Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తర్వాత దృశ్యంలో, సింహాసనం మీద గడ్డాల విశ్వామిత్రుడే కనపడతాడు. రాజూ, రాణీ, పిల్లవాడూ, సాదా బట్టలతో, ఆ రుషికి దణ్ణాలు పెడుతూ వుంటారు. అంటే, వాళ్లకి రాజ్యం పోయిందన్నమాట! చంద్రమతి పతివ్రత కాబట్టి, భర్తను ఏమీ ప్రశ్నించదు. అక్కడ వున్న పని వాళ్ళందరూ హరిశ్చంద్రుడి వెంట వెళ్ళడానికే సిద్ధమైతే, దానికి కొత్త రాజు ఒప్పుకోడు. హరిశ్చంద్రుడు ఎవ్వర్నీ తీసుకువెళ్ళకూడదనీ, వాళ్ళందరూ రాజ్య భటులే కాబట్టి, తనకే చెందాలనీ, విశ్వామిత్రుడు అరుస్తాడు. హరిశ్చంద్రుడు అందర్నీ వారించి, భార్యా బిడ్డలతో మాత్రమే బైటికి వెళ్ళిపోతాడు. హరిశ్చంద్రుడి వెనకాల విశ్వామిత్రుడు కూడా బైల్దేరి, 'నాకు ఇవ్వవలిసిన ధనం ఎప్పుడిస్తావు?' అంటాడు. హరిశ్చంద్రుడు తెల్లబోతాడు. దానికి సరైన జవాబు చెప్పలేకపోతాడు. ఎలా చెప్పాలో అలా చెప్పడు. 'నీకు ఇస్తానని చెప్పిన ధనం అంతా, ధనాగారంలోనే ఒక చోట భద్రంగా దాచి వుంచాను. ఆ ధనం నాది కాదు, అది పూర్తిగా నీదే. ఆ ధనం గాక, మిగిలిన ఆస్తే, నా రాజ్యం. ఆ మిగిలిన రాజ్యమే నీకు ఇచ్చాను. నీ ధనం ధనాగారంలోనే వుంది. అది ఎప్పుడో ఇచ్చేసినట్టే' అని చెప్పడు హరిశ్చంద్రుడు! పైగా, తను ఆ ధనం ఇవ్వలేదనీ, ఇంకా ఇవ్వాలనీ, అనుకుంటాడు. 'ఇచ్చేస్తాను, ఒక నెల నాటికి ఇచ్చేస్తాను ఆ ధనం అంతా' అంటాడు. కట్టుబట్టలతో వున్న మనిషి, ఒక నెలలో, అంత ధనం ఎలా ఇవ్వాలని? అదే మరి తెలివిలేని తనం!
విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడి వెనకాల తన శిష్యుణ్ణి వదిలి, మళ్ళీ సింహాసనం ఎక్కడానికి వెళ్ళిపోతాడు. 'ఆ ధనం నేను ఇవ్వ లేను' అని హరిశ్చంద్రుడు అనాలనీ, అలా అంటే, అది 'అసత్యం' అవుతుందనీ, విశ్వామిత్రుడు ఎదురుచూస్తూ వుంటాడు. నక్షత్ర కుడు, హరిశ్చంద్రుడి మీద జాలిగానే వుంటాడు. 'మీరు ఇవ్వవలి సిందంతా ఇచ్చేశారనీ, దాన్ని నేను తీసుకు వస్తూ వుంటే దారిలో దొంగలు ఎత్తుకుపోయారనీ, నేను మా గురువుగారితో చెపుతాను, మీకు కష్టాలు తప్పుతాయి' అంటాడు నక్షత్రకుడు. దానికి హరిశ్చం ద్రుడు ఒప్పుకోడు. 'ఇస్తా! ఆ ధనం ఇచ్చేస్తా' అంటూ అడవుల్లో పె ళ్లంతోటీ, కొడుకు తోటీ, తిరుగుతూ వుంటాడు, చెట్ల నించి దొరి కిన పళ్ళూ అవీ తింటూ. నెల రోజులు పూర్తయిపోయి చివరి రోజు వచ్చేసింది! అప్పటికి కాశీ నగరం చేరతారు. అక్కడ ఒక ఆడ మనిషిని, ఒకరు బజార్లో అమ్మడం చూస్తారు. చంద్రమతి, భర్తతో అంటుంది. 'నన్ను ఎవరికైనా బానిసగా అమ్మి, ఆ ధనం ఇచ్చె య్యండి' అని! ఆ భర్త, బాగా ఏడుస్తాడు. సినిమా డైలాగులన్నీ చె పుతాడు. అయినా, ఆ సాయంత్రంలోగా ధనం ఇవ్వలేకపోతే, వా గ్దానం తప్పిపోయినట్టే! కాబట్టి, బజార్లో పది మంది ముందూ, త ను అయోధ్యా రాజుననీ, రాజ్యం వదిలాననీ, భార్యని అమ్ముకునే అవసరం పడిందనీ, ఆమెని ఎవరైనా కొనాలనీ, జనాలతో చెపుతాడు.
అక్కడ, ఒక ధనికుడైన పురోహితుడు వుంటాడు. మను షులు పోతే, చిన్న దినాలూ, పెద్ద దినాలూ, తద్దినాలూ, అన్నీ చేయించే వృత్తి అతనిది. ఆ వ్యక్తి చంద్రమతిని తన బానిసగా కొంటాడు. తల్లి దగ్గర పిల్లవాణ్ణి కూడా వుంచుకోమన్నాడు. ఆ కొన్న వాడి భార్య మాత్రం మహా రాక్షసి. ఆ బానిసగా వచ్చినావిడ, ఆయోధ్యా నగరపు రాణి అని తెలిసినా, ఆ మనిషి ఏమీ లెక్క చెయ్యదు. తల్లికీ, పిల్లవాడికీ కూడా తెగ పనులు చెబుతూ వుంటుంది. చంద్రమతిని అమ్మడం వల్ల, విశ్వామిత్ర రుషికి ఇవ్వవలిసిన ఆకాశం ఎత్తు ధనం అంతా నక్షత్రకుడికి అందింది! సినిమాలో, ఆకాశం ఎత్తు బంగారం కనపడదు. కాశీ రాజు దగ్గర ఆ లెక్క అంతా జరిగింది - అని తేల్చేశారు!
అయితే, నక్షత్రకుడు, హరిశ్చంద్రుణ్ణి, 'నా బత్తెంగా ఇవ్వవలిసిన ధనం ఇయ్యి' అంటాడు. 'అదేమిటి? నిన్ను నేను బత్తెం ఇస్తానని చెప్పి నా వెంట పెట్టుకున్నానా?' అంటాడు హరిశ్చంద్రుడు. ఈ ఒక్కసారే కాస్త నోరు తెరిచి అడిగాడు.
అయినా సరే, ఆ బత్తెం ఇవ్వాలంటాడు నక్షత్రకుడు. 'నిన్ను అమ్మి, ఆ ధనం నేను తీసుకుని వెళ్తాను' అంటాడు. దానికి హరిశ్చంద్రుడు ఒప్పుకుంటాడు. తను ఇవ్వనక్కర లేని బత్తెం ఇవ్వడానికి ఒప్పుకోవడమే అసత్యం కాదూ? వీర బాహు అనే ఒక కాటి కాపరి, హరిశ్చంద్రుణ్ణి కొంటాడు. ఎంత ధరకి అంటే, లక్ష బంగారు నాణాలకి! అమ్మో, కాటి కాపరి ఉద్యోగం చాలా బాగుందే! ఆ ధనంతో నక్షత్రకుడు వెళ్ళిపోతాడు. ఆ వీర బాహు అనే వాడు, యమ ధర్మరాజే మారు వేషంలో వున్నాడని చివర్లో తేలుతుంది. హరిశ్చంద్రుడు, బొత్తిగా తెలివిమాలినవాడు కాబట్టి దేవుళ్ళందరూ కలిసి, అతనితో ఆడుకున్నారు.
హరిశ్చంద్రుడికి 'వీర దాసు'గా పేరు మారింది. అంటే, వీర బాహుకి దాసుడు - అని! హరిశ్చంద్రుడు కాటి కాపరిగా, పాట పాడుకుంటూ, ద్ణుఖంతో శవాల్ని దహనం చేసే పని చేస్తున్నాడు. ఆ పని కోసం, అతనికి రోజుకి చారెడు బియ్యం ఇస్తాడు యజమాని! శవాల్ని తెచ్చిన వాళ్ళు ఇచ్చే సుంకంలోవే ఆ బియ్యం. చారెడు బియ్యం గాక మిగతా సుంకం వీర బాహుకి వెళ్తుంది. వీర బాహు కల్లు తాగుతూ, ఆడ పిల్లలతో ఆనందంగా గడుపుతూ వుంటాడు. చంద్రమతిని కొన్న వాళ్ళ ఇంట్లో తద్దినం ఉత్సవం వచ్చింది. వాళ్ళకి నలుగురు పనివాళ్ళు వుంటారు. వాళ్ళు నలుగురూ, లోహితుణ్ణి కూడా వెంటబెట్టుకుని అడవిలోకి ఆకు కూరల కోసం బైల్దేరుతారు.
విశ్వామిత్రుడి మంత్రాలు ఇంకా సాగుతూనే వుంటాయి. నేల మీద నీళ్ళు జల్లి, ఒక రాక్షసుణ్ణి పుట్టించి, వాణ్ణి పాముగా మార్చి, ఆ పాముతో లోహితుణ్ణి కరిపిస్తాడు. ఆ పిల్లవాడు అడవిలో ఏడ్చిఏడ్చి చచ్చిపోతాడు! అడవికి వచ్చిన పనివాళ్ళు ఇంటికి పరిగెత్తి, చంద్రమతితో అంతా చెపుతారు. ఆవిడ అడవికి పరిగెత్తుకొచ్చి, చచ్చి పడి వున్న కొడుకుని చూసి, భోరున ఏడుస్తూ, అతన్ని దహనం చేసే ఏర్పాట్లు మొదలుపెడుతుంది.
రంగనాయకమ్మ
(తరువాయి భాగం సోమవారం సంచికలో....)