Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం శాసనసభా సమావేశాలు యాభై రోజులు నిర్వహిస్తామని చెప్పి 16 రోజులకే ముగించింది. ఇన్ని రోజుల శాసనసభా సమావేశాలు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ రూపంలో నిరసన తెలుపుతాయి. నిరసన ఎందుకు చెబుతున్నామో కూడా వివరిస్తాయి. కానీ శాసనసభలో ప్రభుత్వ సమాధానం తర్వాత మాట్లాడేందుకు ప్రతిపక్షాలు మైక్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మైక్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సభ్యులు విస్తు పోయారు. ప్రొటెస్ట్ చెప్పడానికి అని అనడంతో.. ఒక్క నిమిషంలో చెప్పాలని ఆదేశించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసేవారు. ప్రొటెస్ట్ అని చెప్పి ఉపన్యాసం ఎలా చెబుతారు. మీరు ఏదో అంటారు.. ఇవతల పక్కన మరొకటి అంటారు.. ఇలా అయితే ఎలా..? అని ప్రతిపక్ష సభ్యులతో డిప్యూటీ స్పీకర్కు వాదన జరిగేది. ఈ తంతు ప్రతీసారి, ప్రతిరోజూ సాగింది. దీనిపై గ్యాలరీలో ఉన్న మీడియా మిత్రుల మధ్య చర్చ జరిగింది. నిరసన అంటే డిప్యూటీ స్పీకర్ అర్థంలో నాలుగు పదాల్లో చెప్పి వెళ్లిపోవడం. పాపం ఆ విషయం ప్రతిపక్ష సభ్యులకు అర్థం గాక డిప్యూటీ స్పీకర్ను ఇబ్బంది పెట్టడం బాగుండలేదు అని ఒక మీడియా మిత్రుడు చెప్పగానే మిగతా జర్నలిస్టులు నవ్వుకున్నారు. బయట నిరసన చెప్పే హక్కు తీసేశారు. సభలోనూ ఆ పదం ఉచ్చరించకుండా చేయడానికి ప్రభుత్వం ముందస్తు వ్యూహం అయి ఉండవచ్చు అని అన్నారు.
- బి.జగదీశ్వర్