Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత విద్య ప్రమాణాలు, పరిశోధన ఫలితాలు, ఆవిష్కరణలు ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింపచేస్తాయి. నాణ్యమైన ఉన్నత విద్య గల దేశాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వీటిలో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉన్నాయి. నేడు దేశంలో అన్ని వర్సిటీలూ నూతన పరిశోధన కేంద్రాలుగా మారాయి. చాలామంది విద్యార్థులు నేడు ఆసక్తితో పరిశోధనలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలు చేయటం సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోవడం కోసం యువత పోటీ పడుతున్నారు. నేడు దేశంలో పరిశోధనల అభివద్ధిలో చాలా వ్యత్యాసం కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చాలా వ్యత్యాసం కనబడుతోంది, కేంద్ర వర్సిటీలు తక్కువగా ఉండటం, వీటికి కేంద్రం ఎక్కువ నిధులను కేటాయించడం ద్వారా అవి ఎక్కువగా అభివద్ధి చెందటం, విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయటం, పరిశోధన చేసే ప్రతి విద్యార్థికి రూ.15వేల నుంచి 20వేల వరకు ఫెలోషిప్ ఇవ్వటం ద్వారా విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పరిశోధన జరపడం తద్వారా నాణ్యమైన అవిష్కరణలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వర్సిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండటమే కాకుండా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఈ వర్సిటీలకు వస్తుంటారు. నేడు చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరిశోధన చేయడానికి ఆసక్తి చూపడం, తక్కువ నిధులు, తక్కువ ప్రమాణాలు ఉన్నపటికీ, పరిశోధన చేయటానికి తగిన వాతావరణం లేనప్పటికీ విద్యార్థులు అప్పులు చేసి మరి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ వర్సిటీలో చదివే ప్రతీ విద్యార్థి కేంద్రం, యూజీసీ అందించే ఫెలోషిప్లపై ఆధారపడి చదువుతున్నారు. విద్యా వ్యవస్థపై పాలకుల మాటలు కోటలు దాటుతున్నా, ఫలితాల్లో డొల్లతనం జాతిని వెక్కిరిస్తోంది. రానురాను ఫెలోషిప్ల సంఖ్యను తగ్గించడం ద్వారా ఆ ప్రభావం ముఖ్యంగా రాష్ట్ర వర్సిటీలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై పడుతుంది. 2014కి పూర్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు యూజీసీ అందించే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలుగా నోటిఫికేషన్ జారీ చేసేది, 2014 తర్వాత సంస్కరణల పేరుతో ఈ నోటిఫికేషన్ను రెండు సార్లకు బదులుగా విద్యా సంవత్సరానికి ఒక్కసారే వేస్తున్నారు. 2015 జూన్లో ఈ నోటిఫికేషన్ వేస్తే 2016 మార్చిలో ఫలితలు విడుదల చేశారు. ఈ ఆలస్యంలో విద్యార్థులు ఒక ఏడాది ఫెలోషిప్ను కోల్పోయారు. రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు నోటిఫికేషన్ను జారీ చేయలేదు. గతంలో నాన్ నెట్, బీఎస్ఆర్, తదితర ఫెలోషిప్ల ద్వారా విద్యార్థులకు కొంత మేర ఆర్థిక ఉపశమనం కలిగేది. కానీ నిధులు లేవని యూజీసీ ఈ ఫెలోషిప్లను మొత్తానికే నిలిపేసింది. ప్రస్తుతం రాష్ట్ర వర్సిటీలో చదివే విద్యార్థులకు కొన్ని ఫెలోషిప్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ముఖ్యమైంది. ఈ ఫెలోషిప్ నోటిఫికేషన్ను సకాలంలో విడుదల చేయకపోవడం ఫలితాల విడుదలలో జాప్యం జరగటం ద్వారా ఈ ఫెలోషిప్పై ఆధారపడి చదివే విద్యార్థులలో తీవ్రమైన నిరాశ కలుగుతుంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకు ఎలాంటి సహకారం అందించటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 11 వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ వర్సిటీల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా నిధులు ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థులు నాణ్యమైన పరిశోధను చేయలేకపోతున్నారు, సరిగ్గా ల్యాబ్లు లేకపోవటం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం ద్వారా విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓయూలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పరిశోధనలు చేస్తున విద్యార్థులు అప్పులు చేసి మరీ చదువుతున్నారు. తెలంగాణలో అన్ని 11 వర్సిటీలకు కలిపి ఈ విద్యా సంవత్సరం రూ.210 కోట్లు కేటాయించారు. అంటే వర్సిటీల అభివద్ధికి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో ఈ కేటాయింపులను బట్టి చెప్పొచు. ఆధునిక కాలంలో సంస్కరణలు తేవడం మంచిదే కానీ సంస్కరణల పేరుతో పేద విద్యార్థులను చదువులకు దూరం చేయటం మంచిది కాదు.
- చింత ఎల్లస్వామి
సెల్ : 9908186025