Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివాసీల సమస్యల పరిష్కా రం కోసం నియమించిన అనేక కమిటీలు నివేదికలు సమర్పిస్తున్నాయే గానీ, వాటి సిఫార్సులను ఆచరణలోకి తీసుకొచ్చి, ఆ అభాగ్యుల కష్టాలు తీర్చే ప్రభుత్వాలే లేవు. అటవీ ప్రాంతంపై ఆదివాసీలకు మాత్రమే హక్కులు కల్పించే భూ బదలాయింపు నిషేధ చట్టం 1/10, గ్రామ సభలకు విశేష పాలనాధికారాలు కట్టబెట్టిన (పంచాయితీ రాజ్-షెడ్యూల్ ఏరియా విస్తరణ చట్టం (పీసా) (1996), వడ్డీ వ్యాపార నిషేధ చట్టం, అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఎక్సైజ్ చట్టం, సాగు భూమిపై హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన అటవీహక్కుల గుర్తింపు చట్టం (ఎఫ్ఆర్ఏ) (2006) వంటి రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులను పాలకులు నిర్దాక్షిణ్యంగా కాలరాసారు. ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించి, వారిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఎఫ్ఆర్ఏ నేడు వారికి శాపంగా మారింది. ఎఫ్ఆర్ఏ చట్టం సాధారికతను సవాలు చేస్తూ సంప్రదాయ అటవీ ప్రాంతాలను ఆ చట్టం నిర్లక్ష్యం చేసిందని, అక్రమంగా అక్కడ నివసిస్తున్న ప్రజలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే ఖాళీ చేయించాలని వన్యప్రాణుల పరిరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న మూలవాసుల అర్హత లను ధ్రువపరుస్తూ ఎలాంటి సమగ్ర నివేదికలను ఇప్పటికీ న్యాయస్థానానికి సమర్పించకపోయినా, 16 రాష్ట్రాల్లోని 10 లక్షల మందికి పైగా ఆదివాసీలను సంబంధిత అటవీ ప్రాంతాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించాలని సర్వోన్న త న్యాయస్థానం ఫిబ్రవరి 13వ తేది ఇచ్చిన ఆదేశంపై స్టే ఇచ్చింది. అయితే దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఎఫ్ఆర్ఏ చట్టాన్ని సమర్థిస్తూ, ఆది వాసీలకు మద్దతుగా సాక్ష్యాధా రాలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించడంలో కేంద్రం విఫలం కావడం వెనుక మైనింగ్ కార్పొరేట్ కుట్ర దాగి ఉందే మోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఆదివాసీ సమూహాల్లో ఆందోళన వ్యక్త మైంది. ప్రజా స్వామిక వాదులు, రాజకీయ పక్షాలు ప్రభుత్వ అసమర్థతను విమర్శిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో తమ అర్హతలను మైనింగ్ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం కావాలని తిరస్కరించినట్టు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
దేశంలో దాదాపు 25 కోట్ల మంది అడవుల్లోను, అడవుల అంచుల్లోనూ నివసిస్తున్నారు. వారిలో దాదాపు 10 కోట్ల మంది మూలవాసీలు, గిరిజనులు ఉంటారని అంచనా. ఖనిజ సంపద, విలువైన కలప వంటివి కాకుండా చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపైన, నీరు, మేత భూములు, పోడు వ్యవసాయంపై ఆధారపడి సంప్రదాయకంగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. అయితే భారత అటవీ చట్టాలు అటవీ భూములు కాని వాటిని సైతం అడవులుగా గుర్తిస్తూ ఎఫ్ఆర్ఏ చట్టం తీసుకొచ్చింది. దాంతో అడవుల అంచున సాగు చేసుకుంటూ బతుకులీడుస్తున్న ప్రజానీకం కూడా బతుకుదెరువు కోల్పోయి నిర్వాసితులుగా మారవలసి వస్తోంది. షెడ్యూల్డ్ ట్రైబ్స్, అడవులపై ఆధారపడి జీవిస్తున్న ఇతర ప్రజానీకం సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులను స్థిరపరుస్తూ ప్రభుత్వం 2006లో ఎఫ్ఆర్ఏ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి 75 ఏళ్లుగా సదరు అటవీ ప్రాంతంలో బతుకుతుండడం లేదా ఆ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలోని తెగకు చెందిన వారికి మాత్రమే 4 హెక్టార్లకు మించకుండా పట్టా భూమిని ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే ఈ చట్టాన్ని వన్యప్రాణి సంరక్షణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మూలవాసీలు/ఆదివాసులు/అడవులపై ఆధారపడి బతుకుతున్న ఇతర జనావళి కారణంగా అడవులు, వన్యప్రాణులు విధ్వంసం జరుగుతున్నదనే అపోహతో వన్యప్రాణి సంరక్షణ సంస్థలు ఎఫ్ఆర్ఏ చట్టం సాధికారతను వ్యతిరేకిస్తున్నాయి. వాతావరణ మార్పును అడ్డుకునేందుకు, మానవ మనుగడకు అడవుల విధ్వంసాన్ని అడ్డుకోవాల్సిందే? తప్పదు. అయితే అలాంటి విధ్వంసకర పరిణామాలకు వా స్తవంలో దోహదం చేస్తున్న దుష్ట శక్తులేవో గమనించకుండా అందుకు బలిపశువులుగా ఆదివాసీలను, ప్రజలను దోషులగా నిలబెట్టడం తీవ్ర తప్పిదమవుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలై ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన సందర్భంలో సహజ వనరుల ఎగుమతుల వాణిజ్యం సహజంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పర్యావరణ విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతుంది. సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేని కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాల విధానాల కారణంగా సహజ వనరులున్న అటవీ ప్రాంతాల్లోకి వ్యవసాయం, ఖనిజాల మైనింగ్ తదితర కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తాయి. దాంతో అడవుల విధ్వంసం వేగవంతమవుతుంది. ఆ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు కార్పొరేట్ శక్తులు కీలకంగా వ్యవహరిస్తాయి.
అంతర్జాతీయంగా 90 నుంచి ఇనుము, అల్యూమినియం వంటి ఖనిజాల వాణిజ్యం పెరగడంతో, వాటికి ఆలవాలమైన అటవీ ప్రాంతాలపై ఒత్తిడి మరింతగా పెరిగింది. పర్యవసానంగా ఖనిజ సంపద ఒడ్డున బతుకు లీడుస్తున్న ఆదివాసీల జీవితాల్లో మైనింగ్ కార్పొరేట్ డ్రాక్యుల్లాలు ప్రవేశించి వారిని ఆగమాగం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే దేశంలో అనేక చోట్ల స్వతంత్రంగానూ, వామపక్ష శక్తుల సహకారంతోనూ ఈ సహజ సంపదల ప్రాంతాల్లోని ఆదివాసులు ప్రతిఘటించారు. ఆదివాసుల ధిక్కారంతో వెనక్కి తగ్గిన మైనింగ్ దిగ్గజాలకు అండ కోసమే కాకుండా, సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించే ఉద్దేశంతో సులభ పరిష్కారంగా మైనింగ్ ప్రాంతాల్లో సాగుతున్న అలజడిన పరిష్కరించేందకు కేంద్రం గ్రీన్ హంట్ వంటి వివిధ రకాల చర్యలను చేపట్టింది. అందులో భాగంగా ఎఫ్ఆర్ఏ వంటి అటవీ హక్కుల చట్టాలను రూపొందించింది. ప్రస్తుతం సుప్రీం తీర్పు రూపంలో ఆదివాసీలను బలవంతంగా అడవుల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ మొదలైంది. సుప్రీం కోర్టు అలాంటి తీర్పు ఇవ్వడానికి దారితీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఏ చట్టాన్ని సమర్థించడంలో తన వాదనను కుట్రపూరితంగా నీరుగార్చి వేసింది. అది కార్పొరేట్ శక్తుల అనుకూల, ఆదివాసీ ప్రజానీకానికి వ్యతిరేక తీర్పు వెలువడేందుకు దారితీసింది.
సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చే తీర్పును కూడా ప్రభావితం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్పొరేట్ అభివృద్ధి నమూనాను, ఎజెండాను శక్తిమంతంగా ముందుకు తీసుకెళుతుండడంలో భాగమే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదివాసీ వ్యతిరేక తీర్పు. వ్యవసాయం, పారిశ్రామిక వస్తూ త్పత్తి రంగం కుదేలై సంక్షోభంలోకి జారుకోవడంతో, ఖనిజాల వంటి పర్యావరణ విధ్వంసం విలువైన ప్రకృతి వనరుల ఎగుమతులపై ఆధారపడి ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకునే ప్రభుత్వ విధానాలు రూపొందడమే కాదు, ఆయా రంగంలోని కార్పొరేట్ శక్తుల అక్రమ వ్యవహారాలు సహజంగానే పెరిగిపోతాయి. దాంతో దేశంలోకి చొచ్చుకువచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని జీర్ణం చేసుకోగల దేశీయ వస్తూత్పత్తి, వ్యవసాయ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా విదేశీ వస్తువుల దిగుమతి, సేవారంగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. పర్యవసానంగా స్థానిక ఉత్పత్తి రంగా పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోతుంది. పర్యవసానంగా దేశ ఆర్థిక వ్యవస్థ 'డచ్ రోగం' అనే ఆర్థిక అవ్యవస్థలోకి, సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సహజ వనరులున్న అనేక దేశాలు ఇలాంటి డచ్ రోగం అనే ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన ఉదంతాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. మన దేశంలో దండకారణ్యం తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ మైనింగ్ దిగ్గ జాలకు వ్యతిరేకంగా సాగిన ఆదివాసీ పోరాటాలు, ఉద్యమాలు భారత ఆర్థిక వ్యవస్థను డచ్ రోగం అనే ఆర్థిక అస్తవ్యవస్థతలోకి కూరుకుపోకుండా కాపాడాయి. ఉద్యమించిన ఆదివాసీ ప్రజానీకానికి, వారికి సహకరించిన రాజకీయ శక్తులకు ఆ విషయం తెలియకపోవచ్చు. ఎలాంటి ప్రజా ప్రతిఘటన లేని ఉత్తర కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో జరిగిన ఐరన్ ఓర్ మైనింగ్ కార్యకలాపాల కారణంగా స్థానిక వ్యవసాయం, చేతివృత్తులు, పర్యావరణం, ప్రజారోగ్యం, జీవన మార్గాలు ధ్వంసమైనాయి. మైనింగ్ మాఫియా చేతిలోకి అన్ని ప్రభుత్వ శాఖలు వెళ్లడమే కాకుండా, యావత్ పౌర సమాజం మొత్తం ఆ మాఫియా శక్తుల పాదాక్రాం తమైంది. భారత రిపబ్లిక్కు సమాంతరంగా, దాని గర్భంలోనే మైనింగ్ మాఫియా కార్యకలాపాల వల్ల 'బళ్లారి రిపబ్లిక్' (స్టేట్ విత్ ఇన్ స్టేట్) అనే మాఫియా సామ్రాజ్యం అవతరించింది. ఎక్కడో ఇతర దేశాలలో కాదు సాక్షాత్తు మన దేశంలోనే ప్రకృతి వనరుల వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై, మాఫియా సామ్రాజ్యం అవతరించడం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. అదే విధంగా సకల ప్రజా స్వామిక సంస్థలు, రాజ్య వ్యవస్థలు, పౌర సమాజం యావత్తూ శిథిలమై ఒక ఫాసిస్టు రాజ్యం, సమాజం అవతరించే ప్రమాదం నుంచి ఆదివాసుల మైనింగ్ వ్యతిరేక ఉద్యమం మనల్ని సంరక్షించినందుకు యావత్ భారత నాగరిక సమాజం వారికి రుణ పడి ఉందనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఆదివాసులను తరతరాలుగా వారు నివసిస్తున్న అటవీ ప్రాంతాల నుంచి తొలగించడం వల్ల ఆ ప్రజానీకానికి కలిగే నష్టం కన్నా, మైనింగ్ వాణిజ్యం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి 'డచ్ రోగం'తో కలిగే నష్టం అపారం, అనూహ్యం. కేవలం మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న ఆదివాసీలు, మావోయిస్టుల ఏరివేత వంటి రాజకీయ- ఆర్థిక ప్రయోజనాల పునాదిగా గిరిజనులను అటవీ ప్రాంతాల నుంచి ప్రభుత్వం ఖాళీ చేయించడం ఆత్మహత్యా సదృశ్యమైన చర్య అవుతుంది. పది కోట్ల మందికి పైగా ఉన్న ఆదివాసీలు సైతం దేశంలోని ప్రధాన స్రవంతి ప్రజానీకంతో సమానంగా అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకుని, భారతీయ సమాజంలో అంతర్భాగం కాకుండా దేశ ప్రగతి అసాధ్యం. అయితే వారు చారిత్రక కాలంలో సంపాదించిన స్థానిక విజ్ఞానాన్ని, సంప్రదాయాలను, భౌగోళిక భౌతిక జీవనాన్ని.. మొత్తానికి మొత్తంగా తమ అస్తిత్వాన్ని వదలుకొని, పరాయీకరణకు గురై ప్రధాన స్రవంతి స్వభావాన్ని సంతరించుకోవాలనుకోవడం పొరపాటు.
- వెన్నెలకంటి రామారావు
సెల్ : 9550367536