Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరిశ్చంద్ర కథని చిన్నప్పుడు తెలుగు వాచకాల్లో చదివేశాం. అంతేగాక, అప్పుడప్పుడూ పురాణ కథల పుస్తకాల్లో కూడా చదివే వుంటాం. ఈ కథ గురించి ఏవో చిట్టి పొట్టి గుర్తులే గానీ, అసలా కథేమిటో ఆ నాడు కూడా సరిగా తెలిసి వుండదు.
ఈ మధ్య నాకు కొంచెం ఇదీ అదీ చదవడానికి ఖాళీ దొ రుకుతోందనే చెప్పుకోవాలి. కాస్త ఖాళీ వుంటే, కొత్త పుస్తకాలు దొరికితే, నచ్చితే, శ్రద్ధగా పూర్తి చేస్తాను. లేకపోతే ఎక్కడో అక్కడ వదిలేస్తాను. ఖాళీ అలాగే వుంటే, పాటల వేపు తిరుగు తాను. సీడీలు మంచివే గానీ, 30 ఏండ్ల కిందట తయారు చేసుకున్న టేపుల్ని వదలలేను. వాటిల్లో ఏదో ఒకటి ఎక్కడో అక్కడ తెగి వుంటుంది. అదో ఇబ్బంది! అలాంటప్పుడు, ఇం ట్లో వాళ్ళ సెల్ఫోన్ ఒకటి అడిగి, 'ఏదన్నా పెట్టి ఇవ్వండి' అని వాళ్ళతోనే పెట్టించుకుని, అదేదో చూస్తోంటే, అది హఠాత్తుగా ఎగిరిపోయి, నేను అడగనిదేదో వస్తుంది. సెల్ని ఎలా నడపా లో నాకు రాదు.మొన్న ఎన్నికల ఉపన్యాసాల్ని అక్కడక్కడా తీసేస్తోంటే, హఠాత్తుగా ''సత్య హరిశ్చంద్ర'' సినిమా పేరు ప్రత్యక్షమైంది! - దాన్ని తీసెయ్యాలనుకుంటోంటే, ఆ సినిమాలో ఎస్.వరలక్ష్మి పాటలు వుంటాయని గుర్తొచ్చింది. ఆ పాటల్ని వదలగలనా? ఆ పాటలు ఎన్నో దొరుకుతాయని సంతోషంగా, శ్రద్ధగా, దాన్నే చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా 1965లోది. డైరెక్టరు కె.వి.రెడ్డి.హరిశ్చంద్రుడు, సామంత రాజ్యాలు కూడా వున్న మహారాజు. మహా భక్తుడనీ, నీతి పరుడనీ, అతడికి పేరు! ఆ రాజు భార్య చంద్రమతి, మహా పతివ్రతా, మహా భక్తురాలూనూ. వారికి ఏడేండ్ల కొడుకు లోహితుడు. వీడు, కాబోయే రాజు.హరిశ్చంద్ర రాజు ఏదో యగ్ఞం పూర్తి చేశాడు. ఆ యగ్ఞానికి ఋషులు వచ్చారు. వారిలో ఒక ఋషి, విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు, రాజు తో, 'నీ యగ్ఞ ఫలాన్ని నా కియ్యి!' అన్నాడు. రాజు, ఏమీ సందే హించకుండా, అదేదో 'పాత్ర' లాంటి దాన్ని ఆ ఋషికి ఇచ్చేశా డు! అంటే, ఆ గొప్ప పూజ చేసిన ఫలితం, రాజుకి అందకుం డా, ఆ ఋషికి వెళ్లిపో యింది! 'రాజు, ఋషులు దేన్ని అడిగినా దాన్ని భక్తితో ఇచ్చే స్తాడు' అని రాజు గొప్పతనాన్ని చెప్పే ప్రారంభ ఘట్టం ఇది!
ఒక బిచ్చగాడు వచ్చి, ఏదైనా యాచిస్తే, అతనితో ఏమీ అనకుండా ఎంత ఇవ్వగలిగితే అంత బిచ్చం ఇచ్చెయ్యవచ్చు. అలా గాక, అడిగిన వాడు ఋషి అయితే, అది యగ్ఞ ఫలం అయితే, రాజు ఏమనాలి? 'అయ్యా! నా పాలన క్షేమంగా సాగాలని నేనీ యగ్ఞం చేసుకున్నాను. ఈ పుణ్యం, నా ఆధీనంలోనే ఉండాలి. తమరు ఎన్ని యగ్ఞాలైనా చేసుకోగల రు' అనాలి. అలా అనడం, 'అసత్యం' అవదు. 'దోషం' అవదు. కానీ, ఆ రాజు తత్వం అదే! అడగగానే ఇచ్చేస్తాడు - అని!
ఆ తర్వాత దశ్యంలో, ఆకాశంలో, ఒక దేవుడూ - అతడి భార్యా తేలుతూ నిలబడి వుంటారు. ఆ దేవుడు, భార్యతో, 'హరిశ్చంద్ర రాజుని నేను పరీక్షిస్తున్నాను' అంటాడు. 'ఎందు కు పరీక్ష?' అని దేవుడి భార్య అడగదు. భూమి మీద వున్న మొగవాళ్ల పెళ్ళాలు, భర్తలతో వాదాలో, పోట్లాటలో, చేస్తూ వుంటారు గానీ, దేవుండ్ల భార్యలు మాత్రం అస్సలు నోరు తెర వరు. ఊరికే అలా పక్కన నించుంటారు. పోనీ, ఆ భార్య పని, 'ఒకే భార్యగా వుండడమా' అంటే, అదీ కాదు. సాధారణంగా ఏ దేవుడికైనా భార్యలు బోలెడు మంది వుంటూ వుంటారు. ఎవరో ఒక భార్య, ఆకాశంలో నించోడమే, భర్త పక్క! భార్య లేదంటే దేవుడికైనా పరువు వుండదు కదా?
వరలక్ష్మి పాట కోసం చూస్తూ వుంటే, నాకు ఇంకా అది దొరకలేదు.తర్వాత ఘట్టం, స్వర్గంలో ఇంద్రుడి సభ! అక్కడా ఋషులే. విశ్వామిత్ర ఋషి అక్కడికి వెళ్ళి కూర్చుని వున్నాడు. అప్సరస చేసే వెకిలి గంతుల నాట్యాన్ని ఆశగా చూశారు అందరూ. ఇంద్రుడు, ఋషుల్ని అడుగుతాడు. 'మానవుల్లో స్త్రీ పురుషుల్ని ఉత్తములుగా చేసే పుణ్య వ్రతం ఏదైనా వుందా?' అని! నేను రాసే ఈ మాటలు సినిమాల్లో వున్న మాటలుగానే కచ్చితంగా వుండవు. అక్కడ విన్న వాటిని కొంతైనా మర్చిపో తాను కదా? సారాంశం మాత్రం ఇదే, మారదు.
వశిష్టుడు అనే ఋషి, 'సత్యవ్రతం అనే గొప్ప వ్రతం వుంది' అంటాడు. విశ్వామిత్రుడు రయ్యిన, 'సత్య వ్రతమా? ఏ వ్రతమూ లేదు, ఉండదు' అని అరుస్తాడు. వశిష్టుడు శాంతం గా, 'భూలోకంలో, అయోధ్యా నగరం రాజైన హరిశ్చంద్రుడు మహా సత్యవ్రతుడు' అంటాడు.దాన్ని వ్యతిరేకిస్తూ, విశ్వామి త్రుడు, 'అతడు, రాజుగా వున్నప్పుడు అలా వుంటాడేమో! రాజ్యం పోతే సత్యం పాటిస్తాడా?' అని మళ్ళీ అరుస్తాడు. 'సూర్య చంద్రులు గతులు తప్పినా, ఆ రాజు సత్యాన్ని వదల డు. నా మాట నిజం కాకపోతే, నేను కల్లు తాగుతూ కులభ్ర ష్టుణ్ణి అయిపోతాను' అని శపధం చేస్తాడు వశిష్టుడు.దానికి విశ్వామిత్రుడు, ఇంకా బాగా అరుస్తూ, 'ఆ రాజు అలాంటి వాడైతే, నా తపశ్శక్తిలో సగాన్ని అతడికే ధార పోస్తాను' అని, ఇతడు ఎదురు శపధం చేస్తాడు. తమాషా చూడండి! స్వర్గంలో కూడా 'కులాల' మాటలు వున్నాయి! ఈ ఋషులు మానవులే. స్వర్గానికి వెళ్ళినా, ఏనాడో ఋషులుగా మారినా, 'కులాల్ని' వదలలేదు. పైగా, 'కల్లు' మాట కూడా! స్వర్గంలో తాగే, 'అమతం' మాత్రం 'కల్లు' కాదూ? దానికి, అక్కడ గొప్ప కొత్త పేరు పెట్టారు! స్వర్గంలో, ఋషుల మధ్య ఆ వాదాలు జరుగుతూ వుంటే, ఇంద్రుడు నోరు మూసుకుని కూర్చుని వుంటాడు!అయోధ్యలో, రాజు గారింట్లో, రాజు భార్యకి పీడ కల! ఉలిక్కిపడి లేస్తుంది. భర్తతో చెపుతుంది, 'మిమ్మల్ని సింహాసనం నించి లాగేసినట్టు నాకేదో కల' అని!
రాజు, నవ్వి ఊరుకుంటాడు. 'శత రాజుల్ని నేను లాగేస్తాను గానీ, నన్నెవరు లాగగలరు?' అని అతడికి ధీమా కాబోలు! ఋషులకు ఎన్ని వింతలైనా చెయ్యగలిగే తపశ్శక్తి వుంటుందనీ, తనని సింహాసనం నించి లాగినా లాగుతారనీ, గ్రహించడు.విశ్వామిత్ర ఋషికి, వశిష్ట ఋషిని జయించాలని పట్టు! అది జరగాలంటే హరిశ్చంద్రుడితో అబద్దాలాడించాలి! రాజు, ఇతర రాజుల్ని జయించాలనుకుంటే తపశ్శాలి అయిన ఋషి, ఇతర ఋషుల్ని జయించాలనుకుంటాడు. ప్రతీ చోటా పోటీలు! విశ్వామిత్రుడు స్వర్గం నించి దిగి, హరిశ్చంద్ర రాజు ముందు కూర్చున్నాడు. 'హరిశ్చంద్రా! మేమొక కార్యార్థమై వచ్చినాము' అన్నాడు.'ఏం కార్యం?' అని తెలుసుకోకుండానే, 'సెలవియ్యండి! నెరవేరుస్తాను' అనేస్తాడు రాజు.
ఎదుటి మనిషి కాస్త బుర్ర గలవాడైతే, 'మీ కోరిక ఏమి టో వింటే తప్ప, నేను మాట ఇవ్వలేను' అనాలి. కానీ, హరిశ్చ ంద్రుడు, ఆ రకం కాదు. ప్రతీ సారీ, ఋషులతో, 'విన్నవిం చండి, మీ అనుమతి ప్రకారం నడుస్తాను' అనేస్తాడు. - ఆ రకంగా, తెలియకుండానే మాట ఇచ్చేశాడు. తర్వాత, 'ఇవ్వలే ను' అంటే, అది 'అబద్ధం' అయిపోతుంది. ఎదుటి వాడు ఏం అడుగుతాడో మొదట వినాలి కదా? ఆ తెలివి లేదు రా జుకి. విశ్వామిత్రుడు తన కోరిక చెపుతాడు:'రాజా! నేను ఒక యగ్ఞం చేయాలి. దానికి కొంత ధనం కావాలి. ఆ ధనం, ఎంత కావా లంటే, ఒక బలిష్టుడైన వీరుడు, ఒక బలిష్టమైన ఏనుగు మీద ఎక్కి, ఒక వజ్రాన్ని, ఆకాశంలోకి విసిరితే, అది ఎంత పైకి పో తుందో అంత ఎత్తు వరకూ బంగారు నాణాలు కావాలి' అం టాడు. ఏనుగు మీద కాదు నిచ్చెన మీద ఎక్కితే, బాగా పైకి పోవచ్చు కదా? ఆ ఋషి మాటలకు రాజు వెంటనే ఏం చె య్యాలంటే, ఆ ఋషిని కొరడాలతో బాదించి, ఖైదులోకి తో యించి, వారం రోజుల దాకా మంచి నీళ్లయినా ఇవ్వకుండా మాడ్చాలి. కానీ, ఈ రాజు అలా కాదు కదా? రాజు వెంటనే, 'ఆ ధనం తీసుకువెళ్ళండి ప్రభూ!' అనేస్తాడు. ఋషులకే అంత ధనం పోసే ఈ రాజు, ప్రజా రక్షకుడట! విశ్వామిత్రుణ్ణి, అతని శిష్యుడైన నక్షత్రకుడు అడుగుతాడు, 'ఆ ధనాన్ని ఎలా తీసుకువెళ్తాం?' అని. ఆ ఋషి, తెల్లబోతూ వుంటే, రాజే వెం టనే, 'దానికేముం ది? ఆ ధనాన్ని నేనే ఏనుగుల మీద ఋషి ఆశ్రమానికి పంపిస్తాను' అంటాడు. విశ్వామిత్రుడు అప్పటికి తేరుకుని, ఆ ధనాన్ని రాజు పంపించినా, అదంతా ఆశ్రమంలో పట్టదు కాబ ట్టి, 'అలా వొద్దు రాజా! నీ దగ్గిరే భద్రంగా దాచి వుంచు! నాకు కావలిసినప్పుడు అడిగి తీసుకుంటాను' అం టాడు. అసలు, ఒక యగ్ఞం చెయ్యడానికి అంత బంగారం కా వాలా? 'అంత బంగారం ఇవ్వలేను' అని మొదటే అంటే, 'అస త్యం' అవు తుందా? ఆ తర్వాత, విశ్వామిత్రుడు శిష్యుడితో సహా తన ఆశ్ర మానికి పోయి, ఎడం చేతిలో వున్న నీళ్ళ చెం బులో నించి కా సిన్ని నీళ్ళు కుడి చేతిలో పోసుకుని, ఆ నీళ్ళని నేల మీద ఏదో మంత్రంతో చిమ్మగానే, అరణ్యం నిండా సిం హాలూ, పులులూ, ఏనుగులూ వంటి జంతువులు మందలు మందలుగా పుట్టుకొచ్చి అవి, ఊళ్ళ మీద కూడా పడతాయి. ప్రజలు రాజు ముందుకొచ్చి, తమ కష్టాలన్నీ చెప్పుకుంటారు.
ఇక రాజు, సైన్యంతో అడవుల్లో పర్యటించి, ఆ కర జంతువులన్నిటినీ చంపేసి, ప్రజల్ని రక్షిస్తాడు. సింహాలూ, పులులూ, సినిమాలో పడతామని బాగా పరుగులు తీశాయి.
రాజుని ఏదో ఇబ్బంది పెట్టాలని విశ్వామిత్రుడు అల్లే ఉపాయాలు బెడిసికొడుతూనే వుంటాయి.
రాజు ఇంకా అడివిలోనే వున్నప్పుడు, విశ్వామిత్రుడు కొత్త మంత్రంతో మళ్ళీ నేల మీద నీళ్ళు చిమ్మి, ఇద్దరు సుందరాం గుల్ని సష్టిస్తాడు. వాళ్ళు రాజు ముందుకు వచ్చి, నాట్యం పేరుతో, వికారపు గంతులన్నీ వేస్తారు. 'మేము మాతంగ కన్యలం' అని చెప్పి, 'మమ్మల్ని వరించు రాజా!' అని పట్టుకుం టారు.దానికి రాజు తిరస్కరిస్తాడు. 'బాలికలారా! వెళ్ళిపొండి!' అంటాడు. అప్పుడు, విశ్వామిత్రుడు రాజు ముందుకు వచ్చి, 'వాళ్ళు నా కుమార్తెలు. వాళ్ళని పెళ్ళాడు! రాజు అనే వాడు ఎ న్ని పెండ్లిలైనా చేసుకోవచ్చు. అందులో దోషం లేదు' అంటా డు.దానికి హరిశ్చంద్రుడు, 'రాజు చేసేది అదే అయితే, నేను రాజుగానే వుండను. రాజ్యాన్నే వదిలేస్తాను' అంటాడు. ఇదే మరి! ఈ రాజు బడాయి! నేను రెండో పెండ్లి చేసుకోను - అ ంటే, అది 'అసత్యం' అవుతుందా? విశ్వామిత్రుడు సంతోషం తో, 'అయితే, నీ రాజ్యాన్ని నాకు ఇచ్చెయ్యి! నాకు రాజ్యం చెయ్యాలని వుంది' అంటాడు.'మహా సంతోషంగా ఇస్తాను' అ నేస్తాడు రాజు. సత్య వ్రతం' అంటే ఇలాగే ప్రవర్తించాలా? 'రా జుకి ఇష్టం లేకపోతే, అనేక పెండ్లిలు చేసుకోనక్కరలేదు. రాజు కూడా తన ఇష్టంతో 'ఏక పత్నీవ్రతుడి'గా వుండవచ్చు. నేను, రెండో, మూడో, నాలుగో పెండ్లీలు చేసుకోను' అని చెప్పవచ్చు కదా? కానీ, హరిశ్చంద్రుడు, గొప్ప నీతివంతుడిగా మాట్లాడి రాజ్యం పోగొట్టుకున్నాడు!
రంగనాయకమ్మ
(తరువాయి భాగం గురువారం సంచికలో...)