Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకే సంస్థ, ఒకే కుటుంబం, ఒకే విజన్ అంటూ సింగరేణి సంస్థ బోర్డుమీద ప్రతిచోటా రాసుకొని ప్రచారం చేసుకుంటున్న ది. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి ఆవి ర్భవించి 130 ఏండ్లు దాటుతుంది. నేడు దేశ వ్యాప్తంగా అనేక అవార్డులను సింగరేణి సాధిం చింది. ప్రతి సం||రం వందల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థగా పేరున్నది. దక్షినాసియా ఖండంలోనే నల్ల బంగారంతో తెల్లని వెలుగులు అందించటంలో పేరు ప్రతిష్టలు సాధించిన సంస్థగా సింగరేణి కాలరీస్ ముందున్నది.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మిక చట్టాలు, వేతన ఒప్పందాలు, కోర్టు తీర్పులు అమలుకు నోచుకోవటం లేదు. 1952 గనుల చట్టానికి వ్యతిరేకంగా పర్మినెంటు పనులున్న చోట కాంట్రాక్టు కార్మికులను వినియోగించి పనులు చేయిస్తున్నారు. నేడు 25 వేల మంది సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులుగా పనులు సాగిస్తున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ఓవర్ బర్డెన్ తొలగింపు (ఓబీ), కోల్ట్రాన్స్పోర్టు, అండర్ గ్రౌండ్ మైన్స్లో వివిధ రకాలైన పను లు, హాస్పటల్, ఆఫీసు సిబ్బంది, సెక్యూరిటి, సివిల్, సివిక్ తదితర పనులు, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం, బోనస్, వేతనాల చెల్లింపు చట్టం, ఇఎస్ఐ, సెలవులు తదితర చట్టపరమైన హక్కులు సహితం అమలు జరగటంలేదు. తమకు హక్కులు, సౌకర్యాలను అమలు చేయాలని కాంట్రాక్టు కార్మికులు సింగరేణిలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం అమలు చేసేందుకు పూనుకోవటంలేదు.
2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనీ, అలా చెల్లించకపోవటం అమనూషమనీ, శ్రమ దోపిడీకి నిదర్శనం అవుతుందని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఒకే సంస్థలో ఒకే రకమైన పనులు చేస్తున్న కార్మికుల మధ్య వేతనాల వ్యత్యాసం ఉండకూడదనీ, అందువల్ల సమాన వేతనాలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కార్మికులు స్వాతంత్య్రానికి ముందుగానే సాగించిన అనేక పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగంలోనే రాజ్యాంగ నిర్మాతలు సమాన పనికి సమాన వేతనాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆదేశాల ప్రకారంగా పార్లమెంటులో సమాన వేతనం చట్టం ప్రత్యేకంగా చేయబడినది. ఈ చట్టాలను ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలలో కూడా అమలు చేయించని ఫలితంగా కాంట్రాక్టు కార్మికులు అర్ధాకలితో బతకాల్సి వస్తున్నది. కార్మిక ఉద్యమాల ఫలితంగా 2016లో సుప్రీంకోర్టు మరోమారు సమానవేతనాలు అమలు చేయాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును ఎలాంటి శషభిషలు లేకుండా అమలు చేయాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు జడ్జిమెంటును అమలు చేయించే బాధ్యతను విస్మరించాయి. సింగరేణి 1వ కేటగిరిలో వున్న పర్మినెంటు కార్మికుడి రోజు వేతనం రూ.1100, అలవెన్సులతో కలిపి రూ.2500 వుండగా అదేపని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడి రోజు వేతనం రూ.370 ఉంది. ఒకే పని చేస్తున్న కార్మికుల వేతనాల మధ్య ఈ వ్యత్యాసం ఉండటం అమానుషమని సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇచ్చినా ప్రభుత్వం స్పందించటంలేదు.
ప్రభుత్వం ద్వంద్వ వైఖరి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులు ఉండబోరని, అందరినీ పర్మినెంటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండవసారి కూడా కేసీఆర్ వాగ్దానం అమలు కావడంలేదు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు 35 రోజులపాటు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో 2015 ఫిబ్రవరిలో జైపూర్ పవర్ ప్లాంటు వేదిక నుండి సింగరేణిలో జేబీసీసీఐ నిర్ణయించిన హెచ్పీసీ వేతనాలు జేబీసీసీఐ నిర్ణయించిన బోనస్ సౌకర్యాలు కాంట్రాక్టు కార్మికులకు అమలు చేస్తామని ప్రకటించారు. పర్మినెంటు చేస్తామన్న హామీకి కట్టుబడి వున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కానీ 2016లో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేనేలేరని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. ఊసరవెళ్లి కూడా ఇంత త్వరగా రంగులు మార్చదు.
సింగరేణిలో పర్మినెంటు కార్మికులు దిగిపోతే తమ వారసులకు ఉద్యోగం ఇస్తారు. వారసత్వ ఉద్యోగాలన్నింటినీ అమలు చేస్తామని సింగరేణి ఎన్నికల్లో కార్మికులకు హామీ ఇచ్చి తమ సంఘాన్ని గెలిపించుకున్నాడు. వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు వత్తిడి చేయటంతో హైకోర్టు తీర్పును సాకుగా చూపి అమలు చేయలేకపోతున్నట్టు చెప్పుకున్నాడు. వారసత్వ శ్రమ దోపిడీని యథేచ్చగా సాగించటంలో ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు ప్రభుత్వం సహితం ముందుబాటలోనే వుందని సమానవేతనాల తీర్పు అమలును నిరాకరించటం ద్వారా స్పష్టం అవుతున్నది.
కాంట్రాక్టు కార్మికులు అంటరానివారా?
సింగరేణి కంపెనీలో కాంట్రాక్టు కార్మికులను అంటరాని వారిగా, రెండో తరగతికి చెందిన వారిగా యాజమాన్యం, ప్రభుత్వం భావిస్తున్నది. 1999లో 1 లక్షా 16 వేల మంది ఉద్యోగులు సంస్థలో వుండగా రూ.300 కోట్ల లాభం సంస్థకు వచ్చింది. ఇందులో 10 శాతం కార్మికులకు వాటాగా చెల్లించారు. 2017- 18లో 52 వేల మంది కార్మికులు కాగా రూ. 1212 కోట్ల వార్షిక లాభం సింగరేణికి వచ్చింది. పర్మినెంటు కార్మికులతోపాటు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కష్టపడితే ఈ లాభం వచ్చింది. ఓపెన్ కాస్టులో బొగ్గు తవ్వకాల నుండి భూగర్భ గనులలో పనుల దాకా కాంట్రాక్టు కార్మికులు చేస్తున్నారు. సింగరేణి లాభాలలో ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఎందుకు వాటా ఇవ్వరు. కనీసం స్వీటు ముక్క పెట్టడంలో కూడా వివక్షతను ప్రదర్శిస్తున్న యజమాన్య వైఖరిని ఏమనాలి. కార్మికుల కష్టార్జితంతో సింగరేణిలో నిర్మించిన క్వార్టర్స్ వేల సంఖ్యలో ఖాళీగావున్నా, శిథిలావస్థకు చేరి కూలిపోతున్నా కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వటంలేదు. సంస్థ సొమ్మును మట్టిపాలు చేయటం న్యాయమా?
- జె.సీతారామయ్య
jsriftu@gmail.com