Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటరీ - పార్లమెంటేతర రంగాల్లో విశిష్ట కృషి చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షంనేటికి కనుమూసి ఒక దశాబ్ద కాలం అయింది. అజన్మ బ్రహ్మచారిగా, కడదాకా కమ్యూనిస్టుగా, పాత్రికేయునిగా, విద్యార్థి నాయకునిగా, కల్లుగీత కార్మిక నాయకునిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా.. పీడిత ప్రజల గొంతుగా చట్టసభల్లో వినిపించిన పోరాట యోధుడు ధర్మభిక్షం. హాకీ టీమ్ కెప్టెన్గా, నల్లగొండలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన నేతగా, అవిరళ కృషి చేసారు. ఆర్యసమాజ్ నుంచి ఆరంభమైన ఆయన సేవాసామాజిక జీవితం.. ఆదర్శ కమ్యూనిస్టు ఉద్యమ నేతగా సాగింది, కడవరకూ.. ''భిక్షం మాంగా ధర్మ్.. కియా ఇన్కా నామ్ ధర్మ భిక్షుహై'' అంటూ అలనాటి హైదరాబాద్ కొత్వాల్ రాజ్బహద్దూర్ వెంకట్రామారెడ్డి శ్లాఘించి మెచ్చుకొన్నారు.
నల్లగొండజిల్లా మనుగోడు మండలం ఊకొండి గ్రామంలో గీతకార్మికుల కుటుంబంలో ధర్మభిక్షం 1922 ఫిబ్రవరి 15న జన్మించారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ, హాస్టల్ నిర్వహించారు. విద్యార్థుల్ని ఆర్గనైజ్ చేసారు. పలు కార్మిక సంఘాలు పెట్టారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, మూసీ ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో ఆయన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం, నిర్వాసితుల కోసం ప్రభుత్వంతో పోరాటాలు చేసారు. ఆంధ్ర మహాసభలో క్రియాశీలంగా వ్యవహరించారు. 1942లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. పార్టీ పనులు చేస్తూనే నాటి ప్రముఖ పత్రికలైన రయ్యత్, గోల్కొండ, మీజాన్ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసారు. పెన్నుపట్టి జర్నలిస్ట్గా, గన్నుపట్టి కమ్యూనిస్టుగా నాటి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. గెరిల్లా యోధునిగా పిలువబడ్డారు. బి.ఎన్.రెడ్డితో పోరాటంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఎక్కువకాలం జైలుజీవితం గడిపి ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుకొన్నారు. సాయుధ పోరాటం విస్తరించే కృషిలో అరెస్టయ్యారు. ఔరంగాబాద్, జాల్నా జైళ్లోలో ఐదేండ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు. జాల్నా జైళ్లో పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించాడు. గీత కార్మికులతో సంఘం స్థాపించి గౌడ సామాజికవర్గం హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసాడు. స్వాతంత్య్రం అనంతరం... 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నుంచి ఎన్నికైనాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1957లో నకిరేకల్ నుంచి, 1962లో నల్లగొండ నుంచి శాసనసభకు ధర్మభిక్షం ప్రాతినిధ్యం వహించాడు. 1991-1996లో నల్లగొండ పార్లమెంట్ సీటుకు ఎన్నికైనాడు. నాడు 400 మంది రైతులు ఎంపీ సీటుకు పోటీ చేసారు. జింబో బ్యాలెట్ పత్రం ఉన్నా అఖండ విజయం సాధించారు. 1991-1996 మధ్య పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధిశాఖకు సభ్యులుగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆశించిపోరాడారు. ఆయన ఎర్రజెండా రెపరెపలు ఎర్రకోటపై ఆకాంక్షిస్తూ.. 2011 మార్చి 26న తుదిశ్వాస విడిచి అమరుడైనాడు.
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472