Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(గతసంచిక తరువాయి)
డబ్బు ప్రారభమైన తర్వాతే, 'మారకాలు' అనే మాట పోయి, అమ్మకాలూ, కొనడాలూ, అనే మాటలు వచ్చాయి. వాటిలో ఏది జరగాలన్నా, సమానమైన మారకం విలువల మధ్యనే జరగాలి- అనే విషయం కొంచెం ప్రారంభమైంది.
ఒక వస్తువుని తయారు చేసుకున్న మనిషి, (లేదా ఆ కుటుంబం) ఆ వస్తువుని తన స్వంతానికే వాడుకుంటే, అది, దాని 'ఉపయోగపు విలువ'ని వాడుకోవడమే. లేదా, దాన్ని మారకంలో పెట్టినా, లేకపోతే దాన్ని అమ్మినా, దాని ఉపయోగ విలువ గాక, దాని 'మారకం విలువ'ని వాడుకున్నట్టు అవుతుంది.
'డబ్బు' అనేది ప్రారంభమైన కాలంలో, రక రకాల ధాన్యాలు గానీ, రాగీ, ఇనుమూ వంటి లోహాల బిళ్ళలు గానీ మొదట్లో డబ్బుగా వుండేవేమో!
వాటన్నిటినీ వదిలేసి, ఇప్పుడు 'డబ్బు' అంటే, బంగారం గురించే చూడాలి. బంగారం, చాలా మదువైన లోహం. అంతే కాదు, ఎక్కువ విలువైన లోహం. ఏ వస్తువుని కొనడానికైనా, అతి చిన్న బంగారం ముక్కతో సరి పోతుంది. ఒక గోధుమల బస్తాని కొనాలన్నా, దాని విలువతో మారడానికి, చిన్న బంగారం నాణెం చాలు! అంత శ్రమ జరిగితేనే బంగారం తయారవుతుంది.
అయితే, బంగారం నాణాలతో ఒక ఇబ్బంది వుంది. ఏ వస్తువుని కొనాలన్నా, దేన్ని అమ్మాలన్నా, బంగారం నాణాలు, అందరి చేతుల్లోనూ, జేబుల్లోనూ, సంచుల్లోనూ, తిరుగుతాయి. బంగారం నాణెం ఎంత కొత్తది అయినా, కొంత కాలానికి అది, కొంత అరిగి పోవడమే అవుతుంది. అలా అరగడం వల్ల, 1 రూపాయి బిళ్ళ, అర్ధ రూపాయి బిళ్ళకి వుండ వలిసినంత బంగారంతో మాత్రమే వున్నట్టు, స్పష్టంగా కనపడుతూ వుంటుంది.
ఎక్కువగా అరిగి పోయిన బిళ్ళల్ని చెదర గొట్టించేసి, కొత్త బిళ్ళల్ని పూర్తి బంగారంతో చేయిస్తుంది ప్రభుత్వం. లేదా, ఆ బిళ్ళల వాళ్ళే అలా చేయించుకోవాలి. లేకపోతే, బాగా అరిగిపోయిన నాణాన్ని ఇచ్చి, ఒక వస్తువుని కొనాలంటే, ఆ వస్తువుని అమ్మేవాళ్ళు, తమ వస్తువుని ఇవ్వకపోవచ్చు. ప్రతీ సారీ అలా జరగదు.
అరిగి పోయిన నాణాల గురించి చూస్తే, 1 రూపాయి నాణెం ఎంత అరిగి పోయినా, దాన్ని 1 రూపాయి గానే భావిస్తూ, దాని తోనే అమ్మడాలూ, కొనడాలూ చేస్తూ వుంటారు జనం. ఆ పరిస్థితిలో నించే, కాయితం నోట్లు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే, ఎంత అరిగి పోయిన నాణాన్ని అయినా, నిండు నాణెం గానే, ఎంత విలువతో వుండాలో అంత విలువతో వున్నట్టే, దాన్ని జనం భావిస్తున్నారు కదా? 1 రూపాయి నాణాన్ని తీసుకోడానికి బదులు, కొంత అరిగి పోయిన నాణాన్నే పూర్తి విలువ గల నాణెంగా భావిస్తూనే తీసుకుంటున్నారు కదా? కాబట్టి, అసలు ఏ విలువా లేని కాయితం ముక్కల మీద రూపాయలుగా రాసి ఇస్తే, వాటికీ డబ్బుగా జనం అంగీకరించరా? - అనే చర్చలు వచ్చాయి.
ప్రభుత్వం జనాల బంగారాన్ని బ్యాంకులో దాచడమూ, జనాలకు 'కరెన్సీ' పేరుతో కాయితం నోట్లు ఇవ్వడమూ - ప్రారంభమైంది. ఆ ప్రారంభంలో అయితే, జనాలు, కాయితం నోట్లని చూసి భయపడ్డారు. బ్యాంకులో దాచిన తమ బంగారం నాణాలనే వెనక్కి తీసేసుకునే వారు.
చాలా కాలానికి, కాయితం నోట్ల కరెన్సీయే స్తిరపడి పోయింది. కానీ, కాయితం నోటే 'డబ్బు' కాదు, అదే బంగారం కాదు. అది, బంగారానికి బదులుగా వున్న ప్రతినిధి మాత్రమే. ఒక నోటుని పట్టుకుంటే, కొంత బంగారాన్ని పట్టుకున్నట్టే.
కాయితం డబ్బు పద్ధతి వచ్చినప్పటి నించీ, అమ్మే వస్తువు ఎంత మొత్తం శ్రమతో (సగటు శ్రమతో) తయారై వచ్చిందో, దానికి బదులుగా కాయితం రూపాయిలే వెళ్ళినా, నిజంగా వెళ్ళ వలిసిన బంగారం కూడా అంత శ్రమతో తయారైనదిగా వుండాలి.
10 రూపాయల కాయితం నోటుని, బంగారాన్ని అమ్మే షాపులోకి తీసుకు వెళ్ళి, ఆ నోటుని ఇచ్చి బంగారం ఇమ్మంటే, 10 రూపాయల విలువ గల బంగారాన్ని తప్పకుండా ఇస్తారు. అంటే, ఇచ్చినది కాయితం ముక్కే అయినా, అది బంగారానికి వున్న హౌదాతో వున్నట్టే. ఆ నోటునిఇచ్చి, బంగారాన్ని తీసుకుంటే, ఆ నోటు మనిషి, కొంత బంగారాన్ని అమ్మి, అంతే బంగారాన్ని కొన్నట్టే. బంగారం షాపు మనిషి కూడా, ఆ నోటు ద్వారా వచ్చే బంగారం కోసం, తను అంత బంగారాన్ని ఇచ్చినట్టే.
'' 'డబ్బు' అంటే, బంగారమే'' అని చెప్పుకున్నాం.
బంగారం తయారవ్వాలంటే, అది ఎక్కడ దొరుకుతుందో, ఆ గని లోనించి శ్రమ మొదలవ్వాలని చెప్పుకోవాలి.
అంటే, 'డబ్బు' అంటే, మానవ శ్రమే.
'డబ్బు' అంటే, ఏదో ఒక ధాన్యంతో వుండేటప్పుడు కూడా ఆ ధాన్యం కోసం శ్రమలు జరగ వలిసిందే.
'డబ్బు అంటే శ్రమే' - అనే విషయం కోసం, ఇంత వరకూ చూశాము.
'శ్రమ అంటే, డబ్బు కాదు' అనే విషయాన్ని ఇక్కడ చూడాలి.
శ్రమ ఎక్కడ జరిగితే అక్కడ, ఆ శ్రమ తప్పకుండా 'డబ్బు' అవుతుందా? అంటే, డబ్బుతో మారుతుందా - అని!
తేలిగ్గా అర్ధం అవడానికి, ఇళ్ళల్లో జరిగే శ్రమల్ని చెప్పుకుందాం. వంటల పనులూ, ఇంటి శుభ్రతలూ, పిల్లల పెంపకాలూ, వద్ధుల సంరక్షణలూ, ఇటువంటి వన్నీ శ్రమలే. ఈ శ్రమల్ని ఆడ వాళ్ళు చేస్తారా, మొగ వాళ్ళు చేస్తారా - అనేది వేరే విషయం. ఎవరు చేసినా, ఆ శ్రమలు డబ్బుతో మారతాయా? ఇంటి శ్రమలు ఎవరు చేస్తారో, వాళ్ళు ఆ శ్రమల్ని చేసి, వాటికి బదులుగా డబ్బు తీసుకుంటారా? - ఎవరి నించి తీసుకుంటారు? ఎవ్వరి నించీ తీసుకోరు.
ఇంటి శ్రమలకు బదులుగా డబ్బు రావాలంటే, ఆ శ్రమల్ని అమ్మెయ్యాలి. అమ్మేస్తేనే ఆ శ్రమలకు బదులుగా డబ్బు వస్తుంది. ఏ శ్రమల్ని అయినా, అమ్మక పోతే డబ్బు రాదు.
ఇంటి శ్రమల్ని ఎవరు చేసినా, ఇంటిలో ఉపయోగాల కోసమే చేస్తారు గానీ, అమ్మకాల కోసం చెయ్యరు. ఒక వేళ, ఇంటి శ్రమల్ని అమ్మేస్తే, అవే శ్రమల్ని బైటి నించి కొనుక్కోవాలి. ఇంటి శ్రమల్ని అమ్మడాలూ, మళ్ళీ అవే శ్రమల్ని కొనడాలూ - ఈ రెండూ అర్ధం లేని, తర్కం లేని పనులే.
ఇంటి పనుల కోసం పని మనుషులు వుంటే, ఇంటి వాళ్ళు పని మనుషులు చేసే శ్రమలు చెయ్యరు. లేదా, కొన్ని చేస్తారు, కొన్ని చెయ్యరు.
ఇంటి వాళ్ళు చెయ్యని పనుల్ని పని మనుషులు చేస్తే, ఇంటి వాళ్ళు పని మనుషుల నించి ఆ శ్రమల్ని కొని, వారికి డబ్బు ఇస్తారని అర్ధం. అయితే, 'జీతం' అనే దాన్ని ఏ సందర్భంలో చూసినా, జరిగిన శ్రమకి అంతటికీ డబ్బు వెళ్ళదు. మనం ఇక్కడ చూడవలిసింది, 'శ్రమ దోపిడీ' సంగతి కాదు. కొంత శ్రమకే డబ్బు ఇచ్చి, కొంత శ్రమకి డబ్బు ఇవ్వక పోతే, అదే, 'శ్రమ దోపిడీ'. ఇంటి పనులకు పని మనుషులు వుంటే, వాళ్ళ శ్రమలో కొంత భాగం డబ్బు లేకుండానే, ఉచితంగా జరుగుతుంది. పని మనుషులకు జీతాలుగా 'డబ్బు' ఇచ్చినా, వాళ్ళ శ్రమ అమ్మకం అయిందనీ, ఆ శ్రమే, డబ్బుతో మారకం అయిందనీ కాదు. ఈ సంగతి తెలియాలంటే,'ఉత్పాదక అనుత్పాదక' శ్రమల తేడాలు తెలియాలి.
''డబ్బు అంటే శ్రమే - అనీ, శ్రమ అంటే డబ్బు కాదు'' అనీ, మొదటి సారి గ్రహించింది మార్క్సు ఎంగెల్సులే.'డబ్బు' ని మార్క్సు, 'జనరల్ ఈక్వివలెంట్' అన్నాడు. అంటే, డబ్బుఅనేది, ఏ వస్తువుతో అయినా మారేటటువంటిది-అని అర్ధం.
పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు, మార్క్సు ఎంగెల్సులు చెప్పిన విషయాలన్నిటినీ వ్యతిరేకించటమే చేస్తారు. ఈ ఆర్ధిక వేత్తలు, ''డబ్బూ, శ్రమా'' అనే విషయాల గురించి ఏం చెపుతారంటే: 'డబ్బు అంటే శ్రమే, శ్రమ వల్ల వచ్చేదే' అని చెప్పినపుడు, శ్రమలో కొంత భాగానికి డబ్బు రాదు - అనడం ఎందుకు? 'డబ్బు' అనేది, శ్రమ వల్ల వచ్చేదే - అయినప్పుడు, ఏ శ్రమకి అయినా, డబ్బు రాక తప్పదు కదా? ఏ శ్రమ అయినా, డబ్బుగా మారేదే కదా?' - అంటారు, ఆ వ్యతిరేకులు.
కమ్యూనిస్టు సమాజంలో, 'సరుకుల' దృష్టీ, అమ్మకాలూ - కొనడాలూ, వుండనక్కర లేదు - అని మార్క్సు ఎంగెల్సులు చెప్పేదాన్ని, పెట్టుబడిదారీ మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
'డబ్బు అంటే శ్రమే' అయినప్పుడు, ఆ శ్రమ అంతా ఎక్కడ జరిగితే అక్కడ అది డబ్బుతో మారవలిసిందే కదా?' అంటారు.
మార్క్సు ఎంగెల్సులు, 'శ్రమ దోపిడీ'ని వ్యతిరేకించే మానవులు.
మానవ సమాజంలో, వెనకటి కాలంలో, 'మారకాల పద్ధతి'తో సాధ్యం కాకనే, 'డబ్బు పద్ధతి' వచ్చింది. కానీ, 'కమ్యూనిస్టు సమాజం' గురించి, వైరుధ్యాలు లేని భావాలు అభివృద్ధి చెంది, 'మానవ సమాజాన్ని, డబ్బు సమస్యలు లేకుండా డబ్బుని రద్దు చేసుకోవాలి' - అనే భావాలు ఏర్పడ్డాయి.
మానవ సమాజానికి రక రకాల శ్రమలు అత్యవసరమే. కానీ, 'డబ్బు'తో అటువంటి అవసరం లేకుండానే సమాజం సాగ వచ్చు.
సమాజంలో, ప్రతీ అంశాన్నీ 'ఉపయోగపు విలువ' దృష్టితో అర్ధం చేసుకుంటే, మారకాలూ, మారకం విలువ దృష్టీ, అవసరం కాలేవు.
శత వైరుధ్యాలు లేని మానవ సమాజం కోసమే కమ్యూనిస్టు విధానం అవసరం. ఆ సమాజం ఏర్పడాలంటే, 'శ్రమ దోపిడీ' తోటీ, డబ్బు సమస్యల తోటీ, చిక్కుకోకుండా సాగే సమాజాన్ని నిర్మించుకోవాలి.
మానవ సమాజానికి శ్రమలే అవసరం గానీ, ఆ శ్రమలకు డబ్బుతో మారకాలు అవసరం కాదు.
'కమ్యూనిస్టు సమాజం కోసం పెట్టుబడిదారీ విధానం అంతా పూర్తిగా రద్దు కావాలి'అనే సారాంశంతో నేను రాసే మరో వ్యాసంలో, అనేక రద్దులతో పాటు, 'డబ్బు రద్దుని' కూడా వివరంగా, మార్క్సు ఎంగెల్సుల మాటలతో చూపిస్తాను, త్వరలో.
- రంగనాయకమ్మ