Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి ఏడుకొండల ఎంకన్నపై వేల పాటలు పాడి.. ఆయన్ను రంజింపజేసినవాడు అన్నమయ్య. శ్రీనివాసుణ్ని ఎంతగా పొగిడాడో.. అంతకంటే ఎక్కువగా 'బ్రహ్మ మొక్కటే.. పరబ్రహ్మమొక్కటే...'నని చెప్పటం ద్వారా మనుషులందరూ ఒక్కటేననే జీవిత సత్యాన్ని జనాలకు ఉద్బోధించాడు ఆ వాగ్గేయకారుడు. అలాంటి అన్నమయ్యకు.. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులకు లింకు ఉందంటున్నారు ఓ సీనియర్ పాత్రికేయుడు కమ్ రాజకీయ విశ్లేషకుడు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఇటీవలి శాసనసభా సమావేశాల తీరు తెన్నులను మననం చేసుకోవాల్సిందే... 16 రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ సభ్యులు.. అదే పనిగా కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. అది ప్రశ్నోత్తరాలైనా, జీరో అవర్ అయినా లేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలైనా సరే.. ఏకబిగిన పావుగంట నుంచి అరగంటపాటు వారు సీఎంకు భజన చేయటం ఆనవాయితీగా మారింది. వీరి కీర్తనలను అదే పనిగా వినలేక పాత్రికేయులు విసుగెత్తిపోయారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. ఒకరోజు టీఆర్ఎస్ సభ్యులకు తోడు మరో దోస్త్.. కేసీఆర్ను బ్రహ్మాండంగా భుజానికెత్తుకున్నారు. ఆయన రాజాధిరాజు, మార్తాండ తేజుడు.. అనే లెవల్లో సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. తన స్పీచ్ ఆఖర్లో 'అసలు కేసీఆర్కు సీఎం పదవి చాలా చిన్నది...' అని సదరు నేత వ్యాఖ్యానించేసరికి గ్యాలరీలో కూర్చున్న జర్నలిస్టుల కండ్లు బైర్లు కమ్మాయి, మెదడు మొద్దుబారి మూర్ఛపోయినంత పనైంది. ఇప్పటికైనా గుర్తొచ్చిందా..? అంతలా కేసీఆర్ను కీర్తించిన ఆ మహానుభావుడు... ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ... కోట్ల విజయభాస్కరరెడ్డి దగ్గర్నుంచి ఇప్పటి దాకా ఇలాంటి రసవత్తర నాటకాలెన్నింటినో చూసిన మన సీనియర్ జర్నలిస్టు.. 'ఓర్నాయనో.. వెంకటేశ్వరస్వామిని అన్నమయ్య కూడా ఈ లెవల్లో కీర్తించి ఉండడు. అన్నమయ్య అన్న ఉన్నమయ్యలాగా అక్బరుద్దీన్.. ఈ విధంగా కేసీఆర్ను ఆకాశానికేత్తేశాడు...' అనుకుంటూ అక్కణ్నుంచి నిష్క్రమించాడు...
-బి.వి.యన్.పద్మరాజు