Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా దేశ ప్రజల దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న విప్లవ వీరులలో చంద్రశేఖర్ 'ఆజాద్' ఒకరు. చంద్రశేఖర్ ఆజాద్ 1906 జులై 23న మధ్యప్రదేశ్లోని అవీరాజ్పూర్ సంస్థానానికి చెందిన బావ్రా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పండిట్ సీతారాం తివారి, తల్లి జగారాణిదేవి. పండిట్ సీతారాంకు ఐదుగురు కుమారులు. ఆజాద్ అందరికంటే చిన్నవాడు. చిన్నప్పటి నుండి ఆజాద్ చదువు సంధ్యలకు బదులు విలువిద్య, తుపాకీతో కాల్చడం వంటివి నేర్చుకోవడంలోనే ఎక్కువ అభిరుచి కనబరిచేవాడు. ఆయన ప్రవర్తనకు తల్లి దండ్రులు విసుగెత్తిపోయి తాలుకా ఆఫీసులో నౌకరుగా కుదిర్చారు. ఆ పని ఇష్టం లేక ఆజాద్ బొంబాయి చేరుకొని ఓడలలో రంగులు వేసే పనికి కుదిరాడు. ఈ పనిలో క్రమక్రమంగా యాంత్రికమైన బొంబాయి జీవితానికి విసుగెత్తిపోయాడు. నౌకరీ మానివేసి బొంబాయి నుండి కాశీకి వెళ్లి సంస్కృతం నేర్చుకోవాలనుకున్నాడు. 1921లో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆజాద్ కాశీ సంస్కృత కాలేజీ వద్ద ధర్నా చేస్తూ అరెస్టు అయ్యాడు. ధర్నా చేసిన నేరానికి ఆయనపై కేసు నడిచింది. కోర్టు వారు బాలుడైన సత్యాగ్రహిని ఇలా అడిగాడు.
నీ పేరేమిటి?
ఆజాద్ : స్వాతంత్య్రం
తండ్రిపేరు?
ఆజాద్ : స్వేచ్ఛ!
ఇల్లు?
ఆజాద్ : చెరసాల!
ఈ జవాబులతో మండిపడిన మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. బాలుడైన చంద్రశేఖర్ తన పేరును ఆజాద్ (స్వాతంత్య్రం)గా సార్థకం చేసుకున్నాడు. 1922లో ఆజాద్ విప్లవ పార్టీ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుండి జీవితాంతం చెక్కు చెదరని ధైర్య సాహాసాలతో సాయుధ విప్లవ పథంలో ముందడుగు వేశాడు. తన ఎదుట నిలబడి ఉన్న చావును చూసి కూడా నవ్వ గలిగే, సవాల్ చేయగలిగేంతటి ధైర్యోత్సాహాలు కలిగిన యువకుడైనందువల్లే పార్టీ జరిపిన అన్ని యాక్షన్స్కు పంపబడ్డారు. 1925 ఆగస్టు 9న కాకోరి సంఘటన జరిగింది. కాకోరి వద్ద రైలు బండిని ఆపి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. ఈ సంఘటనకు సంబంధించి అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఆజాద్, కుందన్వాల్ తప్ప మిగతా అందరూ ఖైదు చేయబడ్డారు. అజ్ఞాత వాసంలో ఆయన ఎక్కువ కాలం ఝాన్సీ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో సాతార్ నది ఒడ్డున ఒక చిన్న కుటీరం వేసుకుని బ్రహ్మచారి సాదువు వేశంలో ఉన్నాడు. విద్య విషయంలో ఆయన వద్ద ఎలాంటి సర్టిఫికెట్స్ లేవు. హిందీలోనూ, సంస్కృతంలోనూ కొద్దిగానే చదువుకున్నాడు. అప్పుడు భారతదేశంలో సోషలిజం వంటి విషయాల గురించి కొన్ని పుస్తకాలుండేవి. కానీ ఆ పుస్తకాలను తను చదివి అర్థం చేసుకోలేడు. ఆయన ఎవరైనా ఒక కామ్రేడ్ చేత ఆంగ్ల పుస్తకాన్ని చదివించుకొని దానర్థం హిందిలో చెప్పించుకునేవాడు.
సోషలిస్టు సిద్ధాంతాలైన దోపిడీ నిర్మూలన, వర్గరహిత సమాజ స్థాపన చంద్రశేఖర్ను ముగ్దుల్ని చేశాయి. తాను సోషలిస్టునేనని చెప్పుకోవడానికి గర్వపడే వాడు. ఆయన సోషలిజం వైపు ఆకర్షించబడటానికి మరో కారణం కూడా ఉంది. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి జీవితంలో చాలా బాధలు అనుభవించాడు. చిన్నతనంలోనే తన చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే గిరిజనులు, రైతుల జీవితాలను చాలా గొప్పగా అధ్యయనం చేశాడు. కొంత కాలం బొంబాయిలో కార్మికుల మధ్య జీవించాడు. రైతుల, కార్మికుల రాజ్య స్థాపన గురించి చర్చ జరిగినప్పుడల్లా అందులో ఆజాద్ చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు. ''నేను బతికుండగా నా శరీరాన్ని ఎవరూ తాకలేరు'' అని అనేక సార్లు ఆయన చెప్పేవాడు. జరిగింది కూడా అంతే. 1931 ఫిబ్రవరి 28న అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్లో పోలీసులతో జరిగిన ఘర్షణలో చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 25 ఏండ్లే.
- ఎ.సత్యం
సెల్ : 9666497998