Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడి పేరు అనంతోజు బ్రహ్మయ్య. ఆయన చరిత్ర ఆయన మాటల్లోనే...
''మా అయ్య అవ్వ సోమయ్య, కనకమ్మ. కమ్మరి కుటుంబం నాల్గురు అన్నదమ్ములం. మేమంతా కుల వృత్తి చేసేది. దొరల దగ్గర వెట్టి చేసేది. కుమ్మరోళ్లు గడికి నీళ్లు దెచ్చేది. కమ్మరి వడ్లోల్లం దొర ఎవుసం పనులన్నీ చేసేది. చాకలోల్లు గడి ఊడ్చి, కచేరీలు ఊడ్చి చానిపి చల్లాలే, మాదిగోళ్లు డప్పు కొట్టాలే. చెప్పులు, తొండాలు ముడ్వాలె. చాకలి మంగలోల్లు బండి తోలాలే, బండి ముందర ఉరకాలే. పడుసు అమ్మాయి కనపడితే పాపం. గంత కిరాతక రోజులు. గంత రోత రోజులు. పోలీసు పటేలు, పట్వారీల జులూం. దినాంతన్నులు, గుద్దులు. కచ్చేరి చావడి దగ్గర వంగబెట్టి వీపున బండలు. బండ కిందబడితే చింత బరిగెల దెబ్బలు. పండిన పంటంతా లేవీ, తావాను, నాగూ, నజరానాలనీ దోచుకునే వారు. బూడిద పట్టి, పెండ్లి పట్టీ, సమర్త పట్టీలు ఇలా దోపిడీకి అంతులేని రోజులవి. కమ్మరివాము దగ్గరకు పటేలు వచ్చి ''ఎందిరా! కమ్మరోడా ఊరందరికీ ఏమో కథలు చెబుతున్నా వంట, దొరకు ఎదురుగా కుచ్చుల చెప్పులు తొడుగుతావురా?'' అంటూ ఇయ్యరమయ్యర గొట్టిండు. చింత బరిగె దెబ్బ దెబ్బకు వాతలు పెయి మీద అట్టు తేలాయి. ఇంటికిపోయి వెన్న చుక్క రాసుకున్నా మంట తగ్గటంలేదు. అదే మంట, సంఘపోల్లకు చెప్పిన, సంఘం చీటీ తీసుకున్న, పది మందిని కూడాగట్టి సంఘం బెట్టిన .ఆరుట్ల రామచంద్రారెడ్డిని పిలుపించినాం. సంఘం ముచ్చట్లు చెప్పిండు. దొరోడి సంగతేట్లా చూడాల్నో నేర్పిండు. పాటలు నేర్చుకున్నం. ప్రజల్లో తెలివి తెచ్చినం. చకిలం యాదగిరిరావు వచ్చి ఆడవికి తీసుకుపోయి కర్రసాము, తప్పించుకునే పద్ధతి, వడిసెలు తిప్పడం, ఉదరబాంబులు వేయడం అన్నీ నేర్పిండు. బహ్మయ్యకు దండి గుండె అనేది యాదగిరి రావు. నాకు తెలవకుండానే మావాళ్లు పెండ్లి చేసిండ్రు. చిన్న వయస్సు, ఆమె పేరు లక్ష్మి. వాళ్ల ఊరు వొల్మిడి. ఇగ ఇంటి పట్టునే ఉండాలే అన్నట్టుగా చేశారు. కానీ నేనుండలే. తుపాకీ శిక్షణకుబోయిన. 10 రోజులు నేర్చుకున్న. గురి తప్పకుండా గుండు వేస్టుగాకుండా శిక్షణ పొందాను. ఇగ తుపాకులు సంపాదించు కోవాలి, ఎట్టా? పాలకుర్తి పోలీసు పటేలు, మాలి పటేలు ఇండ్లలోని తుపాకులు ఎత్తుకొచ్చినాం. దడిదెపల్లి, రేగుల, ఆవుశాపురం ఏరియాకు నన్ను దళ కమాండర్ను చేసిండ్రు. మా దళం 12 మంది. జోనల్ కమాండర్ యాదగిరి రావు ఉండేది. అవసరమైతే తుపాకులు పట్టేది, ఉపాన్యాసం చెప్పేది. పాటలు, బుర్ర కథలు, ఉయ్యాల పాటలు కర్రసాము, అన్ని పనులు మా దళం చేసేది. నేను దళంలో ఉన్నానని నాపై రజాకార్లు కోపం పెట్టుకొని మా ఇంటికి నిప్పు పెట్టిండ్రు. నా భార్యను పట్టుకపోవాలని చూసిండ్రు. అప్పుడు మా ఊరోళ్లు ఆమెకు గొల్ల ముసుగు వేయించి తప్పించిండ్రు. బ్రహ్మయ్య భార్య ఎక్కడ అంటూ గాలించినా ఎవ్వరూ చెప్పలేదు.
దళ కమాండర్ శిక్షణ పూర్తి అయ్యింది. ఆయుధాలు అతి జాగ్రత్తగా అవసరానికి తగ్గట్టు వాడాలి. మన ప్రాణం మీదికి వస్తే తప్పా ఆయుధం ఊపయోగించకూడదు. ఒకసారి దమ్మన్నపేట అడవిలో పండుకొని చారునీళ్లకని ఊళ్లకుపోయినం. చారు తాగనే లేదు. ఊళ్లోకి కమ్యూనిస్టులొచ్చారని రజాకార్లకు కబురందింది. మాకు కాపలా ఉన్న సెంట్రీ తానం చేస్తున్నడు. వెంటనే మాతోపాటు నల్ల నర్సింహులు దగ్గర 30 దెబ్బల రైఫిలుంది. నేను ఓ పక్కన నర్సింహులు ఓ పక్కన కాల్చుతున్నాం. రజాకార్లు కాల్చుతున్నరు. అప్పుడు నా పక్క నుంచే గోలి పోయింది. నల్ల నర్సిం హులుకు తాకింది. వెంటనే నర్సింహులు పడిపోయిండు. ఆ కామ్రేడ్ను ఎత్తుకొని కేశాపురం వచ్చినం. అక్కడి నుండి పసరమడ్ల దగ్గర సాయిరెడ్డి అనే డాక్టరు తీసుకొని పోయి కట్టు కట్టిండు. ఆ తర్వాత విజయవాడకు పంపినం. తిరిగి దళమంతా ఏకమైనం. గట్లా నల్ల నర్సింహుల్ని కాపాడింది మా దళం. ఆదాడిలో రజాకార్లు కూడా చనిపోయారు.
ఆనాడు కమ్యూనిస్టులు దొరికితే చాలు దొరలు, రజాకార్లు నానా హింసలు పెట్టేది. చివరికి ప్రాణాలు సైతం తీసేది. అందుకే అడవి, అజ్ఞాత జీవితం మాది. మేము వండుకున్న వంట తింటామనే గ్యాంరటీ ఉండకపోయేది. మేము దొరలిండ్ల మీద దాడులు చేసినప్పుడు రజాకార్ల వస్తువులు దొరికేవి. దొరికిన వస్తువులను నాయకులకు ఇచ్చేవాళ్లు. పైసా గానీ తుపాకులు గానీ ఏది దొరికినా వస్తువులు సీలు చేసి పైకమిటీకి పంపే వాళ్లం. ఏదైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించే వాళ్లు. క్రమ శిక్షణ మాకు మరో ఆయుధం. నేనొకరోజు మా ఇల్లు తగలబెట్టినప్పుడు బాధలో ఉన్నాను. అప్పుడు ''బ్రహ్మయ్య బాధపడొద్దు. రైఫిలుంది, తుపాకీ ఉంది, సంఘం ఉంది, కల్సిపోరితే రాజ్యముంది. మన రాజ్యంలో మనం ఇండ్లు కట్టుకుందాం'' అని మా నాయకుడు యాదగిరిరావు బరోసా ఇచ్చారు. నాపైన మా దళంపైనా మిలిటరీ సైన్యం ఎన్నో సార్లు దాడి చేసింది. నేను శత్రువు పట్ల అతి జాగ్రత్తగా ఉండేది. నా దళానికి ప్రమాదమొస్తే ముందే పసిగట్టి చెప్పేది. హోరాహోరి యుద్ధం చేసినాం. నా తుపాకీ గుండు ఒక్కటి కూడా వృథా కాకుండా కాల్చేది. నన్ను చంపాలని ఎంత ప్రయత్నించినా తుపాకీ తూటాలు తలకాయకు ఆనుకుని పోయాయి. నాకు తగలలేదు. గట్లా చావు నుండి తప్పించుకున్నా. ఒక రోజు కాట్రపల్లి దగ్గర మిలిటరీ దాడి చేసింది. అప్పుడు చాకలోల్లలాగా బట్టలుతికినట్టు నటించినా.. సాకలోల్లు సావు నుండి తప్పించిండ్రు. పెంబర్తి రైల్వే స్టేషన్పై దాడిలో నేను యాదగిరిరావుతో పాల్గొని పోలీస్ ఎస్సై దగ్గర నుండి రివాల్వరు, నాలుగు తుపాకులు తీసుకున్నం. కొంపెల్లి దొరల గడీ మీద పడ్డాం. అయిదు బర్మారు తుపాకులు తెచ్చినం. మాకవసరమైనవి ఉంచుకుని, మిగతావి పక్క దళానికి పంపేది. ఈలోపు బమ్మెర దొర దగ్గర మంచి జపాన్ రైఫిల్ ఉందని తెలిసింది. ఆ దొర కచ్చడం పక్క ఊరికి పోతున్నప్పుడు దారిగాచి పట్టుకున్నం. ఆ దొర వెంటనే నేను విస్నూరు దొర నుండి రక్షణ కొరకు తపాకీ కొన్నాను. అని చెప్పాడు. ఈ విషయం విసునూరి దొరకు తెలిసినా తుపాకీ దక్కనీయడు. ఆ తుపాకీ మాకియ్యండి అనగానే తుపాకీ అరువై బుల్లెట్లు ఇచ్చిండు. విస్నూరు దొర తెల్ల గుర్రం ఎక్కి తుపాకీ భూజాన వేసుకొని 200 మంది రజాకార్లు వెంట ఉండగా వాడు చేసే దుర్మార్గాలకు అంతులేదు. కడవెండిలో దొడ్డి మల్లయ్య కొడుకు మూగవాడు. ఆగయ్యను కాల్చి చంపి 200 ఇండ్లు తగులబెట్టాడు. దేవరుప్పలపై దాడి చేసి పది మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపాడు. కొందరు కొన ఊపిరితో ఉండగానే గడ్డివాములలో వేసి తగులబెట్టాడు. ధర్మాపురంలో దాడి చేసి ఠాను సొదరుడు సోమ్లాను ఇంకొక నలుగురిని పట్టుకొని వారి చేతనే కట్టెలు తెప్పించి చితి పేర్పించి మంటల్లో ఒకరి తర్వాత ఒకరిని వేసి కిరాతకంగా కాల్చిచంపాడు. కోలుకొండపై దాడి చేసి 18 మందిని కాల్చి చంపాడు. ఆ బాబుదొరను మా దళం చంపాలని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చివరికి జనగాం రైల్వేస్టేషన్లో కుక్క సావు చచ్చాడు.
కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళాలన్నీ కలిసినం. విన్నూరు దొర గడీకి బాంబులు పెట్టాలనుకున్నాం. అన్ని సిద్ధం చేసుకున్నం. తీరా అక్క డికి పోయే సరికి పెద్ద వర్షం వచ్చింది. అంతలో యూనియన్, మిలటరీ వచ్చింది. కేవలం ఆడాయి దెబ్బలు వేసి పరారైనం. గిట్లా హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల దురంతాలు మితిమీ రిపోయాయని 1948 సెప్టెంబర్ 7న నెహ్రూ ప్రభుత్వం 25 వేల సైన్యాన్ని పంపింది. భారత సైనికులు మొండ్రాయి చేరే వరకు 17 సెప్టెంబర్ 1948 సాయంత్రం 5 గంటలకు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడని తెలిసిది. ఇగ రజాకార్ల కేంద్రాలపై ప్రజలు దాడులు చేశారు. రెచ్చిపోయిన మిలిటరీ సైన్యం కనపడ్డ కమ్యూనిస్టుల మీద దాడులకు పూనుకుండ్రు. మా దళం సరెండర్ అయినాం. మమ్మల్ని అరెస్టు చేసి మొదట వరంగల్లు జైలు, ఆ తర్వాత ఖమ్మం, గుల్బర్గా జైలులో వేసిండ్రు. జైలులో నానా చిత్ర హింసలు పెట్టిండ్రు. జైలులో కూడా మా నాయకులు చదువులు చెప్పిండ్రు. రాజకీయ పాఠాలు, మంచి పాటలు నేర్పేది. షాబాయి బండ మీద ఇసుక పోసి దాంట్లో అక్షరాలు దిద్దేవారు. మామూలంగా ప్రతి మనిషికి అడిగే ధైర్యం వచ్చింది. తెలంగాణకు తెగువ నేర్పిన పోరాటం మాది. నాకు భూమి లేదు, మా ఆవిడ మెడకు గుంజ బంగారం లేదు. ఉంటానికి ఇల్లు లేదు. గీ గుడిసే ఉంది. ప్రజల కోసం కొట్లాడిన చరిత్రలో నేను కూడా ఉన్న. గీ తృప్తి చాలు. గిట్లనే చనిపోతా...''
అని చెప్పిన బ్రమ్మయ్య కడవరకూ గట్లనే బతికిండు. తాను నమ్మిన జెండా నీడలోనే అమరుడయ్యిండు. ప్రజల గుండెలో చరిత్రగా మిగిలిండు.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343