Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత కరీంనగర్ జిల్లాకు చెందిన సిరిసిల్ల - జగిత్యాల తాలుకాలను 1978 అక్టోబర్ 20వ తేదిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నేటికి 40 ఏండ్లు పూర్తవుతుంది. న్యాయమైన రైతు - కూలీ పోరాటాలను అణచివేయడానికి భూస్వామ్య దొరల గడీల్లో పోలీసు క్యాంపులుపెడ్తూ, వేలాదిమందిని అరెస్టు చేయడానికి అనుగుణంగా ప్రయోగించిన ఈ చట్టాన్ని దేశ-విదేశి ప్రముఖులు, అంతర్జాతీయ జర్నలిస్టులు, దేశ వ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు, ఎంవీ తార్కుండే లాంటి న్యాయమూర్తులు ఎంతోమంది ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ చట్టాన్ని ఎత్తేయనందున, ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, కూటములు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి వుంది.
''బాంచెన్ దొరా నీ కాల్మొక్త'', ''దొరా నీ గులాపోన్ని'' అంటూ చెప్పులు చేతిలో మోస్తూ, దొరల ముందు కొత్త బట్టలు కట్టుకొని తిరగలేక, వారిముందు సగౌరవంగా జీవించలేని పరిస్థితుల్లో మట్టికాల్ల రైతులు, ఆడా - మొగ ఐక్యంగా చేసిన పోరాటమే సిరిసిల్ల - జగిత్యాల పోరాటంగా ప్రసిద్ధిగాంచింది. మధ్యయుగాల నాటి ఫ్యూడల్ దోపిడీ రూపాలైన వెట్టిచాకిరి, కట్టుబానిసత్వం, వడ్డీ, నాగు, కౌలు, దండుగలు, దరావత్ లాంటి ఆర్థిక దోపిడీలు సాగేవి. అంటరానితనం, అవిద్య, బాల్యవివాహాలు, స్త్రీలపై లైంగికదాడులు, కులవృత్తులపై పెత్తనం లాంటి సామాజిక పీడనలు అమలు జరిగేవి. ప్రజలు తమ ఓటుహక్కును సైతం స్వేచ్ఛగా ఉపయోగించుకోలేని పరిస్థితులన్నింటిపై జరిగిన పోరాటాలు సిరిసిల్ల - జగిత్యాల రైతాంగ జైత్రయాత్రలుగా ప్రసిద్ధిగాంచినవి. 1947 ఆగస్టు 15 తర్వాత 1948లో రూపొందించిన మొట్టమొదటి నల్లచట్టం ''మద్రాసు కల్లోలిత ప్రాంతాల చట్టం-1948'' కింద సిరిసిల్ల, జగిత్యాల తాలుకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారు. 40 ఏండ్ల అణచివేత తర్వాత ఏ గ్రామాల్లోనూ ఈనాడు పోలీస్ క్యాంపు లేదు. ఉద్యమం చల్లారిందని కేంద్ర - రాష్ట్ర పాలకులు ప్రకటించినందున బేషరతుగా సిరిసిల్ల, జగిత్యాల కల్లోలిత ప్రాంతాలుగా రద్దు చేసి, ఈ కల్లోలిత చట్టాన్ని తెలంగాణలో అమలు చేయబోమని పార్టీలు ప్రకటించాలి.
ఈ నల్లచట్టం కింద ఊర్లన్నీ జైళ్ళవుతున్న సమయంలో 1978లోనే పీడీఎస్యూ విద్యార్థి కార్యకర్తగా నేను కరీంనగర్ జిల్లా విద్యార్థి మహాసభల అనుమతి కోరుతూ జగిత్యాల డీఎస్పీ దగ్గరికి వెళ్లాను. అనుమతికి బదులు తన కార్యాలయంలోనే డీఎస్సీ నన్ను అరెస్టు చేయించాడు. కొదురుపాక గ్రామంలో ''రాజవ్వ అనే సంఘ కార్యకర్తను సామూహికంగా లైంగికదాడి చేయించిన భూస్వాములు'' తిరిగి ఆ ప్రజలపైనే కేసు పెట్టి అందరినీ జైళ్లో పెట్టారు. జిల్లాలో జైళ్లు, పోలీస్స్టేషన్లు, పోలీసు క్యాంపులన్నీ ఉద్యమ రైతాంగంతో నిండిపోవడంతో కొదురుపాక ప్రజలతోపాటు నన్ను ఇదే కేసులో ఇరికించి ముషీరాబాద్ జైళ్లో బంధించారు. నా కాలేజి సర్టిఫికెట్లో వయస్సు అధికంగా ఉన్నా వాస్తవంగా ఆనాటికి నేను మైనర్నే. ఒక మైనర్గా నా జీవితాన్ని జైల్లోకి నెట్టిన కల్లోలిత ప్రాంతానికి నేను ప్రత్యక్ష బాధితుడినే. 1982లో జగిత్యాల తాలుకాలో, 1984లో సిరిసిల్ల తాలూకాలో బూటకపు ఎన్కౌంటర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతమంతా భూస్వాములు, గూండాలు, సంఫ్ు పరివార్ శక్తులు, పోలీసులు సాగించిన హత్యాకాండతో నెత్తురుటేర్లు పారాయి. వీటిని నిరసిస్తూ పుంఖానుపుంఖాలుగా సాహిత్యం, పరిశోధనలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ''సిరిసిల్లా, జగిత్యాల కల్లోలిత ప్రాంతమంట / ప్రజలందరి సౌభాగ్యం దొరలకు కల్లోలమంట'' అంటూ నేనూ అనేక పాటలు రాశాను. 1981-82 ప్రాంతంలో అమరులు డా||కె.బాలగోపాల్, ప్రొ||ఎం.కోదండరాంలు రైతాంగ ఉద్యమాలను, గ్రామాలను పరిశోధించి ''ణఱర్బతీbaఅషవ ఖీశీతీవఙవతీ'' అంటూ ఒక వ్యాసం రాశారు. అది విమోచన పత్రికలోనూ, ఆ తర్వాత ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (జుూఔ)లో 1982లో ప్రచురించబడ్డది. గున్నార్డ్ మిర్దాల్తో సహ చాలామంది విదేశి రచయితలు రైతాంగపు దయనీయ పరిస్థితులను, వారి ఉద్యమాలను అధ్యయనం చేసి తమ సంఘీభావం ప్రకటించారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేయడానికి 1942 ఆగస్టు 15న రూపొందిన సాయుధ బలగాల ప్రత్యేక చట్టంపై ఆధారపడి 1958లోని ''సాయుధబలగాల ప్రత్యేక పోలీసు అధికారాల చట్టం (AఖీూూA) రూపొందించింది. 1972 నుండి సరిహద్దు రాష్ట్రాలలో వరుసగా ఉనికిలోనికి వచ్చింది. దేశ ఆంతగంగిక భద్రత ప్రధానాంశంగా భారత రాజ్యాంగంలో 355 అధికరణ ఆధారంగా ఉనికిలోనికి వచ్చిన ఈ చట్టాన్ని సైతం దేశంలోని ప్రజాస్వామిక వాదులే గాకుండా, ఐక్యరాజ్యసమితి, జస్టిస్ జీవన్రెడ్డి, హక్కుల రివిజన్ కమిటీ లాంటి ఎందరో ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో దేశం నడిబొడ్డునా అదీ రైతాంగ ఉద్యమాల ప్రభావం సన్నగిల్లిందని పాలకులే చెబుతున్న స్థితిలో కల్లోల పడగనీడలోనే సిరిసిల్ల - జగిత్యాలలో నూతన తరం పుడుతూ ఉండాలా? కల్లోల ముద్రతోనే పాత తరమంతా చస్తూ ఉండాలా? ఏలికలు స్పష్టం చేయాల్సి ఉంది.
నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయడానికి 1948లో పోలీస్ యాక్షన్ పేరిట భారత సైన్యాలు ప్రవేశించిన తర్వాత 1950 జూన్లో సిరిసిల్ల పోలీస్స్టేషన్పై గెరిల్లా దాడి జరిగింది. ఇలాంటి ప్రతిఘటనా చర్యలతో కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైనప్పటికి, ఈ చర్య ఈ ప్రాంతంలో గొప్ప ప్రభావాన్ని పడేసింది. పార్టీ నిషేధం వల్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమిగా సీపీఐ 1952 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ద్వంద నియోజకవర్గమైన సిరిసిల్లలో రెండింటికి రెండు స్థానాలు ూణఖీ అది బలపరిచిన ూజఖీ అభ్యర్థులే గెలిచారు. 1957లో కూడా రెండింటికి రెండు స్థానాలు ూణఖీ గెలిచింది. 1952లో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన పి.వి.నర్సింహరావుపై పీడీఎఫ్ అభ్యర్థిగా కా|| బద్దం ఎల్లారెడ్డి గెలిచాడు. ఆ తర్వాత ఉద్యమ ప్రభావంతోనే 4 సార్లు సి.హెచ్. రాజేశ్వర్రావు 1999లో ఒకసారి సీపీఐ (ఎంఎల్) జనశక్తి గెలిచాయి. ప్రజా ఉద్యమ విజయంగా తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు దాదాపు కల్లోలిత ప్రాంతాలుగానే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది.
ఇలాంటి నల్లచట్టాన్ని ఎత్తేసి తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులు పునరుద్దరించబడ్తాయని అనేకులు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా ఎన్కౌంటర్లు, అక్రమ కేసులు, హాల్ మీటింగ్లపై ఆంక్షలు అమలు జరుపుతూ ధర్నా చౌక్నే ఎత్తేసిన పరిస్థితి ఏర్పడ్డది. కల్లోలిత ప్రాంతాలకు 40 ఏండ్లు నిండుతున్న సందర్భంలో వచ్చిన ముందస్తు ఎన్నికల్లోనైనా పోటీ చేస్తున్న పార్టీలు, సంస్థలు సిరిసిల్ల - జగిత్యాలల్లో కల్లోలిత ప్రాంతాల చట్టం ఎత్తివేతతోపాటు ప్రజా ఉద్యమకారులపై తప్పుడు కేసులు ఎత్తేయడం, ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించడం చేయాలి. పోటా రద్దయిన తర్వాత నక్సల్బరి పోరాట కాలంలో ఉనికిలోకి వచ్చిన 1967 నాటి ''ఖAూA (ఖఅశ్రీaష Aష్ఱఙఱ్ఱవర ూతీవఙవఅ్ఱశీఅ Aష్)-1967'' చట్టానికి 2004లో వచ్చిన సవరణలు జోడించి తెలంగాణలోనూ అమలు చేయడం మొదలైంది. కల్లోలిత ప్రాంతాలుగా సిరిసిల్ల, జగిత్యాలకు విముక్తి కల్పిస్తూ, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్దరణను పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చాలి. 2019 నూతన సంవత్సరం కల్లోలపు చీకట్లను తరిమేసే వెలుగు రాష్ట్రానికి స్వాగతం ఇవ్వాలి.
- అమర్