Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరాచకానికి ఆకాశమే హద్దయినప్పుడు
నిప్పుల వానేదో పోరు విత్తనాలకు ప్రాణం పోస్తుంది
అప్పుడు ఆ అన్యాయాన్ని సహిస్తున్న గడ్డపై
ఓ సామాన్యుడి సంకల్పమే పెత్తనంపై నిలువెత్తు ధిక్కారమవుతుంది
అవి నిజాం రాచరిక పాలన రోజులు. కంటిముందు కనబడుతున్నదల్లా అన్యాయమే. చెవుల్లో మారుమోగేది అభాగ్యుల ఆర్తనాదమే. ప్రపంచానికి పగలు తర్వాతే రాత్రి. భూస్వాముల పాదల కింద నలుగుతున్న బాధితులకు మాత్రం బతుకంతా కటిక చీకటే. అప్పుడు స్వేచ్ఛ కోసం పరితపించే పీడితుల గుండెకో ధైర్యం కావాలి. అన్యాయాన్ని ప్రశ్నించే ఆరాటానికి ఓ తెగింపు కావాలి. ఆ తెగింపే జమలాపురం కేశవరావు.
1908 సెప్టెంబర్ 3న నాటి వరంగల్ నేటి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో వెంకట రామారావు, వెంకట నరసమ్మ దంపతులకు పుట్టాడు. చిన్ననాటి విద్యాభ్యాసం స్వగ్రామంలోనే కొనసాగింది. ఖమ్మం పట్టణంలో పై చదువులు చదివాడు. వంద ఎకరాలుగల జమిందారు కుటుంబంలో జన్మించినా చిన్ననాటి నుండే రైతులన్నా, పంట పొలాలన్నా చాలా ఇష్టం. పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పేదలకు సహాయం చేయడం చిన్ననాటి నుండి అబ్బింది. చదువుల్లో చురుకుదనాన్ని, అర్థంకాని విషయంపై ప్రశ్నించే తత్వాన్ని చూసి ఉపాధ్యాయులే మెచ్చుకునేవారు. కేశవరావు ఎంత ధైర్యవంతుడో అంత వినయం కలవాడు. ఒకసారి వారి గ్రామంలో ఒక నిండు గర్భిణి చనిపోతే ఆ సంఘటనను అరిష్టంగా భావించి కుటుంబ సభ్యులతో సహా ఎవరూ ఆ శవ దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. ఆ సన్నివేశాన్ని చూసి చలించిన కేశవరావు తానే స్వయంగా ఆ యువతి శవాన్ని భుజాన మోసుకొని శ్మశానవాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయించి గ్రామస్తుల మూఢ నమ్మకాన్ని పటాపంచలు చేశాడు. ఆ సంఘటన చూసిన ప్రజలకు అతడి పట్ల ప్రేమ, గౌరవం ఏర్పడి పెద్దలు సైతం నమస్కరించే సంస్కారం పెంపొందింది. పదవ ఏటనే కేశవరావు తల్లి చనిపోయింది. అయినా తన దు:ఖాన్ని ఎక్కడా బయట పెట్టకుండా గంభీరంగా కన్పించేవాడు. తండ్రిపై ఎనలేని గౌరవం. కొడుకంటే కూడా తండ్రికి అమితమైన వాత్సల్యం. చిన్నతనంలోనే కేశవరావుకు అన్నపూర్ణమ్మతో పెండ్లి అయ్యింది. ఆమె వినయానికి, సౌశీల్యానికి మారుపేరు. ఉన్నత చదువులకు వెళ్లమని ప్రోత్సహించింది.
కాలేజీ విద్యాభ్యాసం ఆయన ఆలోచనా పరిధిని, తనలోని దేశభక్తిని మరింత పదునెక్కించింది. ప్రగతిశీల భావజాలం అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం, ఉద్యమించే మనస్తత్వం స్థిరపడటానికి నిజాం కాలేజీ మార్గదర్శనం చేసింది. వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజులు. నిజాం ప్రభుత్వం వందేమాతర గీతాన్ని పాడకూడదని నిషేధించింది. అయినా నిషేధించడానికి వాడెవ్వడు అంటూ తరగతి గదులను బహిష్కరింపజేసి కళాశాల మైదానంలో సమావేశాలు ఏర్పాటు చేశాడు. విద్యార్థులతో కేశవరావు వందేమాతరం గీతాన్ని పాడించాడు. అంతేకాదు నిషేధాన్ని ఎత్తి వేయాలని గర్జించాడు. పోలీసులు అరెస్టు చేశారు. చదువుకో కుండా కొడుకు వేరే దారిలోకెళ్తున్నాడని తండ్రి మరఠ్వాడలోని కడకత్లో ఉన్న కరోడిల్ శాఖలో ఉద్యోగంలో చేర్చారు. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ జిల్లా అవ్వల్ తాలూక్దార్ కార్యాలయంలో చేరాడు. 1936లో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకాడు. మాడపాటి హనుమంతరావుతో కలిసి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా గాంధీజీని కలుసుకున్నాడు. 1946లో గాంధీజీ ఖమ్మం పర్యటన కేశవరావు సారథ్యంలోనే జరిగింది. స్వామి రామానంద తీర్థ, గోవిందరావు నానక్, రామ్ కిషన్ దూత్, రావి నారాయణరెడ్డి, జనార్దనరావు దేశారు, శ్రీనివాసరావు బోరేకర్లతో కలిసి తెలంగాణలో స్టేట్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ను నిషేధించింది.
1938 అక్టోబర్ 24న మధిరలో సత్యాగ్రహా దీక్షలో కేశవరావు పాల్గొన్నాడు. దీక్షకు అనుమతి లేదు. సర్దార్ ఎ క్కడ నుంచి వస్తాడని ప్రజల ఉత్కంఠ. పోలీసులు చుట్టు మోహరించారు. అయినా పోలీసులకు చిక్కకుండా సినీ ఫక్కీలో ఒక రైతు వేశంలో వచ్చాడు. ''ఇంక్వీలాబ్ జిందాబాద్, భారత్మాతా కి జై'' అంటూ నినదించాడు. దీంతో నిజాం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 14 నెలలు జైలులో బంధించారు. జైలు నుండి విడుదలైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో కాలికి చెప్పుల్లేకుండా పర్యటించాడు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉదృతం చేశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఒకసారి ఇల్లెందులో యువజన కాంగ్రెస్ సమావేశాలకు పోలీసులు అనుమతించకపోతే, వారి ప్రవర్తనను నిరసిస్తూ జెండా కర్రతో పోలీసులకు ఎదురొడ్డి సవాలు విసిరాడు. సభకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇవ్వకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, దానికి పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన పోలీసు అధికారి తన తుపాకీని కేశవరావుకు గురిపెట్టి కాలుస్తానని బెదిరించాడు. ఆ అధికారి దౌర్జన్యాన్ని లెక్కచేయకుండా చావుకైనా సిద్ధమంటూ తుపాకీ తూటాకు ఎదురుగా తన గుండెను నిలిపిన ధీశాలి కేశవరావు. ఆ తెగింపుకు ప్రజలు అభిమానంతో ఇచ్చిన బిరుదు ''సర్దార్''. అప్పటి నుంచి కేశవరావు సర్దార్ జమలాపురం కేశవరావు అయ్యాడు. 1946 మే నెలలో నాటి మెదక్ జిల్లా కంది గ్రామం లో కేశవరావు అధ్యక్షతన నిజా మాంధ్ర 13వ మహాసభలు జరిగాయి. ఆ సభలో నిజాం ప్రభుత్వం చేపట్టిన బూటకపు సంస్కరణలను తీవ్ర పదజాలంతో ఖండించాడు. వారి అవిశ్రాంత కృషి వల్ల ఆ బూటకపు సంస్కరణలు వెనక్కు తీసుకుంది. కేశవరావు అధ్యక్షతన స్వాతంత్య్రోద్యమంలో ఒక స్పష్టమైన ఉద్యమ స్వరూపం తీసుకుంది. వేలాదిగా యువకులు, విద్యావంతులు వీరి నాయకత్వంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. గ్రామ సంఘాలు, తాలూకాసం ఘాలు ఏర్పాటు చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బుర్రక థలు, హరికథలు, నాటక, దళాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నెలకొల్పారు. వయోజన విద్యా పాఠశాలలు వితంతువుల పెండ్లిలు జరిపారు. అతడి ఉపన్యాసం వినడానికి సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు.
స్వాతంత్య్ర కాంక్షతో సరిపెట్టక హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని, నిజాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1947 ఆగస్టు 7న సత్యాగ్రహం చేశాడు. దీంతో నిజాం ప్రభుత్వం 18నెలలు జైలులో పెట్టింది. జైలులోనూ తోటి ఖైదీలకు సమాజంలోని విషయాల పట్ల అవగాహన కలిగించి జాగృత పరిచాడు. జైలులో పోలీసు అధికారులకు, ఖైదీలకు మధ్య జరిగిన గొడవలను సామరస్య పూర్వకంగా పరిష్కరించేవాడు. వరంగల్ నుండి నిజామాబాద్ జైలుకు తరలించే సందర్భంలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడం పోలీసులకు సాధ్యం కాకపోతే కేశవరావే స్వయంగా వచ్చి ప్రజలను శాంతింపజేశారు. దళితుల అభ్యున్నతికి, ఆదివాసుల సమస్యలపై ఫారెస్టు అధికారుల దోపిడీ, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. భారత సైన్యం వచ్చి కమ్యూనిస్టులను ఊచకోత కోస్తుంటే, వేలాది మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చుతుంటే ఇది తప్పు అని ఖండించాడు. ఢిల్లీకి వెళ్లి అప్పటి హోంమంత్రి పటేల్కు వినతిపత్రం సమర్పించాడు. కేశవరావు సంస్కర్త, మానవతావాది. తన ఆచరణలో కులమతాలను వ్యతిరేకించాడు. పదవుల కోసం పాకులాడలేదు. ప్రచార ఆర్బాటాలకు దూరంగా ఉన్నాడు. నెహ్రూ చేత స్వయంగా హైదరాబాద్ సంస్థానం నుండి భారత పార్లమెంట్కు నామినేట్ చేయబడ్డాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం పాలన అంతం కాలేదు. అప్పటికీ కేశవరావు జైల్లోనే ఉన్నాడు. జైలు నుండి వచ్చిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల కోసం వారి హక్కుల కోసం ఆరాటపడ్డాడు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం కొనసాగించిన రోజులలో కేశవరావు వారితో కల్సి మాట్లాడేవాడు. 1952 ఎన్నికల్లో పాకాల నుండి పోటీ చేసి ఓడిపోయాడు. గెలుపు ఓటములను సమదృష్టితోనే చూసేవాడు. ఎక్కువకాలం జైల్లో, అడవుల్లో ఉండటం వల్ల ఆరోగ్యం చెడిపోయింది. అవసాన దశలో కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. కుమారుడు జబ్బు పడ్డారని తెలుసుకున్న తండ్రి వెంకటరామారావు కొడుకు ఆరోగ్య స్థితి చూసి కుమిలిపోయాడు. కడసారి తండ్రిని చూసిన కేశవరావు 1953 మార్చి 29న తన 46వ ఏట శాశ్వతంగా వెళ్లిపోయాడు. దేశం కోసం సర్వస్వం అర్పించిన సర్దార్ జమలాపురం కేశవరావుపై కాళోజీ కవిత అతని వ్యక్తిత్వానికి ఓ మచ్చు తునక. ''మొండి చేతుల అంగి... మోకాళ్లు దాటిన మొలగుడ్డతో తిరుగు కేశన్న, పల్లెబాటల బాధ ప్రజలతోపాటు నీ అరికాళ్లకే బాగ గురుతన్నా. మచ్చలేని మనసు, జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు నీదన్న, సర్దార్ నామంబు సహజ నామంబుగా సరిపోయినది నీకు కేశన్న'' అంటారు కాళోజీ. శత్రువు సైతం 'ఏమిటి రా నీ ధైర్యం' అంటే 'నేనే నా ధైర్యం' అన్న ఆ ధీశాలి జీవితం చరితార్థం.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343