Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్ (77) గుండెపోటుతో జనవరి 8న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 60ఏండ్లుగా కార్మిక ఉద్యమంలో పనిచేస్తున్న నరసింహన్ అమరత్వం ప్రజా కార్మికోద్యమానికి తీరనిలోటు. నిరంతరం కష్టజీవిగా, అలుపెరుగని కార్యకర్తగా, నాయకునిగా, ఉద్యోగ కార్మిక ప్రజాభిమానం చూరగొన్న నాయకులు నరసింహన్. వారి జ్ఞాపకాలు మరువలేం. నరసింహన్ తిరునల్వేలి (తమిళనాడు) జిల్లా, నంగునేరి గ్రామంలో 28.10.1943లో లక్ష్మీఅమ్మాల్- తిరుమలై దంపతులకు జన్మించారు. నరసింహన్ తిరునల్వేలి (తమిళనాడు)జిల్లాలో గ్రాడ్యుయేషన్ చేసి ఆర్ఎంఎస్ పోస్టల్ మధురై డివిజన్లో 1963 ఆగస్టు 5న ఉద్యోగంలో చేరారు. వారి సతీమని అలువెలుకు 1968లో టెలికాం డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో బదిలీపై వారి కుటుంబంతో 1969 ఫిబ్రవరి 12న హైద్రాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీదేవి, శ్రీవిద్య ఉన్నారు. 1968లో దేశవ్యాప్తంగా జరిగిన ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ సమ్మెలో టి.నరసింహన్ చురుకైన పాత్ర పోషించారు. ఆర్ఎంఎస్. గ్రూప్-4వ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా 1970లో ఎన్నికయ్యారు. 1974లో గ్రూప్-4వ క్లాస్ కార్యదర్శిగా ఎన్నికైన 1980 వరకు ఆ బాధ్యతలలో ఉన్నారు. 1981లో పోస్టల్ సర్కిల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగాను, 1985లో పోస్టల్ సర్కిల్ సెక్రెట్రరీగానూ బాధ్యతలు చేపట్టి 2000 సంవత్సరం వరకు బాధ్యతలో పనిచేశారు. 1995 నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులుగా, 2018లో సీపీఐ నేషనల్ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఉన్నారు.
2000సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మికసంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా జాతీయ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికై తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతూ వారి ఉద్యమంలో మమేకమై ఉన్నారు. 2003 అక్టోబర్ 31న రైల్వే మెయిల్ సర్వీస్ విభాగం నుంచి పదవీ విరమణ పొందారు. వారి సతీమణి అలువేలు బీఎస్ఎన్ఎల్ విభాగంలో 2007లో పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షనర్స్ అసోసియేషన్కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 2014 వరకు బాధ్యతలలో ఉన్నారు. 2001 హైదరబాద్లో జరిగిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలో జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2016లో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికోబడినారు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీకి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఏఐటీయూసీ రాష్ట్ర 10వ మహాసభలో ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడి రాష్ట్ర విభజన వరకు పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్కు అధ్యక్షులుగా ఎన్నికై 2019 వరకు కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, నాయకులు సాగరహారంతో పాటు, సకలజనుల సమ్మె వంటి అనేక ఆందోళనలలో ముందు వరుసలో ఉండి నడిపించారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఉద్యోగ కార్మికులకు నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీలు అమలుపర్చాలని 2015లో ఏఐటీయూసీ చేపట్టిన ప్రచార ఆందోళనలలో రాష్ట్ర బాధ్యులుగా చురుగ్గా పాల్గొని ఏఐటీయూసీని రాష్ట్రంలో విస్తరించటానికి కృషి చేయటంలో ముందు వరుసలో ఉన్నారు. 2019 ఏప్రిల్లో జరిగిన రెండవ మహాసభలో గౌరవ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు. టి.నరసింహన్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించటం యావత్ కార్మిక వర్గానికి తీరనిలోటు.
కేంద్ర ప్రభుత్వ సెక్టార్లో పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలోని సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్లార్లకు ఇన్చార్జిగా పనిచేస్తూ సింగరేణి, మెడికల్, బ్యాంకు, ప్యాక్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ రాష్ట్ర యూనియన్లకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో పోస్టల్, టెలికాం ఉద్యోగులు జాతీయ స్థాయిలో చేపట్టిన అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ క్రియాశీలక పాత్ర పోషించారు నరసింహన్. రాష్ట్ర కనీస వేతనాల బోర్డులో సభ్యులుగా 2014-16, 2016-18వరకు కొనసాగారు. అసంఘటితరంగంలో పనిచేస్తున్న వివిధ షెడ్యూల్ ఆఫ్ ఎంప్లారుమెంట్ కేటగిరీ వారికి కనీస వేతనాలు పెంచటానికి కృషి చేశారు.
- యు.రత్నాకరరావు