Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాదవందనాలు, ప్రమాణాలు' శీర్షికతో సెప్టెంబర్ 2న ఆంధ్రజ్యోతిలో కంచ ఐలయ్య షపర్డ్ రాసిన వ్యాసానికి మరుసటి రోజే సెప్టెంబర్ 3న వనంజ్వాల నర్సింహ్మరావు 'పాద నమస్కారం భారతీయ సంస్కారం' పేరిట పెద్ద వ్యాసం రాశారు. ఐలయ్య లేవనెత్తిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికీ సూటిగా, స్పష్టంగా జవాబు ఇవ్వకుండా బ్రాహ్మణుల ఔనత్యాన్ని, మనువాద సిద్ధాంత పవిత్రతను, నమస్కారం, పాదాభివందనం గొప్పతానాన్ని వివరించారు. పనిలో పనిగా ఐలయ్యపై రాళ్లు, రప్పలు వేస్తూ శాపనార్థాలు పెట్టాడు. పైగా 'దోపిడీ చేసినవారు, దోపిడీకి గురైన వారు అంతరించిపోయారు. ఇప్పుడున్నది సమసమాజం. అందరూ భారత రాజ్యాంగం కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం' అని రాశాడు. పసిరికలు అయినవాడికి లోకమంతా పచ్చగా కన్పించినట్టు, అశాస్త్రీయ భావాలు, తర్కవిరుద్ద భావాలు రాసి తన తలలో గూడు కట్టుకున్న మనువాద భావాలు బహిర్గతం చేశారు. ఐలయ్య బ్రాహ్మణులపై దాడి చేసినట్టు అభాండాలు వేశారు. తన నిర్హేతుక వాదనలను కాసింత కామన్సెన్స్ గల బ్రాహ్మణులు కూడా ఒప్పుకోరన్న విషయం విస్మరించారు. వాటిని వివరంగా పరిశీలించి చూదాం. కంచ ఐలయ్య ఒక విషయం స్పష్టంగా రాశారు. దేశంలో ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పదవుల్లో శూద్రులు ఉన్నారు. కాబట్టే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వారి కాళ్లు మొక్కలేదు. పూర్వ రాష్ట్రపతి, ప్రస్తుత గవర్నర్ బ్రాహ్మణులైనందున పబ్లిక్గా వారి కాళ్లు మొక్కాడు. దేశంలో ఉన్నతమైన స్థానంలో శూద్రులుంటే కూడా వారిని 'కులం' వెంటాడుతున్నది. దేశంలో కులం ఎంత బలంగా ఉందో అది ఎలా మనుషులను విభజిస్తున్నదో కంచ ఐలయ్య సూటిగా చెప్పారు. ఇంత స్పష్టంగా రాసినా ఒక్క ముక్కా జ్వాలాకు అర్థం కాలేదట.
దీనికి నర్సింహ్మరావు 'మన శరీరంలో ఈశ్వరుడెలా వున్నారో అన్ని ప్రదేశాల్లో అలానే ఉన్నాడు. స్థూల దృష్టితో చూస్తే మనం నమస్కారం చేసేది జగన్మయుడైన భగవంతుడికే. వాయు, అగ్ని, చెట్లు, సముద్రాలు అన్ని విష్ణువు శరీరమే. కాబట్టి నమస్కారం చేయాలి' అని రాశాడు. ఇదే వాస్తవమైతే మనుషులను 4 వర్ణాలుగా ఎందుకు విభజించినట్టు? నాలుగు వర్ణాలు దేవుని బిడ్డలే అయితే ఒక్కో వర్ణం ఒక్కో అవయవం నుండి ఎందుకు పుట్టినట్టు, ఈ కట్టుకతపై జ్వాలా వివరణ ఇవ్వగలరా? అందరి శరీరంలో ఈశ్వరుడే ఉంటే ప్రణబ్ముఖర్జి, నర్సింహ్మన్లలో ఉన్న ఈశ్వరుడు కోవింద్, వెంకయ్య నాయుడు, మోడీలో ఎందుకు కన్పించలేదు? 'అదాభివాదనమ్' అనే పుస్తకంలో నమస్కారం గురించి క్షుణ్ణంగా వివరించారని చెప్తూ 'తల్లికి, తండ్రికి, జ్ఞాన ప్రధానకు, క్షత్రియుడికి నమస్కారం చేయాలి. తన కంటే కనీసం మూడు సంవత్సరాలు అధికంగా ఉంటే వారికి నమస్కారం చేయాలి. చిన్నవాడైన మేనమామకు, పిన తండ్రికి నమస్కారం చేయవలయును. వృద్ధుడైన ఇష్టంలేకపోతే నమస్కారం చేయాల్సిన పనిలేదు. 'వేదాలను చదివిన వారు, చిన్నవాడైనా నమస్కరించ తగినవాడు' అని జ్వాల పేర్కొన్నాడు. ప్రశ్న ప్రణబ్, నరసింహన్లకు ఎందుకు మొక్కారన్నది కాదు. కోవిందు, వెంకయ్య నాయుడు, మోడీకి ఎందుకు ఆ అర్హతలు లేదన్నది. వేదాలు చదివిన వాడికి ఉన్న స్థానం ఇతరులకు ఉండదనేనా జ్వాలా చెప్పదలిచింది. వీరు రాజ్యాంగ రీత్యా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారే కదా? పైగా మనువాదాన్ని గట్టిగా సమర్థించే వారు కదా! ఆర్ఎస్ఎస్ భావజాలనికి అంటే హిందూ మతభావాలకు నిండైన ప్రతినిధులు కదా! అయినా వారు శూద్రులు. పాదాభివందనం చేయదగ్గవారు కాదు. కేసీఆర్ మనోగతాన్ని ఆయనకంటే సమర్థవంతగా చెప్పారు జ్వాల. నర్సింహ్మరావు సూటిగా చెప్పకుండా డొంక తిరుగు వివరణలు ఎందుకు?
నమస్కారం చేస్తున్న వ్యక్తి అలా చేసేటప్పుడు కాని, పాదాభివందనం చేసేటప్పుడు కాని, ఎవరికైతే అలా చేస్తున్నమో, ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, బ్రాహ్మణేతరుడా అని ఎవరు చూడరు. నమస్కారానికి తన దృష్టిలో అర్హుడా? కాదా? అనేది చూస్తారు. పాదాభివందనం చేసే విషయంలో అర్హత విషయాన్ని మరింత లోతుగా ఆలోచించడం బేరీజు వేయడం సమంజసం అని రాస్తూ 'పాదాభివందనం చేయడం అనేది వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి విశ్వాసపూరిత ప్రేమ సమాజం కోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనం చేస్తాం. ఇలా పాదాభివందనాలను, నిత్యం కానీ లేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో చేయడం కాని భారతీయ సంస్కృతి సంప్రదాయం' అని వివరించారు నర్సింహ్మరావు. నల్గురూ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది జ్వాలా వాదన. ఐలయ్య అడిగిన వాటికి సూటిగా సమాధానం ఇవ్వకుండా బ్రాహ్మణులను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు. ఇందుకు హిందూమతాన్నీ ఉపయోగించుకొన్నారు. పైగా 'వయస్సుచే కాని, విద్యచేత కాని అధికులైన వారికి ఎదురుగా వెళ్లి నమస్కరిస్తే, వారికి ఆయువు, విద్య, కీర్తి, బలం, వృద్ధి లభిస్తాయని మనుధర్మ శాస్త్రంలో ఉందని' నర్సింహ్మరావు రాశారు. మనుధర్మశాస్త్రం ప్రకారం 'కోవిందు, వెంకయ్యనాయుడు, మోడీ'కి ఆ అర్హతలు లేవనే కదా జ్వాలా చెప్పుకొచ్చేది. సంతోషం ఇంత పచ్చిగా చెప్పుకోవడానికి జ్వాలా ఎందుకు పూనుకొన్నట్టు. ప్రభు భక్తి చాటుకోవడానికి ఇంతకంటే మరో మార్గం కన్పించలేదా?'బ్రాహ్మణేతరుడైన సత్యసాయిబాబాకు దేశ విదేశ ప్రముఖులెందరో పాదాభివందనం చేశారు. అందులో పి.వి.నర్సింహ్మరావు లాంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు' కరెెక్ట్. ఆ సంగతి ప్రభువుల వారికి ఎందుకు చెప్పడం లేదు. బండారం బయటపడే వరకు పంజాబ్, హర్యానలో డేరా బాబాకు కూడా లక్షలాది భక్తులున్నారు. బాబాల పేరిట ఎందరో మహిళలను కామతృష్ణకు బలిచేశాడు, వారి రాసలీలల్లో భగవంతుడిని చూసినవారు ఈగ, దోమ వాలనివ్వలేదు. ఇందులో పాలక పార్టీలవారు, పాలకులూ ఉన్నారు. పైగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి బాబాల విషయంలో నర్సింహ్మరావుకు గౌరవం ఉంటే మనం చేయగలిగింది ఏమీలేదు. చంద్రశేఖర్రావు పదవిలోకి రాకముందే ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు. ఇప్పుడు చేస్తున్నారని రాశారు. యజ్ఞ,యాగాల ద్వారానే రాష్ట్రం సిద్ధించిందని చెప్పి, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన 1400పైగా అమరులకు అన్యాయం చేశారన్నదే ఐలయ్య వాదన. ఇక్కడ విప్లవ సిద్ధాంతంలో ఏండ్లతరబడి పని చేసినవారు పదవుల కోసం కేసీఆర్ వెంట పాకులాడుతున్న హేతువాదులు, భౌతికవాదులు, సిద్ధాంత కర్తలు ఈ మూఢనమ్మాకాల విషయంలో నోరు మెదపడం లేదు. కారణం పదవుల మీద వారికున్న ఆశ, ఆకాంక్షలు అలాంటివి. యజ్ఞ, యాగాదులు సొంతంగా చేసుకుంటే అభ్యంతరం లేదు, కాని ప్రజల ధనం కోట్ల రూపాయలను పదవులు అడ్డం పెట్టుకొని ఖర్చు చేస్తుంటే ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుంది? ముఖ్యమంత్రిగా చేసిన చండీయాగంలో తమను దూరంగా ఉంచారన్న లోకల్ అర్చకుల ఆవేదన జ్వాలా చెవికి సోకలేదని నమ్మాలా! చివరగా నర్సింహ్మరావు ఇది సమసమాజం అని పేర్కొన్నాడు. మళ్లీ అదే ప్రశ్న. సమసమాజమైతే శూద్ర అతిశూద్రులెందుకు పాదాభివందనాలకు అర్హులు కారు. ఆయన వ్యాఖ్యలు పరిశీలిస్తే నర్సింహ్మరావు రోజు కళ్లముందు కన్పిస్తున్న సంఘటనలను పరిశీలించకుండనైనా ఉండాలి. లేదంటే దొర వారి అడుగులకు మడుగులొత్తుతూ, వారి కరుణా కటాక్షాల కోసం తాపత్రాయ పడేవారైనా కావాలి. అలాంటి వారు తమ మానన తాము బతకకుండా ఐలయ్య లాంటివారిపై విద్వేషం వెళ్లగక్కడం ఎందుకు, తాటి చెట్టు ఎందుకెక్కావు రా అంటే కల్లు కోసం అని చెప్పకుండా దూడగడి కోసం అని చెప్పినట్టుంది.
రోజు దళితులపై దాడులు జరుగుతుంటే, తినే తిండిపై ఆంక్షలు విధిస్తుంటే, రోజుకొక్క వాగ్దానం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలను మూఢ నమ్మకాల బారినుండి బయట వేయడానికి వారికి శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని మేల్కొపవలసిన రచయితలు, కవులు, కళాకారులు ఎంగిలిమెతుకులకు ఆశపడి కాలం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో కంచ ఐలయ్య రాసే రాతలకు, వేసే ప్రశ్నలు కరుగానే ఉంటాయి. సమాజ మార్పు కోసం దోహదపడేవే తప్ప అడ్డు పడేవికావు.
- కిల్లె గోపాల్
సెల్ : 9490098760