Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 -
(గురువారం తరువాయి భాగం)
అసలు వింత, ఇంకో సంగతి చెప్పు కోవాలి. ఈ మధ్యనే ఒక స్త్రీల మీటింగ్ పత్రికలో చూశాను. వాళ్లు ఏదో 'కమ్యూనిస్టు' లాంటి పేరే చెప్పుకున్నారు. పత్రిక పేరే అది. మీటింగు దృశ్యాలతో పత్రికనంతా నింపేశారు. స్త్రీల విముక్తీ, స్త్రీ-పురుషుల సమానత్వం - స్త్రీల పోరాటం - అన్నీ అలాంటి మాటలే. కానీ, ఆ స్త్రీలు ఎలా వున్నారంటే, అదంతా 'అందాల పోటీయేమో' అనుకున్నాను మొట్టమొదట ఆ పత్రిక చూడగానే. కానీ, అది 'అందాల పోటీ' కాదు అంతా 'విముక్తి' కోసం పోరాటమే అన్నారు వాళు. పిడికిళ్లు ఎత్తిన చిత్రాలూ, ఫొటోలూ! ఎంతెంత ముస్తాబులతో వచ్చారో సభలో వేదిక మీదకి! వేదిక మీద 12 మంది స్త్రీలు కనపడ్డారు. చీరలూ, డ్రెస్సులూ, అన్నీ తళతళలతో, మిలమిలలతో, నిండిపోయింది వేదిక. కొందరు జుట్లు విరబోసుకున్నారు. పత్రిక అంతా రంగులతో! జడలూ ముడులూ వేసుకుని, ఒంటి మీద బట్టలు ఉంచుకుని, నగత్వాన్ని అందంగా ప్రదర్శించాలనే రంధి లేని వాళ్లని చూడాలనిపిస్తుంది నాకు. పోరాటాల స్త్రీలు అలా దొరుకుతారేమో అని ఆశ పడతాను. కానీ, 'పోరాటం' అనే వాళ్లు కూడా డబ్బు ఇచ్చి మొహాన్ని రుద్దిపించుకుంటున్నారు! జుట్టు సరే, దానికీ సోకులు నేర్పుతారు. వేళ్లకీ, గోళ్లకీ, రంగులు! ఇంకా 'పళ్ల'కీ, నాలిక్కీ, రంగులు మొదలు పెట్టినట్టు లేరు. రంగులు అమ్మే వాళ్లంతా వ్యాపారులు! ఈ అందాల వాళ్లు, వ్యాపారుల బానిసలే. వ్యాపారుల ప్రకారం నడవ వలిసిందే! వాళ్ల ఎదురుగా ప్రేక్షక స్త్రీలు! ఈ స్త్రీలకి వీపులన్నీ ఖాళీలే. ఇప్పుడు, అందాలు వీపుల దాకా కూడా పాకాయి. అంటే, వీపుల్ని నగంగా చూపిస్తున్నారు! ఇదీ, స్త్రీల పోరాటం!
ముస్తాబులతోనే, ముస్తాబుల కోసమే బతికే స్త్రీల సంగతి వేరు. వాళ్ల మాట ఎవడిక్కావాలి? 'విముక్తి' అనీ, 'విమోచన' అనీ, మాట్లాడతారే, అలా మాట్లాడేవాళ్ల సంగతి ఇది. 'వీళ్లు కూడా ఇంత ఆలోచించడం లేదే!' - అనే ప్రశ్నే ఎప్పుడూ వుంటుంది. 'అందం' అన్నప్పుడు, మొగాళ్ల అందాన్నీ ఎంతో కొంత పట్టించుకోకపోరు గానీ, 'ఆడవాళ్ల అందం' సంగతి అలా వుండదు. 'ఆస్తి'తో, 'డబ్బు'తో, బలిసిన స్త్రీల సంగతైతే, వాళ్లకి, అందం అనేదే ఉన్మాదం. శరీరాన్నంతా నగంగా బైట పెట్టెయ్యాలని చూస్తారు. చూస్తారు కాదు పెట్టేస్తారు. దాన్నే 'అందం' అంటారు. పరిశుభ్రతా, నిజాయితీ - అనే సంగతులైతే పట్టవు. 'అందం' అనే ఏకైక విషయమే పడుతుంది, అది కూడా అష్ట వంకర్లుగా! చంకలు బైట పెడితే, రొమ్ములు బైట పెడితే, తొడలు బైట పెడితే! - 'మా అందాలు చూడండి' అని. ఆ వేరు వేరు భాగాలెందుకు? మొత్తంగా ఒళ్లంతా నగం చేసుకుని రోడ్డు మీద తిరగరాదూ? అందానికి, అదే ఉన్నత స్తాయి!
వీళ్లందరికీ, 'ఆలోచించడం' ఇప్పటికే తెలిసినట్టా? లేకపోతే, ఇంకా నేర్చుకోవలిసినట్టా? నేర్చుకోవలిసింది లేదా?
ఇవ్వాళ ఒక పేపర్లో, ఒక ఆడది, చేనేత చీర ప్రకటన చేసింది. ఒక కాలు అంతా, తొడ దాకా నగంగా బైట పెట్టేసింది. చీర కుచ్చెళ్లు ఇంకో కాలు మీదే వున్నాయి. చీరలు అలా కట్టుకుంటే అందం అని! నగం కాలి మీద లంగా అయినా లేదు! ఏ మనిషికైనా, 'ఆలోచించడం' వుంటుంది. కాకపోతే అదంతా వంకర టింకరగా. 'పాలించే వర్గ భావాలే ప్రజల భావాలు' కదా? ఆ పాలించే వర్గ భావాలన్నీ తప్పులు! తప్పులు! జనాలకి ఆ తప్పుల్ని నేర్చుకోడం చాలా బాగా వచ్చు! కమ్యూనిస్టులూ, ఆ జనంలో వాళ్లే. జనం, తప్పుల్నీ, ఒప్పుల్నీ, సమానంగా చూస్తారనీ, చూడాలనీ కాదు. తప్పుల్నే ఒప్పులుగానూ, ఒప్పుల్నే తప్పులుగానూ చూస్తారు. అంటే, పూర్తిగా తారుమారు గానూ, తల్లకిందులు గానూ! 'పెట్టుబడికి, లాభం రావాలి' అని పెట్టుబడిదారుడు అనుకోవడమే కాదు కార్మికులందరూ కూడా అలాగే అనుకుంటారు. అసలు, 'పెట్టుబడి' అంటే ఏమిటో పెట్టుబడిదారుడికీ తెలీదు కార్మికులకూ తెలీదు. అంత తెలియని ఆలోచనల్లో, 'పెట్టుబడికి లాభం రావాలనే తప్పుడు విషయం, ఎంతో సరైన విషయంగా అందరి ఆలోచనల్లోనూ కిక్కిరిసి వుంటుంది. తప్పుని వదిలేసి, ఒప్పులోకి రావాలి కదా? అందుకే, 'ఆలోచించడం నేర్చు కుందామా?' అనే ప్రశ్నతో అవసరం! నేర్చుకోకపోతే, తప్పులో నుంచి ఒప్పులోకి ఎలా వస్తాం? మొదట, తప్పేమిటో తెలియాలి. తప్పు తెలిస్తే, దానికి వ్యతిరేకమైనదే ఒప్పుగా ఎలాగా తెలుస్తుంది. తప్పు తెలిసే మార్గం ఏమిటి? ఇంకేమిటి? మార్క్సిజమే. అది తెలియడానికి మార్గం, 'కాపిటల్' పుస్తకమే! మొదట అది తెలిస్తే, 'ఆలోచించడం నేర్చుకోవడం' ప్రారంభమైపోతుంది. ఆ పుస్తకం తర్వాత, ఇతర పుస్తకాలూ ఉన్నాయి. అంటే, చివరికి ఆలోచించవలిసింది ఏమిటంటే, మార్క్సిజమే తెలియకపోతే, సరైన, ఒప్పు అయిన ఆలోచన, ప్రారంభమే కాజాలదని అర్థం! మా నాయనమ్మకి మార్క్సిజమే తెలిసి వుంటే, అలా కాల్వలో దొరికే పుణ్యానికి పోయి బురద గుంటలో పడేదా? నాకే, నాలుగేళ్లప్పుడు మంచి ఆలోచన వుంటే, హఠాత్తుగా దొరికిన గింజని నోట్లో పెట్టుకోకుండా, దూరంగా పారెయ్యకుండా, చెవిలో ఇరికించుకునేదాన్నా? ఇప్పటికీ, ఆలోచించడం అంతా ముగిసిపోయింది అనుకోను. నేర్చుకునేది వుంది. పేపర్లు రోజూ భలే వింతల్ని చూపిస్తూ వుంటాయి. ప్రెసిడెంట్ దగ్గిర్నించి అవార్డు అందుకునే మనిషి, ఆ ప్రెసిడెంట్ మొహం వేపు చూడడు. తన మొహాన్ని ప్రపంచం అంతా చూడాలని, అవతల అదేదో అందుకుంటూ కెమెరా వేపు చూస్తూ వుంటాడు! ఏ అవార్డు అందుకునే వాళ్లనైనా చూడండి! వాళ్లు, దాన్ని ఇచ్చే మనిషి వేపు చూడరు. ఇంకో వింత కూడా కనపడుతూ వుంటుంది. ఒకరు, ఇంకొకరి నోట్లో స్వీట్లు పెడుతూ వుంటారు. అంత గొప్ప దృశ్యాన్ని అందరూ చూడాలని కెమెరా వేపు మొహాలు తిప్పుతారు. ఆ స్వీటు, ఎదుటి మనిషి నోటి దగ్గిరికి గాక, ముక్కు దగ్గిరికి చేరిపోతూ వుంటుంది! చుట్టూ బోలెడు మంది జనం వుంటారు. అయినా, అంత మందిలో ఒక్కడే స్వీటు తింటాడు. పేపర్లే లేకపోతే ఇటువంటి వింతలు ఎలా చూడగలం? నిర్లక్ష్యంగా చెప్పుకోవాలంటే, ప్రపంచం ఇంకా 'ఆలోచించడం' ప్రారంభించనే లేదు. ఆలోచించడం ప్రారంభమై వుంటే, ఇంత చిన్న చిన్న తప్పులు జరుగుతాయా? మానవ సమాజం ఇంకా జంతు లోకంగానే వుంది. అందుకే, 'ఆలోచించడం నేర్చుకుందామా?' అనే ప్రశ్న వేధిస్తూ వుంటుంది.'ఇప్పుడెవరూ పుస్తకాలు చదవడం లేదు' అంటున్నారు కొంతమంది. అది నిజమో కాదో గానీ, పుస్తకాల ప్రచురణలైతే ఎప్పటిలాగా జరుగుతూనే వున్నాయి. పాఠకులు, కొత్త పుస్తకాల్ని కొంటూనే వున్నారు. అయితే, ఆ కొన్న వాటిని చదువుతున్నారో లేదో, అది మాత్రం బైట పడని విషయం. నాకు, తోటి రచయితల నించి అప్పుడప్పుడూ వారి కొత్త పుస్తకాలు వస్తూనే వుంటాయి. నేను వెంటనే, 'మీ పుస్తకం అందిందండీ నా వీలుని బట్టి చదువుతాను' అని రాసేస్తూ వుంటాను. లేదా, ఆ రచయిత నంబరు వుంటే, వెంటనే చెప్పేస్తూ వుంటాను. ఆ తర్వాత తప్పకుండా ఆ పుస్తకాన్ని తెరుస్తాను. పుస్తకాలు చదివే వాళ్లకి కొత్త పుస్తకాల్ని చూస్తే, చాలా సంతోషంగా వుంటుంది. కొత్త పుస్తకంలో ఏ విషయం వుందో, దాని కోసం కాదు ఇక్కడ నా ఆశ్చర్యం! ఇప్పుడు పుస్తకాల ప్రచురణలు ఎలా వుంటున్నాయో అందరూ చూస్తూనే వుంటారు. అయినా పట్టించుకోరనుకుంటా. ఒక పుస్తకంలో మొత్తం పేజీలు 100 అయితే, అందులో కనీసం 15, 20 పేజీలకు పైగా పూర్తిగా ఖాళీగా, తెల్ల కాయితాలతోనే వుంటాయి. ఆ తెల్ల కాయితాల్ని వదలడంలో, వాటి సంఖ్య ఒక్కో పుస్తకంలో ఒక్కో పద్ధతి. మొదటి పేజీలో, పుస్తకం పేరూ, రచయిత పేరూ అదీ, వుంటాయి. ఆ పేజీ వెనక ధరా అదీ! ఇంత వరకూ ఫర్వాలేదు. మూడో పేజీలో 'విషయ సూచిక' వుంటే, దాన్ని, ఆ పేజీలో అట్టడుగున, నలకలంతంత అక్షరాలతో పట్టిస్తారు. ఆ 'నలక అక్షరాల జబ్బు' పుస్తకం అంతా సాగుతుంది. 'విషయ సూచిక' మూడో పేజీతో అయిపోతే, 4వ పేజీ అంతా ఖాళీ, తెల్లగా! ఎందుకంటే, అది 'ఎడమ వేపు' కదా? ఎడమ వేపు, అరిష్టం. అక్కడ ప్రారంభించకూడదు కుడి వేపే శుభ ప్రదం! కుడి వేపే ప్రారంభించాలి. 4వ పేజీని ఖాళీగా వదిలేస్తారు. 5వ పేజీలో (కుడి వేపు) 'ముందు మాట' మొదలుపెడితే, అది, 7వ పేజీలో (కుడి వేపు) పైన 2 లైన్లతో (నిజంగా 2 లైన్లతో) ముగిసిపోతే, ఇక ఆ పేజీనంతా ఖాళీగా వదిలేస్తారు. ఆ 7వ పేజీని వెనక్కి తిప్పితే 8వ పేజీ, వస్తుంది. అది మళ్లీ ఎడమ పేజీ! అక్కడ అసలు రచనని మొదలుపెట్టకూడదు. ఎడమ వేపు అరిష్టం! కాబట్టి అది అంతా ఖాళీ! కుడి పేజీలోనే అసలు రచన ప్రారంభం! ఎక్కడా? ఆ పేజీలో అట్టడుగున! పై భాగం అంతా, 3 పావుల దాకా ఖాళీ! నాలుగో పావులో రచన ప్రారంభం! నలక లంతంత అక్షరాలతో! అవి, కథలు అయితే, మొదటి కథ, 4, 5 పేజీల్లో నడిచి, కుడి వేపున పైన, 2, 3 లైన్లతో పూర్తి అయితే, మిగతా పేజీ అంతా మళ్లీ ఖాళీ! అక్కడ మధ్యనుంచైనా రెండో కథని మొదలుపెట్టరు. దాని వెనక, ఎడమ భాగం అవుతుంది. కొత్త కథని, అక్కడ మొదలు పెడతారు గానీ, అది అట్టడుగునే. ఆ పేజీలో, పైన, మూడు వంతుల భాగం వదిలేసి!
( తరువాయి భాగం గురువారం సంచికలో..)
- రంగనాయకమ్మ