Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భారత పౌరుల మైన మేము'' అంటూ ప్రారంభమయ్యే భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులను, సదుపాయాలను కల్పించింది. మతం ఆధారంగా పౌరుల హక్కులను, సౌకర్యాలను నిరాకరించడాన్ని భారత రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. పైగా అల్ప సంఖ్యాక వర్గాల హక్కు ల రక్షణకు కొన్ని ప్రత్యేక రక్షణలను సైతం భారత రాజ్యాంగం కల్పించింది. అయినప్పటికీ అల్ప సంఖ్యాక వర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలు ఈ దేశంలో అనేక రంగాల్లో వెనుక బాటుతనాన్నే అనుభవిస్తున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని...
దేశంలో ముస్లింల విద్యా స్థాయి చాలా హీనంగా ఉంది. ముస్లింల అక్షరాస్యత రేటు 70శాతం, ఓబీసీల్లో (74శాతం) కన్నా తక్కువ. సాధారణ హిందువుల్లో (86 శాతం)కన్నా మరీ తక్కువగా ఉంది. అసలు పాఠశాలల ముఖమే చూడని జనాభాలో అత్యధికం గా ఎస్టీలు, ముస్లింలు ఉన్నారు. ఎస్టీల్లో 17 శాతం, ముస్లింలలో 16 శాతం మంది విద్యాసంస్థల ముఖమే చూడటం లేదు. ఇతర మత, సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లిం పురుషులు ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎనిమియా బాధితులు, ముస్లిం మహిళల్లో 62 శాతం ఉన్నారు. క్రిస్టియన్లలో 49.6శాతం మాత్రమే. ముస్లిం కుటుంబాలు 43 శాతం అద్దె ఇండ్లలోనే నివసిస్తున్నారు. ముస్లింలలో కేవలం 15.6శాతం మాత్రమే వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు. 40.6శాతం కుటుంబాలకు అసలు పొదుపు సొమ్ము లేదు. ఏ ఇతర సామాజిక, మతపరమైన వర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న సభ్యులున్న కుటుంబాలు 3.3 శాతం కాగా, ఒక్కరైనా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కుటుంబాలు తెలంగాణలో 2.4శాతం. 50శాతం ముస్లిం కుటుంబాల నెలసరి ఆదాయం రూ.10,000కు తక్కువే. అధిక కుటుంబాల నెలసరి వ్యయం 6 నుండి 10 రూ.వేల మధ్యే. ఉద్యోగాలలో ముస్లింల భాగస్వామ్యం 7.36శాతంగా చాలా తక్కువ.
పై అంశాలను గమనిస్తే, ముస్లింలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. ఆరోగ్య వసతులు వారికందకుండానే పోతున్నాయి. వారికి స్వంత ఇండ్లూ లేవు. పొలం, చెలకలు లేవు. ఇక రాజకీయ రంగంలో అన్ని పార్టీల్లోనూ మైనార్టీ విభాగాలున్నాయి, తప్పా ఎంపీ, ఎమ్మెల్యేలు అయ్యే నాయకులను వేళ్లమీద లెక్కించవచ్చు. ఇన్ని 'లేవు'ల మధ్య ముస్లింలు ఉండటం అనేది వారి వ్యథభరిత జీవితాలకు అద్దం పడుతోంది. ఈ పరిస్థితి ఈనాటిది కాదు. దేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుండే వీరి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు క్రమంగా దిగజారిపోతున్నాయి. అనేకానేక పరేషానీల మధ్య ముస్లింలు షర్వాణీలు ధరించి, ఈ దేశ ముఖ చిత్రంపై తళుక్కున మెరుస్తుంటారు.
కేవలం ఇవే కాదు, ముస్లింల ఆచార వ్యవహారా లు, కట్టుబాట్లు, చివరికి ఆహారపు అలవాట్లపై కూడా నిఘా నీడలు. అనేక అర్థ సత్యాలు, అబద్ధపు ప్రచారాలు. ముస్లింలను సనాతనులు అనే ముద్ర వేస్తున్నారు. అసమానతల నివారణల పేరిట పడక గదుల్లోకి నేరుగా పాలకులు చొచ్చుకొస్తున్నారు. అనుక్షణం ముస్లింలు తమ జాతీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితులను కొన్ని సంఘ విద్రోహక శక్తులు తెలివిగా తమకనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించడం మనం వింటూనే ఉన్నాం. పాలకులు సైతం ఎప్పుడూ బాబ్రీ మసీదు, ఆయోధ్య వివాదం, ధ్వంద పౌరసత్వం, కామన్ సివిల్కోడ్, కాశ్మీర్ వివాదం అంటూ ముస్లింలను భావోద్వేగాలకు గురి చేస్తూ ఓట్లను దండుకుంటున్నాయి. అసలీనాడు ఈపరిస్థితుల మధ్య జీవిస్తున్నామనే విషయమే అధిక సంఖ్యాక ముస్లింలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇతర మత సామాజిక వర్గాలు తమ హక్కుల కోసం సంఘటితమై ఉద్యమిస్తుంటే చూసి నేర్చుకో వాలనే సామాజిక స్పృహ కూడా వీరికి లేదు. ఇలాంటి విషయాలపై ముస్లింలకు అవగాహన కల్పించాలి. వారిని సంఘటితం చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ పరంగా వారికి దక్కాల్సిన వాటాపై వారు ఉద్యమించేలా తయారు చేయాలి. రాజ్యాంగ పరంగా వారికున్న హక్కులేమిటి?, దేశం పట్ల సమాజం పట్ల వారికున్న బాధ్యతలేమిటో తెలియపర్చాలి. అందుకు బలమైన సామాజిక సంస్థలు కావాలి. దురదృష్టవశాత్తు తెలుగునాట ముస్లింల కోసం పని చేసే ఇలాంటి సంఘాలు, సంస్థలు లేవు. ఉన్నా ఒకటి, అర సంఘాలు నామ్ కే వాస్తే గానే మిగిలి ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచనా పరులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చడానికి తమ ఆలోచనలు పంచుకోవాలి. అందుకు అనువుగా సామాజిక అధ్యయన వేదికలు నిర్మించాలి. అలా కదిలివచ్చే వారికి తమ వంతు ఆర్థిక, హార్థిక చేయూతనూ ఇవ్వాలి.
సయ్యద్ ఖుర్షీద్
సెల్ : 9989511786