Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మ జన్మనిస్తే డాక్టర్ పున:ర్జన్మనిస్తాడని' నానుడి. కనీ నేడు వైద్యులపైనా, దవాఖానాలపైనా ప్రజలు రోజురోజుకూ నమ్మకం కోల్పోతున్నారు. కారణం వైద్యులు వ్యాపారస్తులుగా మారిపోవటం, వైద్యాన్ని వ్యాపారంగా మార్చివే యటం. వైద్యులను తయారుచేసే విద్యావిధానం లోనూ మానవీయత లేకపోవడం విచారకరం. ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే కనీస బాధ్యత ప్రభుత్వాలకూ లేకపోవడంతో వైద్యరంగం లోకి ప్రైవేటు పెట్టుబడులు ప్రవేశించాయి. మనిషి ప్రాణాన్ని వ్యాపార వస్తువుగా మార్చేశారు. నిత్యావసర మౌలిక రంగాలను ప్రైవేటుపరం చేయించడం ద్వారా మన ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల జోక్యాన్ని పెంచి ప్రైవేటురంగాన్ని విరివిగా పెంచి మానవ విలువలను ధ్వంసంచేసి ప్రజా ఆరోగ్యాన్ని గాలిలో దీపంలా చేసాయి. ప్రైవేటు దవాఖానాలకు వచ్చే రోగిని ఆధారంగా చేసుకొని బంధువుల నుంచి డబ్బును చెరుకుగడ పిండినట్టుగా పిండడమే ప్రధాన ధ్యేయం అయింది. కొన్నికొన్సి సందర్భాలలో మానవ విలువలు విచక్షణా జ్ఞానం కోల్పోతున్న డాక్టర్లు రోగిని స్ట్రెక్టర్పైనే పెట్టి మెయిన్గేటు దగ్గరే లావాదేవీలు నడుపుతున్నారు. రోగికి వైద్యఖర్చులు ప్రభుత్వ రీయింబర్స్మెంట్ ఉందని తెలిస్తే హాస్పిటల్ యాజమాన్యం వేసే బిల్లుకు ఆకాశమే హద్దు.
రోగికి వైద్యుడికి మధ్య స్నేహపూరిత సంబంధాలు, మానవీయ విలువలు ఉండాల్సిన స్థానంలో వ్యాపారధోరణి ప్రవేశించడంతో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. దీంతో వైద్యం వెర్రితలలు వేస్తున్న ఉదంతాలు కోకొల్లలు. గతంలో నిఖిల్రెడ్డి మోకాళ్ల కింద ఎముకలకు ఆపరేషన్ ఉదంతం చూశాము. అలాగే కరీంనగర్ జిల్లాకేంద్రంలో వైద్యుల ఘనకార్యం ఒకటి బయటపడింది. కడుపునొప్పి సమస్యతో దవాఖానాలకు పోయిన వేలాదిమంది అమాయక మహిళలకు వైద్యులు ముందూ వెనకా ఆలోచించకుండా ఏకంగా గర్భసంచులు తొలగించారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసి రచ్చవడంతో చట్టం రంగప్రవేశం చేసింది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహించటంతో రోగుల ఆయుష్షు తగిరిపోవడంతోపాటు ఆస్తులు కూడా కరిగిపోతున్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే హక్కు కల్పించినప్పటికీ, పౌరుడి జీవనానికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. కాదని రాజ్యాంగాన్ని అమలు పరిచే పాలకులు బహిరంగంగానే అంటున్నారు. 2015లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానాన్ని ఇప్పటికీ పార్లమెంటులో కనీసం చర్చకు పెట్టలేదు. ఈ తంతు చూసి ప్రైవేటు దవాఖానాలు ధనదాహానికి ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానాలు పడగవిప్పి ఇష్టారీతిన బిల్లులు దండుకుంటూ బడుగుజీవుల రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేతివాటానికి అలవాటుపడి చేతులెత్తేస్తోంది. వేసారిన బడుగుజీవుల కుటుంబాలు ఆర్ధికంగా కుంగిపోయి అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా గతి తప్పి కార్పొరేట్ దవాఖానాలకు దోచిపెట్టే వనరుగా మారింది. కానీ దీనిపై ఇంతవరకు ప్రభుత్వ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎన్నో ప్రైవేటు దవాఖానాలకు అనుమతి లేదన్న సత్యం సగటుజీవిని ఆశ్చర్యానికి గురిచేయక మానదు.
రాష్ట్రంలో డీఎంహెచ్వో రూల్స్ ప్రకారం అనుమతులు పొందిన దవాఖానాలు దాదాపు 6,200 పైచిలుకు ఉన్నాయి. డయాగస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, ఈఎన్టీ, డెంటల్ లాంటి ప్రత్యేక విభాగాలకు చెందిన దవాఖానాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్లోనే 1183 ఉండగా రంగారెడ్డి జిల్లాలో 1072 ఉన్నాయి. అయితే ఈరెండు జిల్లాల్లో డీఎంహెచ్వో అనుమతితో నడుస్తున్న వాటిలో ఎక్కువగా ప్రైవేటు దవాఖానాలే ఉన్నాయి. ఇక అనుమతి లేకుండా ప్రైవేటు దవాఖానాలు, క్లినిక్లు వేలల్లో నడుస్తున్నాయన్నది నగ్నసత్యం. ఈ దవాఖానాలు రోగులను, వారి సంబంధీకులను పురుగులకంటే హీనంగా చూడటం, వైద్యం సరిగ్గా అందించక నిర్లక్ష్యం వహించడం, పరిశుభ్రత పాటించకపోవడం ఇలా ఎన్నో రకాలుగా నిబంధనలకు విరుద్ధంగా నడిచే దవాఖానాల సంఖ్య రాష్ట్రంలో అధికంగా ఉన్నది. ప్రైవేటు దవాఖానాలు కనీసం 26 ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. కానీ వాటిని పూర్తిగా గాలికొదిలేసాయి. బయో మెడికల్ వెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పై ఎగ్జిట్ లేకపోవడం, పర్మిషన్ ఇచ్చిన బెడ్స్ కంటే ఎక్కువగా బెడ్స్ వాడడం, పేషెంట్, సిస్టర్స్ (నర్స్) నిష్పత్తి సరిగ్గా లేకపోవడం ఇలా అనేక అతిక్రమణలు, 150 మంది పేషెంట్లకు 72 మంది నర్సులు ఉండాలి. దవాఖానా ఉన్న బిల్డింగుకు అనుమతికూడా ఉండాలి. దవాఖానాకు సంబంధించిన ఫార్మసిలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలి. పార్కింగ్ లేకుండా దవాఖానా నిర్వహించకూడదు. ఇక సెల్లార్ స్థలంలో క్లినిక్ ల్యాబ్లు, మెస్లు లాంటి వాటికి అనుమతులు లేవు. పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయకూడదు. సెక్షన్ రూల్స్ 9(ఎ) ప్రకారం డీఎంహెచ్వో పర్మిషన్ తీసుకోనప్పుడు నిర్దేశించిన ధరలనే దవాఖానాల్లో డిస్ప్లే చేసి అవే ధరలను పేషెంట్ల నుంచి తీసుకోవాలి. కనీస అర్హత లేని సిబ్బందిని నియమించకూడదు. ఇలా ఎన్నో నిబంధనలున్నా వాటిని కనీసం పాటించకుండా ప్రైవేటు దవాఖానాలు ధనదాహం తీర్చుకుంటున్నాయి. గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ లతో కుమ్మక్కై ప్రైవేటు దవాఖానాలు పేషెంట్లు వచ్చేలా చేసుకుంటూ దండుకున్న ఫీజులో కొంత శాతం ఆర్ఎంపీకి కమిషన్ రూపంలో ఇస్తున్నారు. ఇక స్పెషలిస్టులున్నారని చెప్పి కేవలం జూనియర్లతో ట్రీట్మెంట్ ఇప్పించడం, వ్యాధి వివరాలను తెలపకపోవడం, అవసరం ఉన్నా లేకపోయినా క్లినికల్ టెస్టు రూపాల్లో వేలాది రూపాయలు దోచుకుంటున్న ప్రైవేటు దవాఖానాల లీలలు... వీటిని అదుపు చేయాల్సిన ప్రభుత్వం నిదురపోతోంటే మేల్కొల్పాల్సిన బాధ్యత పౌర సమాజానిదే.
- మన్నారం నాగరాజు
సెల్ : 95508 44433