Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వన్యప్రాణి అంటే మనుషులతో స్నేహంగా కలిసి జీవించలేని, మచ్చిక చేసుకోలేని జంతువులు. ఏ జంతువులైతే సమాజంలో మనుషులతో ఇమడలేక, మనకు దూరంగా అడవులలో, పెద్దపెద్ద పొదలలో నివాసాన్ని ఏర్పరచుకుంటాయో వాటిని వన్య ప్రాణులు అంటారు. అడవులు అంత రించడం వల్ల వన్యప్రాణులకు తీవ్ర ముప్పు వాటిల్లు తోంది. వన్యప్రాణుల సంరక్షణకు అనేక సంస్థలు వెలిశాయి. వన్యప్రాణుల సంరక్షణ రెండు దశలలో చేస్తారు. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడడం, రెండవది జీవవైవిధ్యాన్ని సంరక్షించడం. ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. మన దేశంలో పులులు, ఏనుగులు మొదలైన వన్యమగాలు గణనీయంగా తగ్గుతున్నాయి. అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి వన్య ప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ఉదాహరణకు భారతదేశం పులి, ఆస్ట్రేలియా కంగారు లాంటి వాటిని ప్రకటించి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడవలసిన నైతిక బాధ్యత మానవునిదే. కానీ మానవుని తీవ్ర అత్యాశ వలన రోజురోజుకి అడవుల వైశాల్యం క్రమేణా తగ్గుతూ వస్తుంది. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన వన్య ప్రాణులకు నిలువ నీడ లేక జనారణ్యంలో ఇమడలేక అవి క్రమేణా అంతర్థానమవుతున్నాయి. కొన్ని నగిషీలు, కళాకృతుల కోసం దంతాలు, మాంసం కోసం, లైంగిక ఔషధాల కోసం వాటిని సంహరించడం, అడవుల నరికివేత, అడవులలో మంటలు, పర్యావరణ కాలుష్యం ఇలాంటి కారణాల వల్ల చాలా జాతులు అంతరించిపోతున్నాయి. సగటున రోజుకు ఒక జాతి అంతరిస్తోంది. ఇలా అంతరించి పోయే వాటిలో మనదేశంలో చిరుతపులులు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న అనాలోచిత వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరిం చిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు పర్చాలని, జంతు బలులు నిషేధించాలని కోరుతున్నారు. వరల్డ్ ఎనిమల్ డే యాక్డు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి, వాటికి ఎటువంటి అసౌకర్యం, బాధ కలిగించొద్దు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. జంతువులను క్రూరమైన హింస, యాతనలకు గురి చేయరాదు. వర్షం, చలి, ఎండల నుండి కాపాడాలి. పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. కానీ, భారతదేశంలో జనాభా విస్ఫోటనం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. ఒకపుడు దాదాపు 35శాతంగా ఉన్న అడవులు నేడు 21శాతానికి పడిపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే జీవ, వక్ష సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని, 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చింది. వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్), గ్లోబల్ వార్మింగ్ను నివారించడానికి అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. పెరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిన అటవీప్రాంతాలు రానురాను కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతుంది. జింకలు, ఏనుగులు, దుప్పిలు, అడవిపందులు, కుందేళ్లు, నెమళ్లు, కొండ గొర్రెలు, పులులు తదితర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్ పెరగడంతో వాటిని అధిక ధరలకు అమ్ముతున్నారు. పక్షులను కూడా వేటాడుతున్నారు. మన దేశానికి వచ్చే వలస పక్షులను, అరుదైన జాతి పిట్టలను చంపి సమీపంలో గల అంగళ్లు, సంతలలో అమ్ముతున్నారు. వీటిని అరికట్టే వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొందరు మామూళ్ల మత్తులో మునిగి ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగువస్థాయి సిబ్బంది వేటగాళ్లతో కుమ్మక్కై వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. మరి కొన్ని ప్రాంతాలలో వేటగాళ్లతో కుమ్మకై మాంసంను పట్టణాలకు తరలిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో దట్టమైన అడవులు గల జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలలో విస్తరించి వున్న శేషాచలం అటవీప్రాంతం కూడా క్రమంగా అంతరించిపోతోంది. దీంతో ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన జంతువులు కనుమరుగైపోతున్నాయి. భారత బొటానికల్ సర్వే ప్రకారం దేశంలో మొత్తం 46వేలకు పైగా వక్షజాతులు ఉన్నాయి. కానీ, ఇటీవల అడవుల విధ్వంసం వల్ల అందులో అనేక వక్షజాతులు అంతరించి పోతున్నాయి. భారత జూలాజికల్ సర్వే ప్రకారం దేశంలో మొత్తం 89వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. వన్యప్రాణుల చట్టాలను కఠినంగా అమలు చేస్తూ అడవులను సంరక్షించుదాం. భావితరాలకు వీని గురించి తెలుపుదాం. జీవజాతుల సంరక్షణకు పాటుపడదాం. ప్రభుత్వాలు కూడా జంతుజాలాన్ని అడవులను కాపాడే చర్యలు చేపట్టాలి. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అరుదైన జంతువులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- కాళంరాజు వేణుగోపాల్
సెల్ : 8106204412