Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం ప్రారంభమైంది. చిరుజల్లులు కురుస్తుంటే మనసు మైమరిచిపోతున్నది. చిన్నప్పుడు వాన నీటిలో వదిలిన కాగితపు పడవల జ్ఞాపకాలతో తనువు పులకించిపోతున్నది. ఈ తుళ్లింతలు ఓకే. వీటి గురించి మన హైదరాబాద్ నగరవాసులకు చెబితే మాత్రం వారికి ఒళ్లు మండిపోవటం ఖాయం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల విశ్వనగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కురిసింది చిన్న వర్షమే. అయినా సెల్లార్లలోకి నీళ్లు, కార్ల మునకలు. ఇవి చాలదన్నట్టు ఓ కారు నీటిలో మునిగి.. అందులో ఉన్న ఓ యువకుడు ఊపిరాడక మరణించిన దుర్ఘటన. ఎక్కడ చూసినా వాన నీరు. నోరు తెరిచిన మ్యాన్హోళ్లు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇటు హుస్సేన్సాగర్లోగాని, అటు మూసీనదిలోగానీ తేలటం ఖాయం. తెలంగాణ ఉద్యమ సమయంలోను, అటు తర్వాత గద్దెనెక్కిన కొత్తలోనూ మన ప్రభుత్వాధినేతలు అచ్చంగా ఇవే వాక్యాలను వాడుతూ భాగ్యనగర వాన కష్టాలను ఏకరువు పెట్టారు. హైదరాబాద్ను ఈ కష్టాల నుంచి గట్టెకిస్తామనీ బల్లగుద్దారు. నగరాన్ని సింగపూర్లాగా సింగారిస్తామని చాణక్య శపథం చేశారు. నాలుగేండ్లు గడిచిపాయె. సింగపూర్ మాటేమోగాని.. సిటీల వర్షం కురిస్తే నీళ్లు పోనీకి జాగా లేక అవి ఇండ్లల్లోకి వచ్చి పడ్తున్నరు. వాన నీటితో హైటక్ సిటీ.. అంబర్పేట ఏకమై పోతున్నరు. అయినా మన పిచ్చిగానీ వాన నీరు, మురుగు నీరు పోవటానికి వీలుగా నాలాలను విస్తరించాల్సిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే నీరు మాత్రం ఏం చేస్తది. తన ఇష్టానుసారంగా ఇండ్లల్లోకి, ఆఫీసుల్లోకి జొరబడ్తది. జనం మస్తు బేజారైపోతున్రు. అందుకే చిరు జల్లులు.. వాన నీటి పడవలు అనే జ్ఞాపకాలను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేసి, మన హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో టైటానిక్ సినిమాను గుర్తుకు తెచ్చుకుందాం...
-బి.వి.యన్.పద్మరాజు