Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోగి మంటల భగభగలు భాగ్యాలకు నెలవు. సం క్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల సందళ్లు, కొత్త అల్లుండ్ల అలకలు. కానీ ఈ సంక్రాంతికి పల్లెల్లో పంచాయతీ ఎన్నికలతో మరింత జోష్ వచ్చింది. హరిదాసులతోపాటు ఉదయాన్నే అభ్యర్థులు ఇండ్ల ముంగి ళ్లకు వచ్చారు. పండుగ పర్వదినాన అటు బంధువులూ, ఇటూ కుటుంట సభ్యులతో కళకళలాడుతుంటే అభ్యర్థుల ప్ర చారంతో వీధులు మరింత సందడిగా మారాయి. సంక్రాంతికి పల్లెల్లో కొత్త జోష్ నెలకొంది. పంచాయతీ ఎన్నిక ల ప్రచారం పండుగ సందడిని మించిపోయింది. హరిదాసుల సంకీర్తనలకన్నా, అభ్యర్థుల హామీలే ఎక్కువయ్యాయి. గంగిరెద్దుల విన్యాసాలకన్నా నేతల జిమ్మికుల ప్రదర్శనలే అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కోడి పందాల జోరు కన్నా అభ్యర్థులపై ఇతరుల బెట్టింగుల హోరే ఎక్కువుంది. పండుగకు ఎక్కడెక్కడో ఉండేవారు ఊరికి చేరుకోవడంతో ఇదే మంచి అవకాశంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇలా పండుగ, ఎన్నికలు ఒకేసారి రావడంతో ఈ సంక్రాంతి కొత్త జోష్ని సంతరించుకుంది.గ్రామ పంచాయతీ ఎన్నికలు పండుగ తర్వాతనే ఉండటంతో అన్ని గ్రామాల్లో ఎన్నికల 'క్రాంతి' గా మారింది. మొదటి దశ బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో హామీల వర్షాలు, డబ్బు పంపిణీలు జరుగుతున్నాయి. రెండోదశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, మూడో దశలో ఆసక్తి ఉన్న అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు, ఆశీర్వాద స్వీకరణలతో పండుగకు పిలువని చుట్టాల్లా వచ్చి, వారే మర్యాదలు చేశారు. ప్రతి ఇంటినీ పలుకరించి సారె అందించారు. కానుకలాగా చీరలు, పిండి వంటలు, మద్యాన్ని, పండుగ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా తమ ఓటర్లను సంతోషపెట్టే ప్రయత్నాలు కోకొల్లలు. సంక్రాంతి పూట పతంగుల జాతరలను నిర్వహిస్తూ, యువతను ఆకర్షించే విధంగా తమదైన రీతిలో యువ ఓట్లను వశం చేసుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఏ పండుగకైనా ముందుండేవి మందూ, మాంసమూ. తమదైన శైలిలో వివిధ బ్రాండ్లు వారిగా డోర్ డెలివరీ చేస్తూ మద్యం మత్తులో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పండుగలో మరింత జోరు నింపింది. సంక్రాంతి పూట కూడా అన్నదాత పండించిన పంటతో పెట్టుబడిదారులు పండుగ చేసుకుంటున్నారు. కానీ కనీస మద్దతు ధరను ఇచ్చి రైతన్న కండ్లలో ఆనందాన్ని చూడలేకపోతున్నారు. సంక్రాంతి అంటే చీకటి నుండి వెలుగులోకి వెళ్లడం, ఓటమి నుండి విజయం వైపు వెళ్లడం. కానీ తెలంగాణ సైరికుడు మాత్రం సమస్యల్లో చిక్కుకుపోయాడు. మరోవైపు ఏకగ్రీవం పేరుతో పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. భోగి మంంటల్లో పాత వస్తువులను వేసి దగ్ధం చేస్తారు. అలా సమాజంలోని దుశ్చర్యలను దగ్ధం చేసిననాడే నిజమైన సంక్రాంతి.
- రాజేశ్ కారంపూరి
సెల్ : 8143190123