Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ అనే పట్టణంలో సరిగ్గా రెండేండ్ల క్రితం 2018లో గౌరవ శర్మ అనే నిందితుడు ఒక దళిత యువతిపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన దేశమంతా సంచలనంగా మారింది. బాధితురాలి కుటుంబం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినందుకుగాను నిందితుడు గౌరవశర్మ అత్యాచార బాధితురాలి కుటుంబంపై కూడా అందరూ చూస్తుండగానే బహిరంగంగా దాడి చేశాడు. ఆ సంఘటనలను పౌరసమాజం ఖండించిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మేల్కొని నిందితుడిని అరెస్టు చేసింది. ఆ తర్వాత నిందితుడికి బెయిల్ దొరికింది. కోర్టులో కేసు పెడతారా అనే కక్షతో ఆ కుటుంబంపై పగ పెంచుకున్న గౌరవశర్మ అత్యాచార సంఘటన జరిగిన రెండేండ్ల తర్వాత స్థానిక ఆలయం వద్ద 2021 మార్చి1న అత్యాచార బాధితురాలి తండ్రిని విచక్షణారహితంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. ఇలాంటి సంఘటనల తర్వాత దేశంలో చట్టబద్ధ పాలన ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. బాధితురాలి కుటుంబాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం వల్లే ఈ హత్య జరిగింది.
నేరమయ రాజకీయాలే అసలు కారణం
దీనికి ఎవరు బాధ్యులు అని ఆలోచిస్తే వ్యవస్థీకతమైన నేరగాళ్లను పెంచి పోషిస్తున్న రాజకీయమే అని సమాధానం దొరుకుతుంది. రాజకీయము నేరము కలగలిపి సాగుతున్న ఘనమైన భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో రోజువారీ జరుగుతున్న అనేక అవకతవకలకు పత్రికలు మీడియాలో చూస్తున్న సంఘటనలకు వెనక ఎవరున్నారని సాధారణంగా ఆలోచిస్తే కొంతమంది వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కొంచెంలోతుగా ఆలోచిస్తే సమాజంలో నేరం రాజకీయాలు కలసి చెట్టాపట్టాలు వేసుకొని కొనసాగిస్తున్న నేరమయ రాజకీయాలు, చట్టబద్ధ పాలన లోపించడమే అసలైన కారణంగా కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి సమీపంలో న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిల బహిరంగ హత్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతకే ఒక పరీక్షగా మారింది. తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఈ హత్యపై సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను పట్టుకొని విచారణ జరిపి శిక్షించాలి. పట్టపగలు నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగా న్యాయవాద దంపతులను అతి దారుణంగా నరికి చంపడం చూస్తే మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేక అనాగరిక కాలంలో ఉన్నామా అనిపిస్తుంది. రాజ్యం ప్రధాన కర్తవ్యం ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ. అది విస్మరించి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్న అక్రమాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
చట్టబద్ధ పాలన పై జాతీయ సదస్సు ఏం తేల్చింది?
చట్టబద్ధ పాలన విషయంలో సమస్యలను వర్ణించడం కంటే సమస్య పరిష్కార మార్గం వైపు ఆలోచించాలనే మంచి ఉద్దేశంతో దేశంలో చట్టబద్ధ పాలనను మెరుగుపరచడానికి అవసరమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు చట్టబద్ధ పాలనపై తొమ్మిది రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈ తొమ్మిది రోజులలో దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులలతోపాటు దేశంలో ప్రఖ్యాతి చెందిన సామాజిక శాస్త్రవేత్తలు, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సుమారు 60మంది వరకు ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. రోజువారి తమ తమ శాఖలలో జరుగుతున్న అవకతవకలు పొరపాట్ల వల్లనే చట్టబద్ధ పాలన లోపించిందని, అందుకు తగిన న్యాయ, పోలీసు సంస్కరణలు రావాలని అన్నారు. చట్టబద్ధ పాలన లోపిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుందని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రోజువారి సంఘటనలను గమనిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగినట్లేనని తేల్చి చెప్పారు. ఈ సదస్సులో చట్టబద్ధ పాలన ఆచరణలో అమలు కావాలంటే చేయాల్సిన సంస్కరణల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
తాత కేసు వేస్తే మనవడి దాకా తెగని పంచాయితీలు కోర్టులలో నడుస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో అనవసర జాప్యం సకాలంలో అందని న్యాయం వల్ల సమాజంలో ''ఇన్స్టంట్''గా న్యాయం అందించే గుండాల వ్యవస్థ పెట్రేగి పోతున్నది. కోర్టుకు పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనే సామెత అందుకే పుట్టింది. కోర్టులో కేసు ఓడిన వాడు కోర్టు ముందు బహిరంగంగా లబోదిబో అంటే, గెలిచినవాడు ఇంటికెళ్లి ఎవరూ చూడకుండా బోరుమని ఏడుస్తున్నారు. ఇది మన న్యాయ వ్యవస్థ పనితీరుపై ఉన్న సామాన్యమైన సెటైరు.
సమాంతర కోర్టులను నడుపుతున్న నేరస్తులు
కోర్టుకెళ్తే మన సమస్య త్వరగా పరిష్కారం కాదనుకున్న సందర్భంలో సామాన్య ప్రజలు గూండాలను, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు. అలా సమాజంలో గుండాలే సమాంతరమైన కోర్టులను, సొంత అన్యాయ దర్బారులను నడుపుతున్నారు. దుర్మార్గులకు భయపడి మాట్లాడకుండా మౌనంగా ఉండే సమాజంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువవుతోంది. దాంతో ఈ అనధికార కోర్టులు నడుపుతున్న గుండాలే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మద్యం డబ్బు పంచి ప్రజల ఓట్లను కొల్లగొడుతున్నారు. నేరము రాజకీయం కలగలిపిన సమాజంలో ఇలాంటి హత్య రాజకీయాలు జరగడం సర్వసాధారణంగా మారుతుంది. వెనకటి కాలంలో నేరం చేసేవాడు వేరుగా ఉంటే రాజకీయాల్లో ఉన్న వాళ్లు వారిని రక్షించే సాధనాలుగా పనికివచ్చే వారు. కానీ ప్రస్తుతం రాజకీయాలలో నేరస్తులే అత్యున్నత మైన పదవులు పొందడం వల్ల నేర రాజకీయం సర్వత్రా వ్యాపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇక పోలీసుల పనితీరు చెప్పుకోవాలంటే వారు అధికార పార్టీ కొమ్ముకాస్తు న్నారు. దానికి కారణం వారి నియామకం నుంచి బదిలీలు చివరికి పదవీ విరమణ దాకా ప్రభుత్వ పెద్దల జోక్యం ఉండడమే కారణం. ఈ విషవలయంలో పోలీసులు కూడా పావులే. అక్రమ సంపాదనకు మరిగిన పోలీసులు అధికార పార్టీల అడుగులకు మడుగులు ఒత్తుతూ తాము సంపాదించుకుంటూ నేరమయ రాజకీయాన్ని కూడా పెంచి పోషిస్తున్నారు. సమాజంలోని న్యాయ వ్యవస్థ, పోలీసులు, రాజకీయ వ్యవస్థలు విఫలమైన సందర్భంలో మాత్రమే ఇలాంటి దారుణమైన హత్యలను మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజమంతా స్పందిస్తుంది. మీడియా పెద్దఎత్తున ఈ వార్తలను ప్రసారం చేస్తోంది. కానీ తర్వాత షరా మామూలుగా మారుతుంది. అందరం మర్చి పోతాం. మళ్లీ కొన్నాళ్ళకు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ చర్చలు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. హత్యా రాజకీయాల మూలాలను పరిష్కరించకపోతే ఎప్పటికీ ఇది ముగిసిపోని అంతులేని కథగా మారుతుంది.
- బి.రామ్మోహనరావు
సెల్ 9866074027