Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు దశాబ్దాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్సీకే)లో సేవలు అందించిన లక్ష్మి ఈ రోజు మనకు లేదు. ఫిబ్రవరి 24 రాత్రి 11గంటలకు రాందేవ్రావు ఆస్పత్రిలో కన్నుమూసింది. బతికించు కోవడానికి కుటుంబం, పార్టీ, ఎస్వీకే చేయని ప్రయత్నాలు లేవు. లక్ష్మీ కృష్ణప్రసాద్ దంపతుల కష్టం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ప్రతి అంగులానికీ తెలుసు. తుదిశ్వాస విడిచే వరకూ ఎస్వీకేలోనే ఉంటానని చెప్పి అలాగే ఉన్నది లక్ష్మి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై గూండాలు దాడి చేస్తే తిరగబడి కొంగు నడుముకు చుట్టి కర్రలు చేతబట్టి నిద్రలేని రాత్రులు గడుపుతూ.. విజ్ఞాన కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వారిలో ముఖ్యులు ఈ దంపతులు. తెలుగు రాష్ట్రాలలో వీరి చేతి అన్నం తినని పార్టీ కార్యకర్తలు ఉండరేమో..
వంటశాలలో కాదు, నేను జనంలో ఉండి పని చేస్తానని కష్ణ ప్రసాద్ అడిగితే అప్పటి రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గారు ''మీ పని అందరూ చేయలేరు, పార్టీకి కీలకం, ఇది కూడా పార్టీ పనే'' అంటే అదే మాటకు కట్టుబడి పార్టీ కోసం పని చేశారు. లక్ష్మి మాస పత్రికలు అమ్మడంలో, ప్రజా పోరాటాలలో ముందుండేది. పోరాటం ఆమెకు జీవన విధానం. మెలనోమా కాన్సర్ వస్తే 3నెలలకు మించి బతకరు. కానీ ఈమె ఈ వ్యాధితో సుమారు ఏడాది పోరాడింది. చాలా ధైర్యవంతురాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా ఇంటికి వచ్చాక అన్ని పనులు చేసుకుందాం ఏడవద్దు అని భర్తకి ధైర్యం చెప్పింది. క్యాన్సర్తో బాధ పడుతూ మంచంపై ఉన్నప్పుడు గ్రామంలో పార్టీ కార్యకర్త చనిపోతే ఈమెను చూసుకోవాలి కాబట్టి కృష్ణ ప్రసాద్ వెళ్లాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు... మన పార్టీ కార్యకర్త చనిపోతే మనం పోకుంటే ఎలా? నువ్వు వెళ్ళు అని కష్ణను పంపించింది. కార్యకర్తల కుటుంబాల పట్ల అంత ప్రేమ బాధ్యతతో ఉండేది లక్ష్మీ అక్క.
పిల్లలు అంటే ఆమెకు ప్రాణం. ఎస్వీకేలో పాలు తాగే పసిపిల్లలు కూడా వారి తల్లిదండ్రులను వదిలి ఈమె దగ్గరే ఉండేవారు. వారిపై అంతులేని ప్రేమ చూపెట్టేది. ఆస్పత్రిలో లేవలేనిస్థితిలో ఉన్నప్పటికీ పిల్లలను తీసుకురావద్దు, నేనే ఇంటికి వస్తా అన్నది. అమ్మకు బిడ్డ ఆకలి తెలుసు అంటారు. కానీ లక్ష్మీ అక్కకు కార్యకర్తలందరి ఆకలి తెలిసేది. వద్దు అని చెప్పిన వినకుండా పెరుగుతో అని, సాంబరుతో అని కొసరి కొసరి పెట్టి కడుపునింపేది. కులరక్కసిని రూపుమాపే మార్గంలో కుర్మయ్య రాణి, ప్రవీణ్ సృజన, చెన్నయ్య కవిత, జానీ కష్ణవేణి మొదలైన వారికి ఆదర్శ వివాహాలు చేసి, వారికి తోడుగా నిలబడి, కొత్త బట్టలు పెట్టి అన్ని సౌకర్యాలు చేసింది. దంపతులకు అత్త మామలను, బంధువులను ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెప్పి ఎందరికో అమ్మ అయ్యింది. ముఖ్యంగా అమ్మాయి అందరిని వదులుకొని నీ దగ్గరికి వచ్చింది. అమ్మ నాన్న అన్నీ నీవే అని అబ్బాయికి చెప్పేది. తన వారిని అందరిని కాదని నిన్ను చేసుకుంటున్నాడు. నీ భర్తకు వారి కుటుంబానికి నువ్వే అన్ని అయ్యేట్టు మెలగాలని అమ్మాయికి చెప్పేది. చదువులేకపోయినా కొన్నిసార్లు ఆమె పరిణితి, ఆలోచించే తీరు ఆశ్చర్యం కలిగించేది. పార్టీ ఇచ్చే అలవెన్సు సరిపోని సమయంలో మేము అనేక సౌకర్యాలు ఇచ్చి, అనేక రెట్లు ఎక్కువ జీతాలు ఇచ్చి జీవితాంతం సాకుతం అంటూ ఎవరెన్ని ఆశలు, అవకాశాలు చూపినా చెదరలేదు. లేసులు కుట్టి, ఇండ్లలో పనిచేసి ఆ ఆర్థిక లోటును భర్తీచేసి కుటుంబాన్ని పార్టీతో నిలబెట్టింది. కానీ అవకాశాల కోసం జారిపోలేదు.
మహబూబ్ నగర్లో సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు వంట పనిపై కష్ణప్రసాద్ వెళ్ళితే దాదాపు చావు అంచులకు వెళ్ళింది. అనారోగ్యంతో నెలలు నిండకుండానే రాత్రి సమయంలో బాబుకు జన్మనిచ్చింది. బాబు చనిపోయాడు. సహాయకులు కూడా లేరు. చివరికి ఈమెను కాపాడుకోవడానికి పండ్లు అమ్మే తోపుడు బండిపై వేసుకొని తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజుల తర్వాత కృష్ణ వచ్చాడు. ఈ సమాజం మారాలనీ, దోపిడీలేని సమసమాజం కోసం పని చేస్తున్న మా పార్టీ
పనిపై వెళ్ళాడనీ, ఆయన్ని ఒక్క మాటకూడా అనలేదు. పార్టీ ఆశయం పట్ల అంతటి విశ్వాసం కలిగి ఉండేది.
అంతేకాదు.., కృష్ణప్రసాద్ పని ఎక్కువై ఇబ్బంది పడినప్పుడు, నిరాశపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు అండగా నిలబడ్డది లక్ష్మి. మేడే జెండాలు, డప్పులు, సంక్రాంతి క్రీడల ముగ్గులు, బహుమతులు ఇలా అన్ని దగ్గరుండి చూసి మా పని ఎలా ఉందో చెప్పేది. ఎన్నికల ప్రచారంలో ముందుండేది. గెలుపు ఓటములను పరిశీలించేది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా మేము చర్చించుకునే విషయాలు గమనించి ఆలోచనలు పంచుకునేది. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వచ్చే కార్యకర్తలందరి బాగోగులు దగ్గరుండి చూసింది. వారి ఆకలి తీర్చడానికి ఆస్పత్రికి సద్దులు మోసింది. కొన్నిసార్లు మధ్యరాత్రి కూడా నిద్రలేచి వంట చేసి వారి కడుపు నింపేది. మహాసభల పనులు అంటే ఇక పండుగే... ఒక పండుగకు చేసే అన్ని పనులు చేసే వాళ్ళం. బహిరంగ సభలకు వెళ్లడం అంటే ఒక్కరం వెళ్లడం కాదు... పిండి వంటలు, నాన్ వెజ్ చేసుకొని 10మందిని పోగేసుకొని గుంపుగా వెళ్లే వాళ్ళం. దీనిలో ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా ఆమె చూసేది. 36 ఏండ్లకే ఆమె భౌతికంగా మనకు దూరమైనా చెరగని స్ఫూర్తిగా నిలిచింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, బొల్లారం గ్రామ పార్టీ చరిత్రలో ఆమె చెరగిపోని జ్ఞాపకం.
హైదరాబాద్లో ఉంటున్న బొల్లారం గ్రామానికి చెందిన 60మందిని పోగేసి మీటింగ్ పెట్టి, వారికి రాజకీయాలు నేర్పించడంలో కృష్ణ ప్రసాద్కు అండగా ఉంటూ ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాకుండా ఎస్వీకే పరిసరాల్లో వివిధ పనులు చేసుకునే యువకులను పోగేసి ఏజీ శాఖ ఏర్పాటు చేయడంలో, ప్రతి శాఖ మీటింగ్కు ఒక సభ్యుని ఇంటిలో అందరూ భోజనాలు చేసే విధంగా ఏర్పాట్లు చేసి శాఖ ఉన్న రోజు పండగ వాతావరణం కల్పించడంలో ప్రధానపాత్ర ఆమెదే. భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆమె క్యాన్సర్తో పోరాడి చూపించింది. అదే సందర్భంలో ఆరోగ్యాలపట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేసి వెళ్ళిపోయింది. చదువులేకపోయినా..విప్లవ సంప్రదాయాలకు, విలువలకు, కట్టుబడి ఉండటం, తమకు ఉన్నదానిలో తోటి వారికి సహాయపడతూ తమ ఇంటిని పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలకు కేంద్రంగా మార్చింది. అందరినీ అక్కా, అన్నయ్యా, వదినా, చిన్నమ్మ, బాబారు, పెద్దమ్మా, అత్తమ్మా అంటూ వరుసలు కలుపుకుంటూ తలలో నాలుకగా మెదిలింది. ప్రేమానురాగలకు, ఆప్యాయత అనుబందాలకు మారుపేరు లక్ష్మీ అక్క. ఆమె జ్ఞాపకాలు మరువలేనివి. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె అభిమానించి, అనుసరించిన ఆశయం, మంచితనం, చేసిన పనులు, స్ఫూర్తి మనముందున్నాయి... వాటిని కొనసాగించుదాం.
- కె. శంకర్
సెల్: 8897943868