Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ లొంగని యుద్ధభూమి
యుద్ధరావాలు మోగించే రుద్రవీణ
కంటతడి పెట్టకండి- ఇంటికొక్కరు కదిలిరండి
రగులుతోంది... రాబందులపై కసి....
అవుతార్రా మసి మసి... ఒరేరు దొరా...!
అని ధిక్కరించిన ధీరవనిత. కాళ్ల కింద నేల లేకుండా చేస్తున్న వాడిని, పాతాళంలోకి తొక్కేం దుకు ఆడ, మగా తేడా ఏమిటి? భూమి కోసం, భుక్తి కోసం, సమానత్వం కోసం పోరాడటమూ నేరమైతే నేను నేరస్తురాల్నే అని ప్రశ్నించిన సాహసం. పర్వతం తవ్విన ముసలివాడి తెగువ అవ్వది. అ ప్పటి పోరాట నిగ్రహం, ఇప్పుడు నీ విగ్రహం చూస్తే నువ్వు లొంగవు. ప్రశ్నిస్తావు. అందుకే నీది నడుస్తున్న చరిత్ర.. తెలంగాణ తల్లి.. భూ పోరాటాలకు మెటిరియల్ తయారు చేస్తున్నది అవ్వ.. ఆమే చాకలి ఐలమ్మ చిరపరిచితురాలైన పోరాటాల వెలుగమ్మ.
నైజాం రాజ్యాన ఉయ్యాలో, నల్లగొండ జిల్లా ఉయ్యాల
ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో, ఎత్తైన మనిషమ్మ ఉయ్యాల
కరిగిపోయే మనసు ఉయ్యాలో, ఒదిగిపోయే గుణం ఉయ్యాల
పాలకుర్తిలోన ఉయ్యాలో, గట్టిదే ఐలమ్మ ఉయ్యాల
సంఘమే పెట్టింది ఉయ్యాలో, దొరల సంగతే చూసింది ఉయ్యాల...
అంటూ ఇప్పటికీ అమ్మలక్కలు నాట్లల్లో, చేలల్లో గలగల పారే సెలయేటిలో ఐలవ్వ ఉద్యమ జీవితం పాడుకుంటున్నా రంటే ఈ భూమిని ఊపిరిగా చేసుకొని పోరాటమే చిరునా మాగా బతికింది ఐలమ్మ. అక్షరం రాదు కానీ.. హక్కుల పోరాటం తెలుసు. పేదరికం తెలుసు. పెద్దోళ్ల పట్ల మర్యాద తెలుసు. ఆకలెరిగిన వాళ్లకు అడుక్కొచ్చి అన్నం పెట్టడం తెలుసు. దొరలకు సవాల్ విసరడం కూడా తెలుసు. మనోని బ్బరానికి ఆమే చిరునామా! అటువంటి ఐలవ్వ 1895లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో కండ్లు తె రిచింది. మల్లమ్మ, సాయిలు దంపతుల ముద్దుబిడ్డ. దొరలు, పటేల్, పట్వారీలకు కనబడకుండా, భయం భయంగా, బిక్కుబిక్కుమంటూ బతుకాల్సిన దీనస్థితి. మాన, ప్రాణాలకు రక్షణ లేని రోజులు. చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గం కుదిరింది. ఐలవ్వకు ఐదుగురు మగోళ్లు, ఇద్దరు ఆడోళ్లు, పెద్ద కుటుంబం. పూట గడవడం కష్టంగా ఉండేది. బాంచన్ దొర అంటూ బట్టలుతికినా బతు కు గడవడం లేదు. ఏం చేయాలే.. భూమి కౌలుకు తీసుకో వాలే.. భూమి అంటే బువ్వ, ఓ ఆత్మ నిబ్బరం, కొండంత గుండె ధైర్యం. అందుకే భూమి కోసం మల్లంపల్లి దొర నాలు గు ఎకరాలు ఐలమ్మ కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నది. పాలకుర్తి పక్కన విస్నూరు దొర రాపాక రామచంద్రారెడ్డి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలోని పెద్ద దేశ్ముఖ్. 40 గ్రామాల్లో 40 వేల ఎకరాల ఆసామి. కంటికి నచ్చినదేది తప్పించుకుపోదు. గుర్రం వాహనంగా మనుషుల్ని వేటాడేవాడు. వాడొక నరరూప రాక్షసుడనే పేరు ఉండేది. దుర్మా ర్గాలకు అంతేలేదు.
భువ్వకు లేనోళ్లు భూమి గురించి ఆరాటపడటమా? అందునా సాకల్ది సాగు చేయడమా? అడుక్కొనేవాడు ఆత్మ గౌరవంతో జీవించడమా? తలవంచుకొని బతకాల్సిన వారు తల ఎత్తి బతకడమా! అది దొర ఆధిపత్యానికి అడ్డు రావ డమే అని గుండ్లురిమి మల్లంపల్లి మఖ్తేదారు నర్సింహారెడ్డిని పిలుపిం చుకొని ఐలమ్మకు కౌలుకిచ్చిన భూమిని తన పేర రాసుకొని క్షణాల మీద బదిలీ చేసుకున్నాడు. అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. పోలీసు అధికారులను పిలిపించి ఐలమ్మ భర్తను, కొడుకును జైలుపాలు చేశారు. ఆమె కూతురు పచ్చి బాలింతను వదలకుండా కరుడుగట్టి న దొరలు ఆమెపై లైంగికదాడి చేశా రు. బిడ్డ కాపురం కూలిపోయింది. బిడ్డకు ధైర్యం చెప్పింది. భర్త, కొడుకు జైల్లోనే ఉన్నారు. ఇదే సమయంలో ఆంధ్ర జనసభ, ఆంధ్ర మహాసభగా పరిణామం చెందింది. అందరికీ అక్ష రజ్ఞానం కోసం గ్రంథాలయోద్యమం ముందుకొచ్చింది. అప్పుడే సంఘం పుట్టింది. రహస్య సమావేశాలు జరు గుతున్నాయి. ఆ సమావేశాలలో భూ స్వాముల దుర్మార్గాలు, వెట్టి చాకిరి, అధిక పన్నులు, నిర్బంధ వసూళ్లు వంటి అనేక అంశాలపై చర్చలు జరి గేవి. ఆ క్రమంలోనే సంఘ సభ్యులు చైతన్యమవుతూ వచ్చారు. సహకార సంఘాలు ఏర్పడ్డాయి. తిరుగుబా టుకు సిద్ధమయ్యారు.
విస్నూరు దొర వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఐలమ్మ సంఘం చీటి తీసుకుంది. సంఘం ముచ్చట్లు అర్థం చేసుకుంది. ఆ సమావేశాలకు హాజరైంది. గ్రామ పరిస్థితులు ఎప్పటికప్పుడు సంఘం కార్యకర్తలకు అందజేసేది. కుటుంబ సభ్యులను సంఘంలో చేరడానికి ప్రోత్సహించింది. తన ఇంటిని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి వీరాధి వీరులకు అండగా నిలబడింది. కుటుంబం మొత్తం ఇంటి ఇంటికీ వెళ్లి బువ్వ అడుక్కొని వచ్చి సంఘం కార్యకర్తలకు పెట్టే ఆదర్శ అమ్మగా, పోరాట వెలుగుగా కుటుంబాన్నే పార్టీ పరం చేసిన తల్లిగా ఆ రోజుల్లో నాయకులు కొనియాడారు. ఐలమ్మ నాలుగో కూతురు సోమనర్సమ్మ పైన లైంగికదాడి చేసి బయోత్పాతం సృష్టించినప్పుడు ఐలమ్మ తన కూతురును గడి దగ్గరకు తీసుకెళ్లి ఏడు దోసిళ్ల మన్ను బోసి ''ఒరే దొరా.. నీ గడీల గడ్డి మొలుస్తదిరా?'' అని శపించి తన కూతురుకు ధైర్యం చెప్పిన ధైర్యశాలి. అంతేకాదు, ఆమె తూటాల్లాంటి మాటలతో దొరను గడగడలాడించింది. ఆమెతోపాటు కమ్యూనిస్టు నాయకులపై పాలకుర్తి దొమ్మికేసు పెట్టించాడు. గూండాలతో ఇండ్లపై దాడులు చేయించారు. రోజురోజుకూ దొర ఆగడాలు మితిమీరుతున్నాయి. 1944 భువనగిరి ఆం ధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యానికి పటిష్ట పునా దులు పడ్డాయి. దొడ్డి కొమురయ్య మరణంతో పోరాటం అన్ని గ్రామా ల్లో ఉద్యమాలకు ఊపిరిపోసింది. పాలకుర్తి, విసునూరు, కడవెండి, కామారెడ్డి గూడెం, దేవరుప్పల గ్రా మాలన్నీ పోరాట కేంద్రాలుగా ఉడు కుతున్నాయి. ఐలవ్వపై ఆగడాలు పెరుగుతున్నాయి. కమ్యూనిస్టులు గ్రామాల్లో చిన్న చిన్న సభలు, స మావేశాలు ఏర్పాటు చేయడం, పా టలు పాడటం బుర్రకథలు, ఒగ్గు కథతో ఒక సాంస్కృతిక వాతావర ణానికి ఆటపాటలు ప్రజా చైతన్యా నికి తూటాలుగా వర్థిల్లుతున్నాయి.
పాలకుర్తిలో ఆంధ్రమహాసభ నాయకులు సభ ఏర్పాటు చేసి బు ర్ర కథ చెబుతుండగా విసునూరు దేశ్ముఖ్ గూండాలు, విస్కోన్ అలీ గుమస్తా అబ్బాసు అలీ, వృత్తాలం రామిరెడ్డి, వనమాల వెంకడు తది తరులు అడ్డుకోవడానికి ప్రయత్నిం చారు. ప్రజలు తిరగబడటంతో తప్పతాగిన గూండాలు పారిపోయి గడీలో తలదాచుకున్నారు. ఆ రాత్రికి రాత్రే దొర పోలీసులను పిలిపించి వనమాల వెంకడుపై హత్యాయత్నం చేసిండ్రనే నేరం మోపారు. పైగా రాత్రి పడుతుండగానే, నాయకులు లేని సమయాన ఐలవ్వ ఇంటికి నిప్పు పెట్టిండ్రు. ఒకవైపు మంటలు మండుతున్నాయి. గూండాలు ఇంట్లో జొరబడి యేదుం సద్దలు, పెసర్లు, నువ్వులు, బియ్యం ఎత్తుకుపోయిం డ్రు. ఇవన్నీ బండ్లల్లా గడీలకు తోలుకపోయిండ్రు. ఇల్లు ఖాళీ అయిపోయింది. కట్టుబట్టలతో తలదాచుకొనే జాగలేని పరిస్థితిలోనూ ఐలమ్మ లొంగలేదు. ప్రజల సహాయంతో కా లిన చోట తలా ఒక్క గుంజ, కట్టే, కమ్మతో గుడిసె వేసు కుంది. గుడిసెపై ఎర్రజెండా ఎగురవేసింది. ఐలమ్మ పొలం కోయడానికి వరి చేలోకి వెళ్లింది. అంతలో గూండాలు ఈ భూమి విస్నూరు దొరది, ఈ పంట దొరది అని బెదిరిం చారు. ఐలమ్మ పంట ఐలమ్మకు చెందాలి. ఈ వార్త పరిసర ప్రాంతాలకు అందింది. అందిందే తడవుగా వందలాది ప్రజలు పాలకుర్తి వచ్చి ఐలమ్మకు అండగా నిలబడ్డారు. చుట్టుపట్ల గ్రామాల నుంచి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ వలం టీర్లు దుండగులను తరిమి కొట్టారు. వరి కోసి, కొట్టి ధాన్యం మూటలు కట్టి వీపుల మీద మోస్తూ ఐలమ్మ ఇంటికి చేరు స్తండగా దారి మధ్యలోనే మరో కిరాతక దాడి ఎదురైంది. గూండాలచే నెరవేరలేదని తన దుర్మార్గం సాయుధ పోలీ సులచే సాధించాలని దేశ్ముఖ్ పోలీసులను ఎగదోశాడు. వీపుల మీద ధాన్యం మూటలు మోస్తున్న వారిలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, కాచం కృష్ణమూర్తి, చకిలం యాదగిరిరావు, నల్లా నర్సింహులు ఉన్నారు. వారిపై టార్చిలైట్ వేసి పకడో పకడో అని బిగ్గరగా కేకలు వేశాడు. అమీన్ సాబ్ అందిన వా రిని అందినట్టుగా అరెస్టు చేస్తున్నారు. అయినా ప్రజలు బ హునేర్పుగా ధాన్యాన్ని ఎక్కడికక్కడ తప్పించి, ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఇందుకు ప్రతి చర్యగానే భీంరెడ్డి, కృష్ణమూర్తి, చకి లం యాదిగిరిరావులపై మరో దొమ్మీ కేసు బనాయించి పా లకుర్తిలో ఒక గుహాలోకి తీసుకొనిపోయారు. విపరీతంగా కొట్టారు, ఒళ్లంతా హూనమైపోయింది. స్పృహతప్పిన కామ్రే డ్స్పై కారం చల్లుతూ నానా హింసలు పెట్టారు. 'అమాను షంగా కలంతో రాయలేని, నోటితో చెప్పలేని చిత్ర హింసలు పెట్టారు. తోటి సహచరుల అరెస్టు వార్త తెలుసుకొని విసు నూరుకు వస్తున్న ఆరుట్ల రామచంద్రారెడ్డిపై గూండాలు దాడి చేసి బట్టలు గుంజుకొని చింత బరిగెలతో చితకబాదా రు. చెట్లల్ల నుండి తప్పించుకున్న రామచంద్రారెడ్డి, రావి నా రాయణరెడ్డికి చెప్పి అన్ని వివరాలు డైరెక్టర్ జనరల్ అండ ర్సన్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. పాల కుర్తి సంఘటన మొత్తంగా సాయుధ పోరాటంలో అనేక కొ త్త ఎత్తుగడలకు, వ్యూహాలకు కారణమైంది. దీనికంతటికీ ఐలమ్మ రాజేసిన అగ్ని కణం 'భూపోరాటం''. 10 గ్రామాల్లో వేలాది ఎకరాల భూమి పంచింది. నాలుగు వేల అమరులు బలిదానం చేసిన సాయుధ రైతాంగ పోరాటంలో ఐలవ్వ అగ్గిరవ్వ.అయినా నీ ఘన చరిత్రకు దక్కాల్సిన గౌరవం దక్కలే దు. వీరులను కీర్తించే బదులు వక్రీకరిస్తున్నారు. తెలంగా ణకు ప్రతీకైన అవ్వ ప్రతిమకు ట్యాంకుబండ్పై స్థానమే లే దు. కిరీటం, స్వర్ణ భరణాలతో కలిగిన మహారాణి తెలంగాణ తల్లి ఎట్లా అవుతుంది. ఐలవ్వ అంటే తెలంగాణ తల్లి. భూ పోరాటానికి ప్రతి రూపం, వెట్టిచాకిరి తప్ప ఏం చేయాలో తెలియని జాతికి పోరాటాల వెలుగు. నీ మట్టి పరి మళాన్ని భావితారాలకు అందించాలి. నీ ఆశయాలు పంచు కోవాలి. అవ్వా! నువ్వు పరమపదించి 34 ఏండ్లైనా నీ పోరాటానికి 73 ఏండ్లు దాటినా దున్నే వాడికి భూమికి నోచని శోషిత వర్గాలకు నేటికీ నువ్వు ఒక కాంతి పుంజం. అవ్వా నువ్వు మల్లొక్కసారి ఈ గడ్డపై రావాలని ఉంది. నీవు కూల గొట్టిన గడీలు మళ్లీ మొలుస్తున్నవి. అవి 20 అంతస్తులుగా మారి మా గుడిసెల్ని కూలగొడుతున్నవి. భూ పోరాటానికి ఐలమ్మ అన్న పేరే ఒక స్ఫూర్తి మంత్రం. రైతాంగ సాయుధ పోరాటం తర్వాత భూ పోరాటాలకు ఇది విరామం. విరామం విరమణ కాదు. ఓటమి కాదు. రేపటి సమరానికి సన్నాహం. అమ్మా! నీవెప్పటికీ తరగని పోరు రత్నం.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343