Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమ్మించేంత వరకే పులి మేక తోలు కప్పుకుంటుంది. ఒకసారి మేకల మంద పై పట్టు సాధించాక తోలు కప్పు కోవాల్సిన అవసరం పులికి ఉండదు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చే వరకు ''మేక వన్నె పులి'' తీరుగా నటించింది. మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన ఈ పులి ఎంతవరకు ఈ గొర్రెలు తనను నమ్ముతున్నయో కొట్టి చూసింది. రెండోసారి గెలిచాక తన అసలు రూపాన్ని బయట పెడుతున్నది. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమలు పరుస్తున్నది. కోటి ఉద్యోగాల కల్పనతో యువతను మభ్యపెట్టి ఉన్న ఉద్యోగాలను ఊడ బెరుకుతున్నది. దేశానికి కాపలాదారు అంటూనే దేశీయ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ ''కంచే చేను మేసిన చందం''గా వ్యవహరిస్తున్నది. అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రయివేటుపరం చేయడమే కాక ప్రయివేటుని గౌరవించాలని ప్రజలకు ఉద్బోధ చేస్తున్నారు. ఇదేదో అధికారంలోకి రాగానే చేస్తున్న పని కాదు. అధికారంలోకి వచ్చే ముందే నిర్ణయించుకున్న ప్రణాళికలో భాగం. అందుకే ప్రభుత్వాలు వ్యాపారం చేయటానికి కాదు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతున్నామని నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. దేశం ఏర్పడ్డ తొలినాళ్లలో దార్శనికులు సామ్యవాదపు వెలుగులో దేశ అభివృద్ధి, సంక్షేమం దృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పరిచారు. కానీ, పాలకుల మెదళ్ళలోకి పాలన అంటే వ్యాపారం అని ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు వారు ఎన్నికలంటే ఓట్లను కొనుక్కోవడమనీ, సంక్షేమం అంటే పథకాల పేరుతో డబ్బులు పంచడం అని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను సంక్షేమం, అభివృద్ధి కోణంతో కాక వ్యాపార కోణంలో చూస్తూ నష్టాలు వస్తుంటే ఆ సంస్థలను నడుపాలా అని దబాయిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలు వాటికవే నష్టాల పాలు కాలేదు. పాలకవర్గ విధానాల వల్లే అవి నష్టాల్లోకి నెట్టి వేయబడుతున్నాయి. అట్లా నష్టాల్లోకి నెట్టి వేయబడ్డ ప్రజల ఆస్తులను (ప్రభుత్వ రంగ సంస్థలు) ప్రభుత్వ అనుకూల పారిశ్రామికవేత్తలకు మార్కెట్ విలువ కన్నా తక్కువకు కారు చౌకగా కట్ట పెడుతున్నారు. నష్టాల్లో ఉన్న వాటినే కాక ఎల్ఐసీ, బీపీసీఎల్ లాంటి లాభాలు గడించే సంస్థలను కూడా అమ్మకానికి పెడుతున్నారు. అప్పులు చేసి నడపటానికి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజల సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నది కదా! ఈ అప్పులను పాలకులు వారి సొంత జేబులో నుంచి తీరుస్తున్నారా? ప్రభుత్వ రంగ సంస్థల లాభనష్టాలు మాట్లాడుతున్న పాలకులు ప్రయివేటు రంగ సంస్థలు ఎగ్గొట్టిన వేల కోట్ల రూపాయల గురించి నోరు మెదపరు ఎందుకని? ప్రయివేటు కంపెనీలు నష్టాలలో ఉన్నాయని లక్షల కోట్ల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయడానికి కాక నష్టాల పేరుచెప్పి అమ్మకానికి పెడుతున్నారు ఎందుకు? ఎందుకంటే... లాభనష్టాల మాట కాసేపు అటుంచి చూస్తే దీని వెనుక బీజేపీ ప్రభుత్వ సైద్ధాంతిక రహస్య ఎజెండా కనపడుతుంది. అదేమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాంగ ఫలాలను దూరం చేసి, బడుగు బలహీనవర్గాలని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసి వారిని వారి చెప్పుచేతులలో పెట్టుకోవాలి అనేది బీజేపీ సైద్ధాంతిక ప్రణాళిక. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారు. దీని ద్వారా ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో కొంత అభివృద్ధి, కొంత ప్రగతిశీలత కనబడుతున్నది. రిజర్వేషన్ను ఉపయోగించుకొని ఉన్నత విద్యనభ్యసించిన విద్యావంతులు ఈ దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు చేయక పోవడం వల్లనే తమ జీవితాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని గుర్తిస్తున్నారు. బహుజన ప్రజల సంక్షేమం కోసం ఏర్పరచిన రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనీ, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాల రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక పాలనా విధానాలను ఎండగడుతున్నారు. దీన్ని సహించలేని బీజేపీ ప్రభుత్వం అన్నింటినీ ప్రయివేటు పరం చేస్తే బహుజనులందరూ విద్య ఉపాధి అవకాశాలు లేక కూలీలుగా మారితే తాననుకున్న మనువాద రాజ్యాంగాన్ని మరల అమలు పరచవచ్చని భావిస్తున్నది. అందుకే విద్యను పేదలకు, బడుగు బలహీన వర్గాలకు దూరం చేయడానికి విదేశీ ప్రయివేటు యూనివర్సిటీలను తీసుకువస్తున్నది. దేశీయ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఎత్తి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నది. ప్రజలను మభ్యపెట్టడానికో లేదా దళిత బహుజన ఓట్ల కోసమో కానీ మరో పదేండ్లు రిజర్వేషన్లను నిరాటంకంగా కొనసాగిస్తామని పార్లమెంటులో తీర్మానం చేసినప్పటికీ రిజర్వేషన్లు అమలయ్యే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం ద్వారా రిజర్వేషన్ల అమలును దొడ్డిదారిన మూసి వేస్తున్నది బీజేపీ ప్రభుత్వం.
బీజేపీ ప్రభుత్వానికి సైద్ధాంతిక మార్గదర్శకత్వం చేస్తున్న ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం అదే కదా! ఇటీవలికాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ''రిజర్వేషన్లను పునఃసమీక్షించాల''ని కోరడం దీనికి తార్కాణం. ఆర్ఎస్ఎస్ చూపించే మార్గంలోనే బీజేపీ ప్రయాణిస్తుంది. అందుకే ప్రయివేటీకరణను వేగవంతం చేస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంతకంటే మెరుగైన పాలనా విధానాలను అమలు పరుస్తుందని అనుకోలేం. నిజానికి నష్టాలే కారణమైతే, నష్టాల సాకు చూపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు కట్ట పెడుతున్న మోడీ ప్రజల ఆస్తులైన ఆయా సంస్థలలో ఇదివరలో లాగానే రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెప్పడం లేదు ఎందుకు?
రిజర్వేషన్లను నేరుగా ఏమీ చేయలేక రిజర్వేషన్లు అమలయ్యే సంస్థలను క్రమంగా మూసుకు వస్తున్నారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకుండా ఆపలేకపోతే ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన దుర్లభం. అంతిమంగా ఈ దేశపు బడుగు బలహీన వర్గాలు ఏ రకమైన ఎదుగుదలకు నోచుకోకుండా తిరిగి మధ్యయుగాల నాటి స్థితికి నెట్టివేయబడే ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బిసీ మైనార్టీల పైన ఎక్కువగా ఉన్నది. మిగతా సమాజం కూడా వీరితో భుజం భుజం కలిపి నడవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని పరిరక్షించుకోవడమే. ఇందుకోసం దేశం యావత్తు ప్రభుత్వ పాలనా విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలి.
- వి. దిలీప్
సెల్:8464030808