Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా తలచి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన 'ట్రాన్స్అట్లాంటిక్ బానిసత్వ వ్యాపారం'గా చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ మానవ హక్కుల అమానవీయ ఉల్లంఘనలో లక్షల ఆఫ్రికన్లు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ విషాద ఘటన ప్రభావం నేటికీ ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థ మీద దుష్ప్రభాన్ని చూపిస్తున్నది. యుయస్లో 1 ఫిబ్రవరి 1865 రోజుననే బానిసత్వాన్ని నిషేధించడం జరిగినా, బానిసత్వం, జాతి వివక్షలు తరువాత కూడా తీవ్రంగా కొనసాగడం విచారకరం. 2007లో ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం 2008 నుంచి ప్రతి ఏటా 25 మార్చిన 'అంతర్జాతీయ ట్రాన్స్అట్లాంటిక్ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం' పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. బానిసత్వం నేరమని, మానవ హక్కుల ఉల్లంఘనలు, జాతి వర్ణ వర్గ వివక్షలు అమానవీయ మని, మనిషిని మనిషిగా చూడడం కనీస బాధ్యత అని అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ రోజున చర్చించడం జరుగుతుంది. అగ్రదేశాల్లో సెలున్లు, రెస్టారెంట్లు, సంగీత వేడుకలు, వ్యవసాయ క్షేత్రాలు లాంటి రంగాల్లో బానిసత్వ బాధితులు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో బానిసత్వ దురాచారం అమలు లో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా 39శాతం ఆధునిక బానిసలు ఇండియాలో ఉండడం విచారకరం.
ఇండియాలో బానిసత్వం లేదా దాస్య దురాచారం అనాదిగా అమలు అవుతూనే ఉన్నది. ముస్లిమ్ పాలనల ఆధిపత్య కాలంలో బానిసత్వం పెరగడం, 19వ శతాబ్దం వరకు పెద్ద ఎత్తున కొనసాగడం జరిగింది. 1843లో భారత బానిసత్వ చట్టం-1843 (ఇండియన్ స్లేవరీ ఆక్ట్-1843) అమలులోకి వచ్చింది. 2018 నివేదిక ప్రకారం నేటికీ ప్రపంచవ్యాప్తంగా 46 మిలియన్లకు పైగా ప్రజలు, అందులో 8మిలియన్ల భారతీయులు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారు. భారత్లో ఆధునిక బానిసత్వంగా వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణ, బలవంతపు బిక్షాటన, బాల్యవివాహాలు, బలవంతపు వ్యభిచారాలు, బాల కార్మిక వ్యవస్థలు నేడు కూడా కనిపించడం విచారకరం. భారత్లో ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు బానిసత్వ చీకట్లలో మగ్గుతున్నారని అంచనా. ప్రపంచ బానిసత్వ సూచిక-2016 (గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్) అంచనాల ప్రకారం భారత్లో 18.3మిలియన్ల ఆధునిక బానిసలు ఉన్నారని వెల్లడించారు. భారత్లో 2016 గణాంకాల ప్రకారం 15,379 మానవ అక్రమ రవాణ కేసులు నమోదుకాగా అందులో 9,034 బాధితులు 18ఏండ్ల లోపు వారు ఉండడం జరిగింది. ఇటుక బట్టీలు, చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, అసంఘటితరంగాలు, గృహ పనులు లాంటి రంగాల్లో ఆధునిక బాల్య బానిసత్వం కనిపిస్తున్నది. ఆధునిక బానిసత్వానికి అడ్డుకట్ట వేసేందుకు చట్టాల కఠిన అమలుతో పాటు ప్రతి ఒక్క పౌరుడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుందాం. బానిసత్వ రహిత భారత కలలను సాకారం చేసుకుందాం.
- బి.ఎం.ఆర్