Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత తమదేనని బీరాలు పలికిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి బలహీన వర్గాలను మోసం చేశారు. తెలంగాణ తొలి ఎన్నికల్లో అధికారంలోకి రాగానే దళితుడిని సీఎం చేస్తానన్న హామీని విస్మరించిన ఆయన.. రెండోసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ వారిని పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధిక సీట్లు అగ్రవర్ణాలకే కట్టబెట్టడం సామాజిక న్యాయంపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. జనాభాలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన సీట్లు కేవలం 51 కాగా.. ఏడు శాతం ఉన్న అగ్రకులాలకు 54 స్థానాలు ప్రకటించారు. అణగారిన వర్గాలనుద్దేశించి దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు చెబుతూ వస్తున్న సామాజిక న్యాయం ప్రకటనలకే పరిమితమవుతున్నది తప్ప.. ఏ ఒక్కరూ ఆచరణలో పెట్టింది లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ప్రజలను మభ్యపెట్టేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. చివరకు సామాన్యుల ఓట్లతోనే గద్దెనెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికగా, స్పష్టమైన ఎజెండాతో ప్రజల్లో పురుడు పోసుకున్న బీఎల్ఎఫ్.. జనాభాలో సగభాగమున్న బీసీలకే సగం సీట్లు కేటాయిస్తామని ముందుగానే ప్రకటించింది. మహిళలను ఉపముఖ్యమంత్రి పదవితో గౌరవిస్తామని ముసాయిదాలో తెలిపింది. మరి ప్రలోభాలకు తలొగ్గి 'దొర'పాలనను మళ్లీ స్వాగతిస్తారా... బహుజనుల రాజ్యాధికారం కోసం నిలబడిన పార్టీలను గెలిపించుకుంటారా అన్నది ప్రజల ముందున్న ప్రశ్న.
- రామర్తి రవితేజ, హైదరాబాద్.