Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అవినీతి, నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నాం. ఇది ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది' అని 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ ప్రధాని చేసిన ఈ ప్రకటనకు ఏడాది పూర్తయింది. ఆ ప్రకటన ద్వారా మోడీ ప్రభుత్వం రూ.15.4 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దుచేసింది. పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలకు మోడీ సర్కార్ దశలవారీగా నిర్వచనాలు చెప్పింది. కానీ ఆ తర్వాత జరిగిందేమిటి? సాధించిందేమిటి? ప్రధాని ప్రకటన చేసిన తర్వాత తెల్లారి రోడ్డెక్కితేగానీ దాని ప్రభావమేమిటో ప్రజలకు అర్థం కాలేదు. దేశ ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. తమ డబ్బును తాము తీసుకునేందుకు పనులన్నీ మానుకుని బ్యాంకుల ముందు సమయం వెచ్చించారు. బ్యాంకు క్యూల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, తమ డబ్బు ఎలా మార్చుకోవాలో తెలియని కొందరు గుండెపోటుతో మృతిచెందారు. బ్యాంకు అధికారులు కూడా పని ఒత్తిడితో కార్యాలయంలోనే మృతిచెందిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. సామాన్యులు రూ.రెండు వేల కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతుంటే.. బడాబాబులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి... తమ కూతుళ్లు, కొడుకుల పెండ్లీలు అట్టహాసంగా జరిపిన వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలే చూశారు. ఇవన్నీ పక్కనపడితే... మోడీ చెప్పిన లక్ష్యాల్లో ఏం సాధించారో.. ఒకసారి పరిశీలిస్తే...
బ్యాంకులకు ఎంత.. ఎలా వచ్చింది?
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ప్రకారం... పెద్ద నోట్ల రద్దు తర్వాత 1.48 లక్షల బ్యాంకు అకౌంట్లలో రూ.4.9 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇవి ఒక్కోటి రూ.80 లక్షలకుపైబడిన అధిక విలువ కలిగిన డిపాజిట్లు. 1.48 లక్షల బ్యాంకు ఖాతాల్లోని సగటు డిపాజిట్ పరిమాణం రూ. 3.3 కోట్లు. చిన్న డిపాజిట్లు.. అంటే 2 లక్షల నుంచి రూ. 80 లక్షలు వరకు... 1.09 కోట్ల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయ్యాయి. ఈ ఖాతాల్లోని సగటు డిపాజిట్ విలువ రూ.5 లక్షలు. అంచనాల ప్రకారం... మొత్తం రద్దయిన పెద్దనోట్లలో రూ.10 లక్షలకుపైగా డిపాజిట్ అయినది మూడింట రెండొంతుల నగదు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు అప్పట్లో విలేకరులతో మాట్లాడుతూ రూ.3 లక్షల కోట్ల వరకు నగదు బ్యాంకుల్లో జమ కాకపోవచ్చని చెప్పారు. కానీ, చివరికి రూ.16,000 కోట్లు మాత్రమే జమ కాలేదు. సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లను లెక్కించాక అది మరింత తగ్గింది. రూ.15.4 లక్షల కోట్ల విలువైన పెద్దనోట్లను రద్దుచేయగా, బ్యాంకుల్లో రూ.15.3 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టు ఈ ఏడాది ఆగస్టులో రిజర్వు బ్యాంకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. దీనర్థం రద్దయిన కరెన్సీలో 99 శాతం జూన్ 30 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చింది. పెద్ద నోట్ల రద్దును మోడీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది. నగదు బ్యాంకులకు చేరడంపై విమర్శకులు పలు ప్రశ్నలు సంధించారు. రద్దయిన దాదాపు మొత్తం నగదు బ్యాం కింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిందంటే.. ప్రభుత్వం ఎలాంటి నల్లధనాన్నీ కనుక్కోలేక పోయిందనేది స్పష్టం. నల్లధనాన్ని పెద్ద ఎత్తున కనుగొన్నారన్న ప్రాతిపదికన, తొలి సంవత్సరం రూ. 2.5 లక్షల కోట్ల రాబడి వస్తుందని, ఆ తర్వాత ప్రతి ఏటా రూ. 1.5 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా కట్టారు. అది కాస్తా తుస్సుమన్నది.
నల్లధనంపై చర్యలు
నల్లధనంపై పోరాటంలో పెద్ద విజయంగా పెద్దనోట్ల రద్దును ప్రభుత్వం ప్రజల ముందుంచింది. 'రూ.4 వేల కోట్ల మోసానికి పాల్పడిన మూడు లక్షల కంపెనీలను మూసివేయించాం' అని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పగా చెప్పారు. కో-ఆపరేటివ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 'పెద్ద నోట్ల రద్దు తర్వాత 58 వేల అకౌంట్లు కలిగిన 35 వేల కంపెనీలు దాదాపు రూ.17 వేల కోట్లను డిపాజిట్, విత్డ్రా చేయడం జరిగిందని 56 బ్యాంకులు సమాచారం ఇచ్చాయి'. ఒక కేసులో, నవంబర్ 8, 2016 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగిన ఓ సంస్థ పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2,484 కోట్లు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం జరిగింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం... 2.24 లక్షల కంపెనీలు గత రెండుమూడేండ్ల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి పని లేకుండానే నిలిచిపోయి ఉన్నాయి. ఇందులో దాదాపు 38 వేల కంపెనీలు షెల్ కంపెనీలు లేదా సంస్థలనీ, అవి వ్యాపారాలు చేసేందుకు కాదనీ, కేవలం అవి ఆర్థిక మోసాలకు పాల్పడేందుకే వెలసినవని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ మూసివేసిన కంపెనీల లెక్కలనే ఇప్పుడు చూపిస్తోంది. ప్రధాని ప్రకటనకు ముందే... బడాబాబులకు సమాచారం చేరిందనీ, వారంతా నలుపును తెలుపుగా మార్చుకునే చర్యలు చేపట్టాకే ప్రకటన వెలువడిందనే విమర్శలూ సర్వత్రా వెల్లువెత్తాయి.
నకిలీ కరెన్సీ లక్ష్యం ఏమైంది?
ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నకిలీ కరెన్సీ వ్యాపారానికి దెబ్బ తగిలినట్టు ఎక్కడా కనిపించడం లేదు. 2015లో రూ.400 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ చలామణిలో ఉన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదిక చెబుతోంది. ఇది మొత్తం కరెన్సీలో 0.028 శాతం. రద్దయిన వెయ్యినోట్లలో ఇది 0.0007 శాతం మాత్రమేనని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. అదీ రూ.500 రూపాయల నోట్లతో పోలిస్తే 0.002 శాతం నకిలీ. బ్యాకులకు వెనక్కి వచ్చిన నోట్లలో నకిలీ కరెన్సీ నోట్ల మొత్తం విలువ రూ.41 కోట్లుగా గుర్తించారు. బ్యాంకులు నకిలీ కరెన్సీలను గుర్తించడంలో విఫలమయ్యాయా? లేదా నకిలీ కరెన్సీకి సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో గాడి తప్పిందా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
డిజిటల్ లావాదేవీలు
విదేశాల్లోలాగే నగదు రహిత విధానమే పెద్దనోట్ల రద్దు లక్ష్యంలో మరొకటని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుతామని చెప్పారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. డిజిటల్ చెల్లింపుల వద్ధి రేటు 40 నుంచి 70 శాతం పెరిగింది. గతంలో ఇది 20 నుంచి 50 శాతం వరకూ ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు వేగంగానే పెరిగాయన్నది వాస్తవం. నగదు కొరత తగ్గిన తర్వాతి నెలల్లో డిజిటల్ లావాదేవీలు తగ్గాయి. గతేడాది నవంబర్లో రూ.94 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి, ఇది డిసెంబర్కు వచ్చేసరికి రూ.149 లక్షల కోట్లకు పెరిగింది. కానీ, ఈ ఏడాది జులై నాటికి రూ.107 లక్షల కోట్లకు తగ్గాయి.
ఆర్థిక వృద్ధి - విపత్కర పరిస్థితులు
పెద్ద నోట్లరద్దు ప్రకటించిన తర్వాత మొదటి ఆర్థిక త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో వద్ధిరేటు 7.9తో పోలిస్తే 6.1 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వద్ధిరేటు 5.7 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో 7.1 శాతంగా నమోదైంది. జీడీపీకి నోట్ల రద్దు శరాఘాతంలా మారింది. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో ఉపాధిని కోల్పోయారు. తాము పండించిన పంటలను అమ్ముకోలేక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఇక్కట్లనెదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వెనుకబాటుకు, వృద్ధి రేటు క్షీణించడానికి పెద్దనోట్ల రద్దే ప్రధాన కారణమని, దీనికి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తోడైందని చాలా మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తీవ్రవాదం
నోట్ల రద్దు జరిగిన పది నెలల తర్వాత జమ్ము కాశ్మీర్లో గతం కంటే ఉగ్రవాద సంఘటనలు 38 శాతం పెరిగాయి. పౌరుల మరణాల సంఖ్య 2500 శాతం పెరి గింది. భద్రతా దళాల మృతుల సంఖ్య రెండు శాతం పెరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాద ఘటనలు, పౌరుల మరణాలు 45 శాతం తగ్గాయి, కానీ భద్రతా సిబ్బంది మరణాలు 82 శాతం పెరిగాయి. మోడీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలే కా దు, సొంత పార్టీలోని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. యశ్వంత్ సిన్హా, అ రుణ్శౌరీ, శత్రుఘ్నసిన్హా లాంటి వారు వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. సంబరాలు మీరెందుకు చేయాలి? సంతోషంగా ఉంటే.. ప్రజలే ఉత్సవాలు చేసుకునేవారంటూ బీజేపీ నేత శతృఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుతో పెట్టుబడిదారుల వద్ద నున్న నల్లడబ్బు తెల్లగా మారిపోయిందన్నది బహిరంగ రహస్యమే. వీటిపై నిరసన లు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనైనా ప్రధాని పెద్దనోట్ల రద్దుతో దేశానికి ఒరగబెట్టిం దేమిటో ప్రజలకు చెప్పాలి? అన్నిటికీ మౌనం సమాధానం కాదని గుర్తించాలి.
సెల్ : 8500121696
ఎం.లలిత