Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లుగీత వృత్తిపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. నిజాం కాలంలో కల్లును ప్రధాన ఆదాయంగా భావించిన నవాబులు ప్రతి ఏటా ఎంత ఆదాయం ఆశిస్తున్నారనే వివరాలతో ఒక పాలసీని విడుదల చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మద్యాన్ని కూడా కలిపి ఎక్సైజ్ పాలసీ పేరుతో ఇదే పద్ధతిని అవలంభించారు. కొన్నేండ్ల క్రితం లిక్కర్ని వేరు చేసి లిక్కర్ పాలసీ పేరుతో, గీత వృత్తికి సంబంధించి కల్లు పాలసీ పేరుతో ప్రకటిస్తున్నారు. దాదాపు నిజాం కాలంలో రూపొందించిన చట్టాలు, నిబంధనలు, పన్నులు నేటికీ స్వరాష్ట్రంలోనూ యథావిధిగా కొనసాగిస్తున్నారు. గీత కార్మికులపై, సొసైటీలకు విధించే వివిధ రకాల పన్నులు, ఫర్మానాలతో కూడిన విధానాన్నే కల్లు పాలసీ అంటున్నారు. చేతి వృత్తులకు చేయూత అందిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కల్లు గీతపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులు కూడా తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూసారు. కానీ గత పాలసీనే యథావిధిగా ప్రకటించింది. కానీ తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం గీతకార్మికులు వృత్తి చేస్తున్నారు. తమ కండ్లమందే చెట్టుపైనుండి జారి కిందపడి చనిపోతూ, వికలాంగులు అవుతున్న ఘటనలు కనపడుతూనే ఉన్నాయి. అయినా గత్యంతరం లేక బతకుతెరువు కోసం వృత్తి చేస్తున్నారు. వీరినుండి కూడా ప్రభుత్వం పన్నుల రూపేణా ఆదాయం రాబట్టడం ఎంతవరకు సమంజసం. ఉమ్మడి రాష్ట్రంలో వున్న పద్ధతే తెలంగాణ రాష్ట్రంలోనూ వుంటే అర్థమేముంది. రాష్ట్రంలో కోటి తాటి, ఈత చెట్లు వున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4342 సోసైటీలు, 3688 టీఎఫ్టీల ద్వారా 2,16,785 మంది సభ్యత్వం కలిగి వృత్తిచేస్తున్నారు. సభ్యత్వం ఇవ్వకున్నా వృత్తి చేసేవారు లక్షల సంఖ్యలోనే వున్నారు. ఒక చెట్టుగీస్తే భూమి యజమానికీ, ప్రభుత్వానికీ పన్ను చెల్లించాలి. పట్టణాలైతే రూ.50, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.15కోట్లు చెల్లిస్తున్నారు. పట్టేదార్లు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ పన్ను ఇవ్వాలని డిమాండ్ చేయడం, లేకపోతే చెట్లు గీయనీయ కుండా అడ్డుకోవడం, దాడులు చేయడం, చెట్లు నరకడం లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో చెట్టుకు రూ.50 నుండి 300వరకు ఇస్తున్నారు. కల్లు పాలసీని అమలు చేయడమంటే పన్నులు వసూలు చేయడం మాత్రమే అనే భావనలో ఉన్న అబ్కారీ శాఖ అధికారులకు ఇదేం పట్టడం లేదు. బలవంతపు వసూల్లు జరగుతు న్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పట్టేదారుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఈ పేరుతో గీతకార్మికులు సుమారు రూ.100కోట్లు చెల్లిస్తు న్నారు. ఈ భారం గీతకార్మికులపై పడకుండా ప్రభుత్వం చూడాలి. కుల వృత్తులకు రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం గీతకార్మికుల నుండి పన్ను వసూలు చేయడం సమంజసమేనా? ఏ వృత్తిలో లేని పన్ను ఈ వృత్తిలో ఎందుకు ఉన్నట్టు. కులాల భవనాలకు, సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్న ప్రభుత్వం గీత కార్మికులపై వేస్తున్న పన్ను రూ.15కోట్లు రద్దుచేస్తే నష్టమే ముంటుంది? ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించిన వారికి ఉపాధి కోసం వారికి శిక్షణ ఇప్పించి, ఉపకార వేతనాలు ఇచ్చి, రుణసౌకర్యం కల్పించి ప్రోత్సహిస్తోంది. కానీ గీతకార్మికులు తామే స్వయంగా వృత్తిలో నైపుణ్యం పొంది ప్రభుత్వాన్ని ఆశించకుండా స్వయం పోషకంగా జీవిస్తున్నారంటే వీరికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి. చెట్టు యజమానికి గీతకార్మికులు చెల్లిస్తున్న పన్నును చెల్లించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఈ పాలసీ ప్రకారం ఐదేండ్లకు ఒకసారి లైసెన్సు తీసుకోవాలి. ప్రభుత్వ నిబం ధనలు అనుసరించి సభ్యత్వం పొంది, సొసైటీ, టీఎఫ్టీల ను ఏర్పాటు చేసుకున్న తర్వాత షాపులకు అనుమతి ఇచ్చారు. ఇది శాశ్వతంగా అమలు జరగాలి. కానీ ఐదేండ్లకు మళ్లీ రెన్యూవల్ చేయాలనడం గీత కార్మికులను వ్యయ ప్రయాసలకు గురిచేయడమే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారంలో చెట్ల పెంపకం చేపట్టింది. రోడ్డుపక్కన, చెరువు కట్టలకు ఈత చెట్లు నాటడం మంచిదే, కానీ వాటికి రక్షణ లేక చనిపోతున్నాయి. పాలసీలో 560 జీవో ప్రకారం సొసైటీకి 5ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్నది. ఇది అమలు కావడంలేదు. భూమి ఇచ్చి దానిలో హైబ్రిడ్ చెట్లునాటి నీటి సౌకర్యం కల్పిస్తే గీతకార్మికులే వాటిని సంరక్షించుకుంటారు. జాతీయ పోషకాహార సంస్థ కల్లులో అనేక పోషకాలు ఉన్నాయని క్యాన్సర్లాంటి రోగాలు రాకుండా దీని ద్వారా నివారించవచ్చని తెలిపింది. దీనిని ప్రభుత్వమే ప్రచారం చేస్తే కల్లుకు మార్కెట్ పెరుగుతుంది. గీతకార్మికులకు ఉపాధి కలుగుతుంది. తాటి, ఈత, ఖర్జూర చెట్లద్వారా నీరా తీయవచ్చు. దీనిని నిల్వ ఉంచే పద్ధతి, బాట్లింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే శీతల పానీయాల కు దీటుగా నిల్వబెట్టవచ్చు. దీంతో బెల్లం, చెక్కర, జామ్, చాక్లెట్సు, ఫామ్ వైన్ లాంటి అనేక బై ప్రొడక్ట్స్ తయారు చేయవచ్చు. దీనివలన గీతకార్మికులతోపాటు యవతరానికి ఉపాధి కలుగుతుంది. గతంతో పోలిస్తే తాటి చెట్లు గణనీయ సంఖ్యలో తగ్గిపోయాయి. దీంతో యాభై ఏండ్ల కింద రూపొందించిన నిబంధనలలో మార్పులు చేయాల్సిన అవసరముంది. ప్రతి గీతకార్మికుడికి 30చెట్లు ఉండాలనే నిబంధన తొలగించాలి. చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం రూపొందించాలి. గీత కార్మికులు వున్న చోట కొత్త షాపులకు అనుమతి ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలనుండి వృత్తిచేస్తూ జీవనం గడుపుతున్న గీతకార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇక్కడ రద్దయిన సొసైటీలను పునరుద్ధరించాలి. వీరికి మైదాన ప్రాంత గీత కార్మికులతో సమానంగా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు కొత్త జిల్లా పేరుతో ఇవ్వాలి. ఇప్పటికే వృత్తిచేస్తూ అర్హులైన వారందరికీ సభ్యత్వం ఇవ్వాలి. కల్లుడిపోల పరిధిలో చెట్లు గీసేవారికి, షాపుల్లో పనిచేసేవారికి అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చి కనీస వేతనాలు అమలు జరిగేలా కల్లు విధానాన్ని రూపొందించాలి.
సెల్ : 9490098485
ఎంవి.రమణ