Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం సర్కారుపై నిప్పులు ఉమిసిన సూర్యుడిలా పనిచేసిన పోరాట యోధులలో భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధ విముక్తి కోసం సాగిన పోరాట వీరులలో సర్దార్ జమలాపురం కేశవరావు ఒకరు. నిజాం రాచరిక పాలన రోజుల్లో తిరుగుబాటు కోసం తెలంగాణ తడ్లాడుతన్న సమయం, కంటి ముందు కనిపించేదంత అన్యాయమే చెవుల్లో మారు మోగేవి అభాగ్యుల ఆర్తనాదలే. ప్రపంచానికి పగలు తర్వాతే రాత్రి, కానీ పెత్తందారీ వ్యవస్థలో నలుగుతున్న బాధితులకు బతుకంతా చీకటి. స్వేచ్ఛ కోసం పరితపించే పీడితుల గుండెలో ధైర్యం కావాలి. అన్యాయాన్ని ప్రశ్నించే ఆరాటానికో తెగింపు కావాలి. ఆధిపత్యాన్ని ఎదిరించాలనుకునే పిడికిళ్లకు బలం కావాలి. అలాంటి త్యాగానికి నిలువెత్తు రూపం జమలాపురం కేశవరావు. తుపాకులకు బెదరకుండా లక్ష్యం కోసం ప్రాణాలు తృణ ప్రాయమన్న విషయం తెలిసి కూడా ఉక్కు సంకల్పంతో ముందుకేగిన వీరుడు ఆయన.
దక్కన్ సర్దార్గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు ఒకనాటి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రుపాలెం గ్రామంలో 1908, సెప్టెంబర్ 3వ తేదీన, వెంకట రామారావు, వెంకట నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఎంతటి సాంప్రదాయక కుటుంబమైనా కేశవరావు చిన్నప్పటి నుంచే సామ్యవాద భావాలు కనబరచేవారు. మూఢ నమ్మకాలను ఏనాడూ నమ్మేవారు కాదు. దేశంలో జాతీయోధ్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలమది. ఆ ఉద్యమ దీప్తి నైజాం సంస్థానంలో కూడా వ్యాపించింది. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగారు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది. తండ్రి ఒత్తిడితో నిజాం సర్కార్లో ఉద్యోగిగా చేరాడు. కేశవరావు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన సమయంలో తెలంగాణ విముక్తి పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. ఈ పోరాటంలో పాల్గొన్న కేశవరావు 1938లో రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మాన, ప్రాణాలకు ముప్పు ముంచుకొచ్చినప్పుడు ఎదురుతిరగడం తప్పు కాదని ప్రచారం చేశాడు.
'హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్' స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ పార్టీ నిషేధానికి వ్యతిరేకంగా గోవిందరావు నానల్, జనార్దనరావు దేశాయి, రామ్కిషన్ ధూత్, శ్రీనివాసరావు చేరికర్ల ఆధ్వర్యంలో దీక్ష చేశారు. నైజాం ప్రభుత్వం నిర్బంధించి వీరిని జైలుకు పంపింది. వీరు అరెస్టయిన మూడో రోజున స్వామి రామానందతీర్ధ నేతృత్వంలో రెండో జట్టు సత్యగ్రహంలో కూర్చుంది. వీరిలో కేశవరావు కూడా ఉన్నారు. వీరందరినీ నైజాం ప్రభుత్వం అరెస్ట్ చేసి 18 నెలలు కారాగార శిక్ష విధించింది. 1938 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం మధిరలో సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం జిజ్జుకు పోయింది. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించింది. అయినా భారీ సంఖ్యలో ప్రజలు దీక్ష వేదిక దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు. వెంటనే మహాత్మగాంధీకి జై, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినాదించాడు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్ జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాటపంథాను కేశవరావు కొనసాగించారు. అంటరానితనం నిర్మూలించేందుకు ప్రయత్నం చేశారు. ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమం చేశాడు. పానుగంటి పిచ్చయ్య, వనం నరసింహారావు, నారాయణరావులతో పాల్వంచలో పర్యటించి ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయాల స్థాపనను యజ్ఞంలా భావించాడు. అంతేకాక వయోజన విద్య కోసం రాత్రి బడులు నడిపారు. అణగారిన వర్గాల్లో చైతన్యం నిపండానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించినందుకు 1947లో సర్దార్ను మరోసారి నిజాం సర్కార్ అరెస్టు చేసింది. వరంగల్ జైల్లో వందేమాతరం గీతం పాడితే కాల్చేస్తామని బెదిరించారు. దమ్ముంటే కాల్చమని ఎదురు నిల్చాడు సర్దార్. పోలీస్ చర్య పేరుతో హైదరాబాద్లో అరాచకం జరుగుతుందని ప్రశ్నించిన మొదటి కాంగ్రెస్ నేత ఆయనే. ఏ జాగీర్దార్లను, జామీందార్లను ఆయన వ్యతిరేకించాడో వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాన్ని కేశవరావు జీర్ణించుకులేక పోయారు. అలా చేరిన నాయకులే స్వీయ ప్రయోజనాల కోసం పార్టీని పణ్ణంగా పెట్టారు. జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలోని నాయకులు చేసిన మోసంతో అనేక దుష్పరిణామాలు ఒక్కసారిగా సర్దార్పై దాడి చేశాయి. ఈ మానసిక ఒత్తిడిలోనే 23.03.1953న తన 46వ ఏట ఆయన చనిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాట యోధుల చరిత్రను తవ్వితీసి నేటి తరం ముందు పెట్టాల్సిన బాధ్యత మనందరిది.
- బోనకుర్తి సోమేశ్వర్
సెల్ : 9293762498