Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణ విజ్ఞానం కలిగి, సాధారణ స్థానాల్లోనే వుండి బాధ్యత వహించి పని చేసిన విప్లవకారుడు మానికొండ సుబ్బారావు. ఆయన 1918లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా నందమూరులో జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి బుల్లెమ్మ గొప్ప సంస్కారవతి. మానికొండ చదువులో ఆలస్యంగా ప్రవేశించాడు. బందరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులయ్యాక బీవీఎస్సీ కోర్సులో ప్రవేశించాడు. ఒకటి రెండేండ్లు చదివి అక్కడ జరిగే అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామం చేరాడు.
మానికొండకు 19వ ఏట వివాహమ్యైంది. అంత చిన్న వయసులోనూ వివాహ సందర్భంగా మానికొండ నూతన ప్రమాణాలు నెలకొల్పారు. కట్న కానుకలు లేకుండా సూర్యావతిని వివాహం చేసుకున్నారు. నాటి కమ్యూనిస్టు ప్రముఖుడు అన్నాప్రగడ కామేశ్వరరావు గుంటూరు జిల్లా మంతెనవారిపాలెంలో 'విద్యా వనం' అనే ఆదర్శ పాఠశాల ప్రారంభించారు. తుమ్మల వెంకట సుబ్బయ్య మొదలైన మిత్రులతో కలిసి సేవాదృష్టితో మానికొండ ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించారు. కొంతమంది కమ్యూనిస్టుల ఆచరణను ప్రత్యక్షంగా చూడగలగటం, ఇవన్నీ పెనవేసుకొనే ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరడానికీ, కార్యాచరణకూ ప్రేరేపించాయి. పార్టీకి అతి క్లిష్ట సమయం అది. నందమూరులో మానికొండ ఇల్లు పార్టీ కార్యకర్తల రహస్య సమావేశాలకు స్థావరంగా, రక్షణ దుర్గంగా తయారైంది. కృష్ణాజిల్లా కమ్యూనిస్టు కమిటీ ఆ రహస్య కాలంలో జయప్రదంగా నడవడానికి మానికొండ ప్రధాన పాత్ర వహించారు. గన్నవరం తాలూకాలో బలమైన కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు.
1945-46 నాటికే మానికొండ కుటుంబం ఆదర్శ విప్లవ కుటుంబంగా పేరొందింది. మానికొండ తాను కమ్యూనిస్టుగా ఉద్యమంలోకి దిగడంతోనే ఆగిపోకుండా భార్య సూర్యావతిని విప్లవనారిగా తయారు చేశారు. తల్లి బుల్లెమ్మను విప్లవ మాతగా తీర్చిదిద్దారు. సాధారణంగా తల్లులు తమ బిడ్డలు పెద్ద ఉద్యోగాలు సంపాదించి ఆర్జనాపరులై ప్రయోజకులు కావాలని ఆశిస్తారు. కానీ ఆవిడ తన ఒక్కగానొక్క కుమారుడు కష్టభూయిష్టమైన కమ్యూనిస్టు కార్యకర్త జీవితాన్ని ఎంచుకున్నందుకు చింతించలేదు. గోర్కీ నవల 'అమ్మ'లోని నిలోవ్నాను తలపింపచేసింది. మానికొండ ఇంటికెందరెందరో వచ్చి పోతుండేవారు. వారినందరినీ తన బిడ్డల్లాగా ఆదరించింది. ఆమె 'కమ్యూన్' నిర్వహించారు. పార్టీ కోసం సభ్యులు, కార్యకర్తలు తమ ఆస్తిపాస్తులను సమర్పించాలని పిలుపు ఇచ్చినప్పుడు మానికొండ దంపతులు తమ ఆస్తి యావత్తూ పార్టీకి సమర్పించారు. తన కొడుకూ కోడలూ వాళ్ల వంతు ఆస్తిని పార్టీ కోసం త్యాగం చేసినప్పుడు బుల్లెమ్మగారు వారిని ప్రోత్సహించారు.
మానికొండ సూర్యావతి సర్పంచ్గా, ఎంపీపీగా, శాసనమండలి సభ్యురాలుగా పని చేశారు. నాటి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పిసి.జోషి మానికొండను ప్రజాస్వామిక భర్త అనీ, ఆదర్శ కమ్యూనిస్టు రివల్యూషనరీ భర్త అనీ అభివర్ణించారు. 1975 జనవరి 27వ తేదీన కృష్ణాజిల్లా కాటూరులో పార్టీ నిధి వసూళ్ల కార్యక్రమంలో వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. సొంత లాభం సాంతం మానుకొని ప్రజల కోసం అహర్నిశలూ పని చేసిన ఆదర్శమూర్తి మానికొండ.
- యు.రామకృష్ణ