Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సాంకేతిక ఉపకరణాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. సద్వినియోగమా, దుర్వినియోగమా అనేది మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. వీటి నిర్వహణా లోపం వలన నేడు ప్రపంచాన్ని ఈ-వ్యర్థాల సునామీ ముంచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ మానవాళిని హెచ్చరిస్తోంది. ఈ-(చెత్త) వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి జీవితం సౌకర్యాలకీ, సమాచారానికీ, విజ్ఞానానికీ, వినోదానికీ సాంకేతిక ఉత్పత్తులు, పరికరాలు వాడుతున్నాం. ఈ సాంకేతిక అభివృద్ధి ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్తగా ముందుకెళుతుంటే పాత ఉత్పత్తులను పడేసి కొత్త ఉపకరణాలను కొనుక్కోవడం తప్పడం లేదు. మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, వాషింగ్మిషన్లు, ఫ్రీజ్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, బ్యాటరీలు, లైట్లు, హీటర్లు, కరెంటు స్టౌలు అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంటు, బ్యాటరీలతో పనిచేసే వస్తు ఉపకరణాలన్నింటినీ పనిచేయడం లేదనో లేదా పాతమోడల్ అయిందనో, జీవిత కాలం ముగిసిందనో, కొత్త మోడల్లపై మోజు పడో పాతవాటిని పారేస్తే అవి ఈ-చెత్త(వ్యర్థాల) కిందకే వస్తాయి. మనదేశంలో యాబైకోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నట్టు గత ఏడాది గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏడాది కన్నా అది 15శాతం ఎక్కువ. నేడు కరోనా మహమ్మారి మూలంగా ఆన్లైన్ చదువుల పుణ్యమా అని ఈ సంవత్సరం మరింత ఎక్కువ శాతమే పెరిగివుంటుంది. ప్రపంచమంతా గత ఏడాది సుమారు ఐయిదున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారేసినట్లు గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ ప్రకటించింది. గతంతో పోలిస్తే ఐదేండ్లలో 21శాతం పెరిగిందంటూ ఈ లెక్కన పదేండ్లలో రెట్టింపు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. నిజానికి మామూలు చెత్తతో పోలిస్తే ఎలక్ట్రానిక్ చెత్తపరిమాణం తక్కువే కానీ దాని వల్ల ప్రమాదం మాత్రం 70శాతం ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ పరికరాల్లోని సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్, నికెల్, జింక్, సెలెనియం లాంటి మూలకాలతో కలిసి మొత్తం అరవై రకాల హానికర రసాయనాలు ఉంటాయి. సీసం, పాదరసం లాంటివి మనిషి మెదడుమీద తీవ్రంగా ప్రభావాన్ని చూపుతాయి. అవి చెత్త కుప్పల్లో పడివుంటే చుట్టూ ఉన్న నేలనీ, భూగర్భజలాల్ని కలుషితం చేస్తాయి. కాల్చితే గాలిని కలుషితం చేస్తాయి. ఆయా మూలకాలు ప్లాస్టిక్లు కలిసి క్యాన్సర్ కారకాలను గాలిలోకి, భూమిలోకి వదులుతాయి. ఈ కాలుష్యాలు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయంటున్నారు పరిశోధకులు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల డబ్బు వృధా, భూమికి భారము. అంతేకాదు మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికీ చెప్పలేనంత హాని జరుగుతున్నది.
ప్రపంచ దేశాల్లో ఈ వ్యర్థాల (చెత్త) సృష్టి కర్తల్లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఆ తర్వాత ఐదో స్థానంలో మనదేశం ఉంది. మనదేశంలో ఏటా సుమారు నలబై లక్షల టన్నుల ఈ-వేస్ట్ తయారు అవుతుందని ఒక అంచనా. ఇది చాలదన్నట్టు ఇతర దేశాల ఈ-వేస్ట్ ఇక్కడికే వస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ దగ్గర పనికిరాని వస్తువు(పరికరా)లను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ వ్యర్థాల్లోని పనికి వచ్చే విడిభాగాలను తీసుకొని మళ్లీ కొత్త పరికరాన్ని అసెంబుల్ చేసి తిరిగి అమ్ముతారు. పనికిరాని చెత్తను లారీల్లో ఎక్కించి అడవుల్లోకి తీసుకెళ్లి పడేస్తారు లేదా కుప్పలుగా పోసి తగలబెడుతారు. ఈ-వ్యర్థాలను సరైన రీతిలో రీసైకిల్ చేసే సామర్థ్యం మనకు అంతగా లేదు.
వాతావరణ మార్పులకు కారణమవుతున్న పెట్రో ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వాలు రాయితీలిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి 12కోట్ల ఈ వాహనాలు రోడ్లపై ఉంటాయని వాటి వలన పదకొండు లక్షల టన్నుల లిథియం అయాన్ బ్యాటరీలు చెత్తలోకి చేరుతాయనీ తెలుస్తున్నది. ప్రపంచం 5జీ ఎప్పుడెప్పుడా అనిఆత్రంగా ఎదురుచూస్తున్నది. 5జీ వాడుకలోకి వస్తే కోట్లాది స్మార్ట్ఫోన్లు, మోడెమ్లు, ఇతర పరికరాలు ఆ స్పీడును అందుకోలేవు. కాబట్టి వీటిని పారేసి కొత్తవి తీసుకోకతప్పదు. ఇది సాంకేతికంగా ఎంతో పెద్ద మార్పు. నలుపు తెలుపు నుంచి రంగుల్లోకి మారిన దానికన్నా, అనలగ్ నుంచి డిజిటల్లోకి మారినప్పటి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి నష్టమూ అదే స్థాయిలో ఉంటుందని పర్యావరణ ఉద్యమ కారులు హెచ్చరిస్తున్నారు. ఎలక్రానిక్ వ్యర్థాల వల్ల జరుగుతున్న హానిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. వ్యక్తిగతంగా వస్తువుల జీవితకాలం ముగిసేవరకు వాడాలి. లేదంటే వాటిని రీసైక్లింగ్ చేసే సంస్థలకు అందచేయాలి. ఉత్పత్తి సంస్థలు కొత్తది అమ్మేటప్పుడు పాతదాన్ని తీసుకోవాలి. వాటిని సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయించడం కంపెనీల బాధ్యతగా గుర్తించాలి. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) ఈ పరికరాల రీసైక్లింగ్ ఖర్చుని కూడా ఉత్పత్తి దారులు భరించేలా చట్టాలు తేవాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఏ వస్తువునైనా వాటి జీవితకాలం తీరాక పారేయక తప్పదు. ప్రతి ఒక్కరు విశ్వమానవాళి ఆరోగ్యాన్ని, వాతావరణాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భారత ప్రభుత్వం కూడా ఈ-వ్యర్థాలను తగ్గించడాన్నీ, రీ సైక్లింగ్ని పెంచడాన్నీ నిర్లక్ష్యం చేస్తోంది. 2016లో వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ప్రభుత్వం విడదల చేసింది. వాటి ప్రకారం ఉత్పత్తిదారులు తమ మార్కెట్ భాగస్వామ్యానికి తగినట్టుగా ఈ-వేస్ట్ను కూడా రీసైక్లింగ్ చేయించాలి. తమ అమ్మకాల్లో 20శాతం లేదా సమానంగా నైనా జీవితకాలం ముగిసిన వస్తువులను తీసుకోవాలి. ఈ వేస్ట్(వ్యర్థా)ల వలన ఎవ్వరికీ హాని జరుగకుండా ఉండాలంటే సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయడమే శ్రేయస్కరం. జపాన్లో రీసైక్లింగ్ ద్వారా ఒలంపిక్ పతకాల కోసం పూర్తిగా ఈ-వ్యర్థ లోహాలను తీసుకున్నారట. ప్రజల ఆరోగ్యాల్ని, ప్రకృతిని కలుషితం చేస్తూ, హాని తలపెడుతున్న ఫలితంగానే నేడు ఈ విపత్కర పరిణామాలను అనుభవించాల్సి వస్తున్నది. మునుముందు ఈ ఆధునిక సాంకేతికత మూలంగా విపరీతంగా పెరిగిపోనున్న ఈ-చెత్త (ఎలక్ట్రానిక్ వేస్ట్) ముమ్మాటికీ మంచిదికాదు. డబ్బులు పెట్టి హానిని కొనుక్కున్నట్లు ఉంది. మానవాళిని కబళిస్తున్న దీనిని నివారించుకోకుంటే నేటి విపత్తులకంటే ప్రమాదకర పరిణామాలకు మనమే బాధ్యులమవుతామని మరువరాదు.
- మేకిరి దామోదర్
సెల్:9573666650