Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ దేశం నేడు పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారించి విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పరిశ్రమలను స్థాపించి, ఉపాదికల్పిస్తూ దేశప్రగతికి బాటలు వేస్తోంది. అయితే కర్మాగారాలలో జరిగే పేలుడు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు వంటివి నిత్యం సంభవిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు వెళ్ళినవారు తిరిగి క్షేమంగా ఇంటికీ వస్తారో లేదో అన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు బతకవలసి వస్తున్నది. దురదృష్ట వశాత్తు కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ప్రమాదంలో మరణించినా ఇక ఆ కుటుంబం మొత్తం కోలుకోని విధంగా దెబ్బతింటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతి కార్మికుడూ తానుతీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్ధతులను పాటిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి పెరుగుచున్న కొద్దీ, ఆ పరిశ్రమలతో పాటు ప్రమాదాలూ కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు భద్రత, ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడం కోసం, భద్రత, ఆరోగ్యం, వాతావరణం అంశాలపై కార్మికుల్లో అవగాహన కల్పించడంకోసం ప్రతి సంవత్సరం ''జాతీయ భద్రతా దినోత్సవం''ను మార్చి 4న జరుపుకుంటున్నారు.
భారతదేశంలో పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో కార్మికుల భద్రత గురించి చర్చ మొదలై, 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద, ప్రమాదాల పట్ల అప్రమత్తత పెంచాలంటే చేయవలసిన ప్రచారంపైన, కార్మికులలో భద్రతపట్ల అవగాహన పెంచడం పైన నిర్వహణ కొరకు ప్రభుత్వపరంగా ఒక సంస్థ అవసరమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక భద్రతపైన తొలి సమావేశం 1965లో ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థల నిర్వాహకులు పాల్గొన్న ఆ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్లో జరిగిన సమావేశంలో నిర్ణయించగా, మార్చి 4,1966న జాతీయ భద్రతామండలి ఏర్పడింది. కార్మిక మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమయిన మార్చి 4నే ''జాతీయ భద్రతా దినోత్సవం''గా జరపాలని నిర్ణయించారు. ఆ రోజు నుంచి వారం రోజులు పాటు భద్రతావారోత్సవాలు నిర్వహిస్తూ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ భద్రత, ఆరోగ్యం, పర్యావరణ అంశాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా, పారిశ్రామిక రంగానికి చెందిన వారినందరినీ ఇందులో భాగస్వాములను చేయడం రెండవ లక్ష్యంగా, భద్రత కల్పించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను గుర్తెరిగి అనుసరింపచేయడం మూడో లక్ష్యంగా కృషిచేస్తున్నది.
ఇందులో భాగంగా సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు, ఉద్యోగులు, కార్మికులతో భద్రతా ప్రతిజ్ఞను చేయించడం, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అవి జరిగినప్పుడు ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవనవిధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని నిరూపించారు.
పొట్టనింపుకోవడానికి ఎంత కష్టమైన పనులైనా, ఎంత ప్రమాదకరమైన పనులైనా కార్మికులు చేస్తుంటారు. ఈ పనుల్లో కొంత మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుంటే, మరి కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ప్రతి పనిలోను ఏదో ఒక ప్రమాదం ఉండే ఉంటుంది. కొన్ని రకాల ప్రమాదాలు ముందుగా గుర్తించి జాగ్రత్తపడవచ్చు. కాని జరుగుచున్న అధిక ప్రమాదాలు అజాగ్రత్తవల్ల సంభవిస్తున్నవే. అవి రహదారి ప్రమాదాలైనా, పారిశ్రామిక ప్రమాదాలైనా మానవ నిర్లక్ష్యం వల్ల జరగడం దురదృష్టకరం. క్రమక్రమంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున పారిశ్రామిక , రహదారి భద్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టి తగు జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతైనా ప్రమాదాలను తగ్గించవచ్చు. అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి వ్యక్తులు ఎలా బయటపడాలో అవగాహన ఉండడంవల్ల మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది.
కార్మికుడు కష్టపడ్డప్పటికి ఆనందంగా కుటుంబంతో ఉండాలంటే తప్పకుండా భద్రతానియమాలు పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిన్నింటిపై సరియైన అవగాహన ఉంటే కార్మికులు ఆనందంగా ఉండి, దేశం పురోభివృద్ధిలోకి వస్తుంది.
- జి. రఘుపతిరావు
సెల్:9963499282