Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు దాదాపు రూ.100కు చేరుకున్నాయి. ఈ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. మోటార్ వెవికల్స్, టాక్సీలను ఆధారం చేసుకొని బతికే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పెట్రోల్, డీజిల్లపై ఆధారపడి నడిచే చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉంది. కరోనా సంక్షోభ కాలంలో అంతర్జాతీయంగా రవాణా రంగం స్థంభించిన ఫలితంగా చమురు ధరలు అన్ని దేశాల్లో తగ్గాయి. కానీ, మనదేశంలోనే అంతర్జాతీయ ధరలకు విరుద్ధంగా సామాన్యుల నడ్డివిరిచే చమురు ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచ ముడిచమురు (క్రూడ్ ఆయిల్)పై ఆధారపడి ఉంటాయి. ముడిచమురు వెలికితీయడం, దాన్ని శుద్ది చేయడం, దాన్ని పంపిణీ చేయడాన్ని ఆధారం చేసుకొని పెట్రోల్, డీజిల్ రేట్లను లెక్కించి ప్రకటిస్తున్నారు. దీని ప్రకారం మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు, గంట గంటకి హెచ్చు, తగ్గులు ఉంటున్నాయి. కానీ ఈ సంవత్సరకాలంలోనే ముడి చమురు ధర వాస్తవానికి 15శాతం తగ్గింది. కానీ ఇండియాలో ఆయిల్ ధరలు 7 నుంచి 11 శాతానికి పెరిగాయి. గత ఏడాది జనవరిలో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 64.31 డాలర్లు నుంచి 54.79 డాలర్లకు తగ్గింది. కానీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.75 నుంచి 86కు పెరిగాయి. వాస్తవానికి పెట్రోల్ రూ.32 మూలధర (బేస్ ధర) ఉంది. దీనికి రూ.33 కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను సెస్ విధిస్తుంది. రాష్ట్ర పరిధిలో రూ.33 నుంచి 40 వరకు కమిషన్ వ్యాట్ డీలర్ కమిషన్ రూపంలో పన్ను విధిస్తుంది. అంటే మొత్తం లీటర్ పెట్రోల్ ధర రూ.86 నుంచి 90 వివిధ రాష్ట్రాల్లో మన దేశంలో వినియోగదారుడు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే చమురుపై కేంద్ర ప్రభుత్వం 37శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 23శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్రం పెట్రోల్ లీటర్కు రూ.20 నుంచి 33కు పన్ను పెంచింది. అంటే అసలు ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్లే ఎక్కువ.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్స్ల్లో యూపీఏ ప్రభుత్వం 2015-2016లో 2.09లక్షల కోట్లు ఉంది. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 2019-20 వరకు 2.88లక్షల కోట్లు వసూలు చేస్తుంది. అంటే గడిచిన ఐదేండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా 90వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. దీనికి ఏ మాత్రం తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచుతున్నాయి. 2015-16లో 1.60 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశాయి. ఇప్పుడు 2019-2020కి 2.21లక్షల కోట్లకు పెంచింది. అంటే పన్ను వేయడంలో ప్రజలపై భారాన్ని మోపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పన్ను విధింపు కారణంగానే పెట్రోల్, డీజిల్ రేటు పెరుగుతుంది అనేది వాస్తవం. పన్ను విధింపునకు సడలింపు ఇస్తే రేటు తగ్గుతుంది. ధరల పెంపు అంశం ప్రభుత్వాల మీద కాదు ప్రపంచ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది అంటూనే ఏడా పెడా పన్నులు విధిస్తున్నారు. ప్రజలపై పన్నుల భారాలను మోపి ప్రభుత్వాల ఆదాయాలను పెంచుకునే చర్యే ఇది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులను ఏట్టి పరిస్థితుల్లో తగ్గించం. తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోతుందని అంటున్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలపై పన్ను విధించే ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం రాయితీల మీద రాయితీలిస్తున్నాయి.
ప్రభుత్వాల ఆదాయాలకు ప్రజలపై పన్నుల భారమే మార్గం కాదు. మన దేశంలో గడిచిన 7ఏండ్లల్లో అనేక కార్పొరేట్ సంస్థలకు, అదానీలకు, అంబానీలకు రాయితీలు ఇచ్చారు. బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. దేశ సహజ సంపదను అప్పనంగా కట్టబెట్టారు. ఓఎన్జీసీ వంటి సహజంగా లభించే నిక్షిప్తగనులను 'బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఉచితంగా ఇచ్చారు. కానీ ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలపై పన్నుల భారాన్ని అరికట్టి, చమురు ధరలను తగ్గించమంటే మాత్రం ఆదాయం పడిపోతుంది అంటున్నారు. ఒక వైపు కార్పొరేట్స్కు రాయితీలు ఇస్తూ, బ్యాంకు రుణాలను మాఫి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై మాత్రం కనికరం చూపించడం లేదు. పైగా ధరల అంశం ప్రపంచ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుందని, చేతులు ఎత్తేస్తున్నారు. ఇది సరైంది కాదు. నిర్మలా సీతారామన్ రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటే తగ్గించుకొండి మేము మాత్రం తగ్గించే ప్రసక్తిలేదని తెగేసి చెపుతున్నారు. అంటే ప్రజలపై వీరికి ఎంతటి ప్రేమో అర్థం అవుతుంది. కరోనా కష్టకాలంలో ధరల పెరుగుదలను అరికట్టి ప్రజలపై పన్నులను తగ్గించాల్సిన ప్రభుత్వం మరింత పెంచుతుంది. అలా వచ్చిన ఆదాయం ద్వారా ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలను బాగు చేస్తుందనుకొంటే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఐడీపీఎల్, బీహెచ్ఈఎల్, ఏయిర్పోర్ట్సు, నౌకాశ్రయాలు, రైల్వేలను వరుస పెట్టి అమ్ముతున్నారు. మరీ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఏటు దారి మళ్లుతుందో అర్థం చేసుకోవచ్చు.
- పి. మహేష్
సెల్:9700346942