Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో ప్రభుత్వం దేని ఆధారంగా పనిచేయాలి? మన రాజ్యాంగం ఆధారంగా పని చేయాలి. నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఓ సభలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం గొప్పదనం వల్లనే నేను ఓబీసీని కూడా ప్రధానిని అయ్యానని చెప్పారు. ఇది ఆహ్వానించదగిన విషయమే. గర్వించదగినది కూడా. కానీ ఆ తర్వాత కాలం లోనే ఆయన రాజ్యాంగ స్ఫూర్తి మరిచారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం లౌకిక రాజ్యం. లౌకిక అంటే మతప్రమేయం లేనిది. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో మతాన్ని వాడుతున్నారు. విదేశాల అధ్యక్షులు భారత్కు వచ్చినప్పుడు బహుమతిగా భగవద్గీత ఇచ్చారు. ఎందుకు? కేవలం హిందూమతమే భారతం కాదు. భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వం. కనుక బహుమతి ఇవ్వాలనుకుంటే భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలికదా?
రాజ్యాంగంలోని అధికరణ 51హెచ్ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశీలన స్ఫూర్తిని, మానవత్వాన్ని, సంస్కరణల పట్ల ప్రోత్సాహ వైఖరిని కలిగి ఉండాలి. ఇవి మన ప్రాథమిక విధులు. కాని నాయకులు చేస్తున్నదేమిటీ? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో మోడీ మాట్లాడుతూ పురాణాల కాలంలోనే ప్లాస్టిక్సర్జరీ ఉందని, అందుకనే వినాయకుడి తల మీద ఏనుగు తల ఉందని చెప్పారు. ఆధారాలేవి? ఇది ఎలా ఉందంటే మా ఊర్లో ఆవాలు గుమ్మడికాయంత ఉంటాయి తెలుసా? అన్నట్టుంది. ఒక వేళ అది నిజమైతే ఆహ్వానిద్దాం. కాని కేవలం హిందూ దేవతలు, పురాణాలను ప్రస్తావిస్తూ వారి భావ జాల వ్యాప్తికి ప్రయత్నిస్తే ఆహ్వానించవచ్చునా? ఇక త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ మాట్లాడుతూ.. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని, గోవామంత్రి మాట్లాడుతూ రైతులు పొలం వద్ద వేదాలు జపిస్తే మంచి దిగుబడి ఉంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి వర్సిటీల్లో పూజల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించే కోర్సుకు మద్దతు తెలపడం వంటి అశాస్త్రీయ భావనలు రేకిత్తించే పనిలో ఉన్నారు. బీజేపీ వారు అంబేద్కర్ పేరుతో కూడా రాజకీయం చేస్తున్నారు. అంబేద్కర్ తండ్రిపేరు రాంజీ. అయితే అంబేద్కర్ పేరులో రామ్ను చేరుస్తూ భీంరావు రాంజీ అంబేద్కర్గా మార్చారు. ఎందుకు రాముడు పేరుతో రాజకీయం చేయాలనే కదూ. వారు గమనించాల్సిన విషయమేమంటే రాముడు తండ్రి మాటకు కట్టుబడి సింహాసనాన్ని వదులుకున్నాడు. కానీ బీజేపీ వారు రామనామంతో సింహాసనం ఎక్కారు. కుర్చీ భద్రపరుచకున్నారు. ఓట్లను, సీట్లను పెంచుకున్నారు. ఇటువంటి అశాస్త్రీయ భావనలు కేవలం బీజేపీ మాత్రమే చేస్తుందనుకుంటే పొరపాటే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుత చండీయాగం చేశారు. చేస్తే ఒరిగిందమేటీ? టన్నుల కొలది నెయ్యి, పాలు వృథా అయ్యాయి. నేను వ్యక్తిగతంగా యాగం చేశానన్నాడు. కాని ముఖ్య మంత్రి కాబట్టి అధికార యంత్రాంగం కూడా అక్కడ ఉండాల్సిందే కదా. యథా రాజ తథా ప్రజా అనీ ముఖ్యమంత్రే యాగం చేస్తే ప్రజల పరిస్థితి ఏమిటీ? ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యం చేయాల్సిన డాక్టర్లు యాగం చేశారు. సీఎంను అనుసరించారు. దీనిని బట్టి అశాస్త్రీయ భావజాలం మన పాలకుల్లో చదువుకున్న డాక్టర్లలోనే ఇంత బలపడినప్పుడు ఇక సామాన్య ప్రజల్లో ఇంకెంత బలంగా ఉంటుందో అంచనా వేయోచ్చు.
ఇక నవ్యాంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఇటువంటి విషయాల్లో తక్కువేమీ కాదు. వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్మే సీఎంలలో మొదటివాడు చంద్రన్న. పూజలు, పునస్కారాలు, పుష్కరాలు ఇలా అన్నింటిలో ముందుంటాడు. నాడు చేపమందు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టేందుకు ప్రభుత్వ పరంగా మద్దతిచ్చాడు. బత్తిని సోదరుల వ్యక్తిగత చేపమందును ప్రభుత్వ మద్దతుతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. స్వయంగా తాను చేపమందు వేసుకున్నాడు. కాని చేపమందు నిజంగా శాస్త్రీయమైనదేనా? పుష్కరాలలో గంటసేపు దివ్యగడియలు, దివ్య దర్శనమంటూ ప్రజలను క్యూలో నిలబెట్టి ఒక్కసారి గేటు తీయడంతో సుమారు పదిమంది చావుకు కారకుడయ్యాడు. పాలకులు ఇటువంటి అశాస్త్రీయ భావ జాలాన్ని పెంచి పోషిస్తున్నారు? కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ''రాజు మూఢనమ్మకాలు నమ్మక పోయి నా.. ప్రజలను మాత్రం మూఢనమ్మ కాలలో ముంచెత్తాలి అన్నాడు.'' అదే వీరికీ ఆదర్శమైంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రాకూడదు. చైతన్యం వస్తే ప్రశ్నించే తత్వం ప్రారంభమవు తుంది. ఒకసారి ప్రశ్నించడం ఆరంభమైతే తమ కుర్చీకి ప్రమాదమని వీరికి బాగా తెలుసు. ఎందుకంటే సమాజ పురోగమనానికి తోడ్పడేది శాస్త్రీయ భావజాలం మాత్రమే. అభివృద్ధికి సహకారం అందించేది కూడా శాస్త్రీయతనే.
ఎప్పుడో రెండువేల ఏండ్ల కిందనే బుద్ధుడు ఈ మూఢ విశ్వాసాలను వ్యతిరేకించాడు. బుద్ధుడు ఏమన్నాడు? నేను గాని నా కంటే గొప్పవారు కాని ఏం చెప్పినా నమ్మొద్దు. మీకై మీరు పరిశీలించి, అవగాహన పెంపొందించుకుని అభిప్రాయానికి రావాలన్నాడు.
- అంబీర్ శ్రీకాంత్
సెల్ : 81859 68059