Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలి.. సర్వ హక్కులు రాష్ట్రాలకు ఉండాలి.. కేంద్ర దయా దాక్షిణ్యాలు మాకొద్దు.. ప్రధాని అయినా, రాష్ట్రపతి ఐనా రాష్ట్ర ముఖ్యమంత్రులే కింగ్ అంటూ రాష్ట్రాలు పట్టుకొని తిరిగి ప్రచారం చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపించగానే వొంగి వొంగి దండాలు పెట్టారు. అయ్యో.. పెద్ద సారుకు ఇది చాలదూ అనుకున్నాడేమో వెంటనే తన వెంట తీసుకువెళ్లిన పట్టు శాలువా కప్పి నడుము వొంచి నమస్కరించి అంతా మీదే దయా..! అన్నట్టు వ్యవహరించారు. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం ఎందుకని మరి ప్రధానిని ఎందుకని అడగలేదో. పోని దేశ ప్రధాని కదా ఆ మాత్రం మర్యాద ఇవ్వాలి.. కదా అనుకుంటే.. మరీ నిటి అయోగ్ సమావేశంలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఎందుకని నిలదీయలేదు. కేంద్రమే లేకుంటే రాష్ట్రాలే లేవన్నట్టు ప్రసంగించారు. ఢిల్లీలో నాలుగు రోజుల మకాం వేసినా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రికి కేంద్ర పెత్తనం గుర్తుకు రాలేదు. 'నాది మేకపోతు గాంభీర్యమే.. నా మాటలు విని మీరు మోసపోయారా? రాజకీయాల్లో ఇవ్వన్నీ మామూలే..' అన్నట్టు నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ద్వారా సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు సందేశం ఇచ్చినట్టు ఉంది.
- సంజయ్కుమార్