Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1882 మార్చి 24న 'డా: రాబర్ట్ కోచ్' క్షయవ్యాది (ట్యుబర్క్యులోసిస్, టిబి)కి మైకోబాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్, బాసిల్లస్ బ్యాక్టీరియా కారణమని తొలిసారి ప్రపంచ మానవాళికి ప్రకటించడం జరిగింది. ఈ విప్లవాత్మక ఆవిష్కరణ ఫలితంగా 'ట్యుబర్క్యులోసిస్, టిబి'ని శ్వాసకోశ (ఊపిరితిత్తుల) వ్యాధిగా గుర్తించడంతో పాటు చికిత్సలో కూడా ముందడుగు వేయుటలో సఫలత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 4000 మంది టిబి వ్యాధితో మరణించడం, 28,000 మంది దిగువ, అల్పాదాయ వర్గాల రోగులు క్షయరోగం సోకి బాధ పడుతుండడం జరుగుతోంది. 2000ల సంవత్సరం తరువాత ప్రతి ఏటా దాదాపు 63 మిలియన్ల టిబి రోగుల ప్రాణాల్ని కాపాడటం జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 11 ప్రపంచ ప్రజారోగ్య సమస్యలలో ఏయిడ్స్, మలేరియా, హెపటైటిస్ లాంటి అంటువ్యాధుల జాబితాలో క్షయవ్యాధి ఒకటిగా నిర్ణయించి చేర్చడం జరిగింది. వ్యాధిగ్రస్తులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే సూక్ష్మ బింధువులు ఇతరులు పీల్చినపుడు టిబి అంటువ్యాధి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి.
ప్రపంచ మానవాళిని శతాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఇలాంటి భయంకర క్షయ అంటువ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశలో ఐరాస చేపట్టిన 'ప్రపంచ క్షయ నిర్మూలన దినాన్ని' ప్రతి ఏటా 24 మార్చి రోజున 1982 నుంచి నిర్వహించుట జరుగుతోంది. ప్రపంచ క్షయ నిర్మూలన దినం-2021 ప్రకారం 'ది క్లాక్ ఈజ్ టిక్కింగ్' నినాదం తీసుకోబడింది. ఐరాస అంచనాల ప్రకారం 2022 నాటికి 3.5 మిలియన్ల పిల్లలు మరియు 1.5 మిలియన్ల పెద్దలను టిబి వ్యాధి నుంచి విముక్తం చేయాలనే ప్రయత్నాలు జురుగుతున్నాయి. క్షయ వ్యాధి నిర్మూలన, చికిత్స, వ్యాధి కట్టడిలో జవాబుదారీతనం, టిబి నిర్మూలనకు/పరిశోధనలకు అవసర నిధుల సమీకరణ, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను తొలగించడం, టిబి రోగుల్లో ఆత్మవిశ్వాసం నింపడం లాంటి చర్యలు చేపట్టడం జరుగుతున్నది. భయానక క్షయ వ్యాధి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, సాంఘీక, ఆర్థిక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని గమనించాలి.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సమస్యగా నిలిచిన టిబితో భారత్లో ప్రతి ఏటా 2.20 లక్షల మరణాలు క్షయ వ్యాధి వల్ల సంభవిస్తున్నాయి. ప్రపంచ టిబి మరణాల్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. అత్యధిక టిబి మరణాలు రికార్డు అవుతున్న 8 దేశాల (ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా) జాబితాలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. 2016లో 2.79 మిలియన్ల కొత్త టిబి కేసులు, 4.35 లక్షల టిబి మరణాలు, 1.47 లక్షల ఔషధ-నిరోధకత కేసులు, 46 శాతం చికిత్సతో నయం అయిన వారు ఉన్నారని తేలింది. ఇండియాలో 2006-14 మధ్య క్షయ వల్ల ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా. ఇండియాలో 2025 వరకు క్షయ నిర్మూలన చేయాలనే ఆశయంతో 'జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమం' తీసుకోవడం, పలు రకాల చర్యలు చేపట్టడం జరుగుతోంది. వ్యాధిగ్రస్తుల్ని గుర్తించడం, చికిత్సలు అందించడం, వ్యాధి నిర్మూలనకు 'నిక్షరు పోషన్ యోజన' ద్వారా పోషకాహారాన్ని అందించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. టిబిలో ఆక్టివ్ ( వ్యాధి లక్షణాలు కలిగిన వారు) మరియు ఇనాక్టివ్ (రోగం ఉన్నా తెలియని వారు) రకాలు ఉన్నాయి.
ఊపిరితిత్తులకు సంబంధించిన అంటువ్యాధిగా క్షయరోగాన్ని గుర్తించినప్పటికీ, దీనితో కిడ్నీ, ఎముకలు, కీళ్ళు, లింఫ్ నోడ్స్ లాంటి ఇతర అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. క్షయవ్యాధి లక్షణాల్లో దీర్ఘకాలపు దగ్గు, ఆకు పచ్చ/పసుపు/రక్తపు కఫం రావడం, బరువు తగ్గడం, జ్వరం, చెమట, ఛాతి నొప్పి, ఆకలి మందగించడం, కండరాల నొప్పి, శ్వాస ఇబ్బంది లాంటివి కనిపిస్తాయి. ఆంటీబయాటిక్స్తో నయం చేయగల టిబితో పాటు ఔషధ-నిరోధక స్థితి కూడా కనిపిస్తున్నది. 2017-25 మధ్య క్షయవ్యాధిని భారత్ నుంచి తరుమటానికి 'నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్', 'నేషనల్ టిబి నిర్మూలన కార్యక్రమం' తీసుకున్నారు. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం, ఆరోగ్య సంస్థలకు చేయూత, ప్రైవేట్ చికిత్సకు సహాయం, గిరిజన టిబి రోగులకు ఉచిత రవాణా వసతి లాంటి టిబి నిర్మూలన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. పిల్లల్లో టిబిని గుర్తించడం, కొన్ని సందర్భాలలో వ్యాధి లక్షణాలు కనిపించక పోవడం అతి పెద్ద సమస్యలుగా అడ్డు నిలుస్తున్నాయి. పిల్లలకు 'బిసిజి' టీకాలు ఇప్పించడం ఎన్నటికీ మరువరాదు. వ్యాధిగ్రస్తులు మందుల్ని విధిగా వేసుకోవడం, డాక్టర్ను సంప్రదించడం, దగ్గినపుడు/ తుమ్మినపుడు తుండు గుడ్డతో కప్పుకోవడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, ఇతరులకు దూరంగా ఉండడం, గదిలో గాలి ప్రవహించేలా/ వెలుతురు నిండుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజారవాణ వినియోగానికి దూరంగా ఉండడం లాంటి జాగ్గత్తలు తీసుకుంటూ, వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడం మనందరి బాధ్యతగా గుర్తించాలి. ఈ క్రమంలో క్షయవ్యాధి రహిత భారతాన్ని నిర్మించడంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్: 9949700037