'రాష్ట్ర ప్రయోజనాలరిత్యా ప్రజల సంక్షేమం దృష్ట్యా నేను అన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నా. మీతో కూడా వాటిని షేర్ చేసుకోలేకపోతున్నా' అంటూ అదేపనిగా ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటిదాకా.. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనీ, కూతుర్ని మంత్రిని చేయాలనీ ఆయన తపనపడ్డాడో లేదో తెలియదుకానీ, వారి అనుచరగణం, అనుయాయులు మాత్రం తెగ ఆరాటపడిపోయారు. అందుకోసమే పార్టీ కార్యవర్గాన్ని సమావేశపరుస్తున్నట్టు మీడియాలోనూ వార్త లొచ్చాయి. కానీ, ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. ఆ పదవులబాట పక్కకుపోయి.. 'బండకేసికొడతా.. కర్రుకాచి వాతపెడతా.. మరీ ఎక్కువ మాట్లాడితే తెలంగాణ భవన్ గోడవతల పడేస్తా...' అంటూ గులాబీ దళపతి అదేపనిగా తిట్లదండకం అందుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కొన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నానంటూ ఆయన అన్న విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలిపోయింది. ఆ బయటకు చెప్పలేకపోయిన విషయాలేమిటో తెలియక మంత్రుల దగ్గర నుంచి గ్రామ పంచాయతీ సర్పంచుల దాకా బుర్రలు గోక్కుంటున్నారు. ఇంతకీ ఆ సీక్రేట్లు పార్టీకి సంబంధించినవా..? ప్రభుత్వానికి సంబంధించినవా? లేక కుటుంబానికి సంబంధించినవా? అన్న టాక్ ఇప్పుడు సర్వత్రా నడుస్తున్నది. ఇదే విషయాల గురించి టీఆర్ఎస్కు చెందిన ఓ సీనియర్ నాయకుడిని కదిలించగా... 'ఏమో మొన్న ఢిల్లీకి పోయివచ్చిన దగ్గర నుంచి మా సార్ తెగ మారిపోయిండు... ఇది మోడీ, కేసీఆర్ ఉభయులకూ సంబంధించిన సమస్య. నాకేం తెలియదు బాబూ..' అనుకుంటూ అక్కడి నుంచి జారుకున్నాడు.
- బివిఎన్ పద్మరాజు