Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం''.. ''వ్యాపారం ప్రభుత్వం పని కాదు'', ''కేవలం నాలుగు సంస్థలు మాత్రమే ప్రభుత్వ రంగంలో వీలైనంత కనిష్ట పరిమాణంలో ప్రభుత్వ పెట్టుబడులతో ఉంటాయి..'' అని మన ప్రధానమంత్రి ఈ మధ్యనే ప్రకటించారు. ప్రభుత్వ రంగం పట్ల పాలకుల చిన్న చూపుకు ఇది నిదర్శనం. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన ప్రభుత్వ రంగం పట్ల పాలకుల విధానాలు శోచనీయం..
కోవిడ్ మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అయింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందింది. నిరుద్యోగం పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. మన దేశం విషయానికి వస్తే జీడీపీ వృద్ధి 4.2శాతం కనిష్ట స్థాయికి పడిపోయింది. అసంబద్ధమైన, అశాస్త్రీయమైన లాక్డౌన్ వల్ల లక్షలాది వలస కార్మికులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఎంతోమంది తమ కుటుంబాలకు దూరమయ్యారు. వారిని తమ గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల వందల కిలోమీటర్ల దూరం నడక సాగిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారెందరో? రైలు పట్టాలపై నడుస్తూ అలసి నిద్రపోయిన సమయంలో గూడ్స్రైలుకు బలైన 17మంది కార్మికుల వ్యధ, 'పగిలిన పాదాల నెత్తురుతో నడుస్తూ' తన ప్రాణాలు విడిచిన చిన్నారి ఉదంతం మనల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇలాంటి సంఘటనలు ఎన్నో...
అయితే... ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా నిలబడింది ప్రభుత్వ రంగమే. కోవిడ్ విస్తృతమవుతున్న తరుణంలో ప్రభుత్వ వైద్యశాలలు మాత్రమే ప్రజలను అక్కున చేర్చుకున్నాయి. పరీక్షలు నిర్వహించి, నిర్థారించి, చికిత్సనందించి సామాన్యుల పాలిట ఆపద్బాంధవులయ్యాయి. సరైన రక్షణ చర్యలు లేకుండా.. అరకొర వసతుల మధ్య, చాలీచాలని వైద్య సౌకర్యాల నడుమ, దినదినగండంగా గడుపుతూ ప్రజలకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, చికిత్సను అందించిన ఘనత ప్రభుత్వ వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులదే...
కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ముందుండి నిలిచినవారు పారిశుద్ధ్య కార్మికులు. మొదట్లో కరోనా వ్యాధి పట్ల దుష్ప్రచారం, భయాందోళన కలిగించే వార్తల వల్ల ప్రజలు వ్యాధి బారిన పడ్డ వారిని అంటరాని వారిగా చూశారు. మరణించిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడి ఆప్తులు కూడా అనాధ శవాలుగా వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో మరణించిన వారికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకున్నారు పారిశుధ్య కార్మికులు. చికిత్స పొందుతున్న వారికి సపర్యలు చేయడంలో, కోవిడ్ వార్డులు శుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల ఔదార్యం మరువలేనిది.
మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ వల్ల కోట్ల మంది కార్మికులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు ఉపాధిని కోల్పోయి తినడానికి తిండిలేని దుస్థితిలోకి నెట్టి వేయబడ్డారు. అసమగ్ర విధానాల వల్ల ప్రభుత్వాలు వీరికి చేసిన సహాయక కార్యక్రమాలు కంటితుడుపు చర్యలయ్యాయే తప్ప పరిష్కారాలు కాలేదు. పొట్టకూటి కోసం వీరు పడ్డ తిప్పలు వర్ణనాతీతం. ఇలాంటి సమయంలో ఎంతోమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, మానవత్వం కలిగిన పౌరులు స్వతహాగా పేదవారికి అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు అందించి ఎంతోమంది ఆకలి తీర్చారు. వలస కార్మికులను గమ్యానికి చేర్చడంలో, ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చడంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ చూపిన చొరవ ప్రశంసనీయం.. కరోనా వారియర్స్గా నిలిచిన మరో రంగం రక్షణ రంగం. లాక్డౌన్ను విజయవంతం చేయడంలో, కంటైన్మెంట్ జోన్లను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కృషిచేసిన పోలీసులు, రక్షణ సిబ్బంది పాత్ర విస్మరించలేనిది..
కోవిడ్ విస్తరణ వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. విద్యా రంగం కుదేలైంది. ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలను ప్రారంభించి కూడా విద్యారంగాన్ని ప్రారంభించడానికి మాత్రం మీనమేషాలు లెక్కించాయి. విద్యా వ్యవస్థ ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వనరు కాదనే ఉద్దేశంతో నిర్లక్ష్యం వహించారు. మేధావులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతోకాలంగా అభ్యర్థించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యను ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికీ పర్యటించి విద్యార్థులను, తల్లిదండ్రులను చైతన్యం చేశారు. ఆన్లైన్ విద్య అందించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేశారు. కరోనా కాలంలో ప్రయివేటు, కార్పొరేటు రంగాలు సహాయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయి. ప్రయివేటు ఆసుపత్రులన్నీ మూసివేయబడ్డాయి. తమ సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని క్రూరత్వం ప్రదర్శించాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా కార్మికులను విధుల నుంచి తొలగించి.. వేతనాలు చెల్లించక వారి కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి. ప్రభుత్వాల ద్వారా లక్షల కోట్ల రాయితీలు పొందిన ప్రయివేటు, కార్పొరేట్ అధినేతలు ప్రజలకోసం చేసింది శూన్యం. అలాగే కార్పొరేట్ పాఠశాలలు కూడా ఆన్లైన్ క్లాసుల పేరిట తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసి తమ సిబ్బందికి మాత్రం జీతాలు చెల్లించకుండా నడిరోడ్డుపై వదిలేశారు. రికార్డెడ్ క్లాసులు టెలికాస్ట్ చేస్తూ.. ఉపాధ్యాయులకు బోధించే అవకాశం లేకుండా చేశారు..
కోవిడ్ నేర్పిన పాఠాలు
1. కోవిడ్ విజంభిస్తున్న పరిస్థితుల్లో వైద్యరంగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేశాలు మాత్రం దీటుగా ఎదుర్కొని నియంత్రించాయి. స్పెయిన్ ప్రయివేటు ఆస్పత్రిలన్నింటినీ జాతీయం చేసింది. క్యూబా ప్రపంచంలోని 50కి పైగా దేశాలకు తమ వైద్య బందాలను పంపించి ప్రపంచవైద్యుడుగా ప్రఖ్యాతి గాంచింది. వియత్నాం, దక్షిణ కొరియా లాంటి దేశాలు తగిన జాగ్రత్తలతో సకాలంలోనే కరోనాను కట్టడి చేశాయి.2. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు బాసటగా నిలిచారు. వేల కోట్లు ఆర్జించే కార్పొరేట్లు మాత్రం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కృషి చేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడింది లేదు. 3. ప్రభుత్వ విద్యా రంగమే అత్యున్నతమైనది, ప్రజలకు మేలైన విద్యారంగమని నిరూపించబడింది. ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధనకు మించిన ప్రత్యామ్నాయం లేదని తల్లిదండ్రులు, సమాజం గుర్తించేలా చేసింది. 4. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా పెట్టుబడిదారీ దేశాలకు లేదని తేటతెల్లమైంది. ప్రజల కోసం కాక కార్పొరేట్ల లాభాల కోసం తాపత్రయ పడే పెట్టుబడిదారీ దేశాలు ఉపద్రవాన్ని ఎదుర్కోలేక చేతులెత్తేశాయి.
పటిష్టమైన ప్రభుత్వ రంగ నిర్మాణమే సమస్త సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం అని నిరూపించబడింది. కానీ మన పాలకులు మాత్రం హెలికాప్టర్ల ద్వారా వైద్య సిబ్బందిపై పూలు జల్లి ఊరుకున్నారు. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని అశాస్త్రీయతను, మూఢనమ్మకాలను పెంచి పోషించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రాధాన్యతను గుర్తించకుండా ప్రయివేటీకరణ వైపు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ రంగంలో పటిష్టమైన నిర్మాణం కలిగిన ఎల్ఐసి, రైల్వే, అంతరిక్షం, బొగ్గు వంటి రంగాలను కూడా ప్రయివేటీక రించడానికి పూనుకుంటున్నారు. రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కబంధహస్తాల్లోకి చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. నేడు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..
- వంగటి అశోక్