Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో యుద్ధ మానియా వ్యాపించింది. ప్రభుత్వం, దానిని వెన్నంటి మీడియా, ఆ దారిన మాజీ సైనికాధికారులు, బ్యూరోక్రాట్లు, మధ్య తరగతి యుద్ధ నినాదాలు చేస్తున్నారు. పొరుగు దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. కొందరైతే అతి ఉత్సాహంతో 'సైన్యానికి 4 గంటలు స్వేచ్ఛనివ్వండి- పాక్ పార్లమెంటుపై మన జెండా ఎగురవేస్తాం' అని బీరాలు పోతున్నారు. యుద్ధమంటే మానవ పోటీయని, యుద్ధమంటే బీభత్సమని, యుద్ధమంటే ఇరువైపులా సైనికుల ప్రాణ త్యాగమని, యుద్ధమంటే ఆర్థిక విధ్వంసమని, యుద్ధమంటే కాళ్లూ, చేతులూ తెగిపడే మాంసపు ముద్దలని లోలోతుగా చూసే విశ్వాలత్వం పోయింది. అదొక రణ ఉత్సాహం. అదొక తెచ్చి పెట్టుకున్న దేశభక్తిగా, దేశభుక్తిగా, సరుకుగా, సరదాగా మారిపోయింది. యుద్ధం వద్దు. సమస్యల మూల పరిష్కారం వెతకండి అని ఎవరైనా విజ్ఞతతో అంటే వారిని పాకిస్తాన్ ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారు. 'శాంతి కాముకులం' అని చెప్పుకుంటూ యుద్ధ పిపాసులుగా మారిన సంఫ్ పరివారీయులు 'దేశ భక్తులు'గా చిత్రించబడుతున్నారు. ప్రజాస్వామికంగా మాట్లాడిన వారు దేశ ద్రోహులై పోతున్నారు. దేశభక్తి అంటే యుద్ధమే అయిపోయింది. అదీ పాకిస్తాన్పై కాలు దువ్వడమే అయిపోయింది. మన ఆర్థిక, రాజకీయ నవ నాడుల్ని పట్టి సలుపుతున్న ఏ అమెరికా అగ్రరాజ్య దురహంకారం మీదనో, ఏ యూరోపియన్ సామ్రాజ్యవాద ఆధిపత్యం మీదనో, ఏ ఇజ్రాయిల్ పొగరు మీదనో, లేదా పొరుగునే ఉన్న చైనా మీదనో, రష్యా మీదనో ఈ అహంకారాన్ని, దురహంకారాన్ని ప్రదర్శించమనండి. అక్కడి దేశభక్తి యుద్ధంగా కనపడదు! సైనిక సాహసంగా విన్పించదు! పుల్వామా దాడి టెర్రరిస్టు సంస్థకు చెందిన వారు చేసినదిగా చెబుతున్నారు. కానీ కాశ్మీర్లో సైనిక పదఘట్టనల కింద నలిగిన యువకుల ప్రతీకారమని వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఒక సమస్య ఉంది. ఒక పరిష్కారం ఉంది. కొంత చరిత్ర ఉన్నది. అది విద్వేషాలతోనో, ఉన్మాదం తోనో, యుద్ధంతోనో పరి ష్కారమయ్యేది కాదు. పరిష్కారం కాకుండా నోరు మూపించడానికో, పొగిలే సెగల మీద మూత పెట్టడానికో పనికి వస్తుంది. మన దేశంలో అధికార మార్పిడి నుంచి ఆ సమస్య రగులుతూనే ఉంది. అదే కాశ్మీర్ సమస్య. మత ప్రాతిపదికగా భారత్- పాకిస్తాన్లుగా జరిగిన విభజన - 70 ఏండ్లుగా ఈ కాష్టం రగులుతూనే ఉంది. వేల మంది ఈ విభజనతో, కాశ్మీరీ ఆందోళనల్లో అగ్గి అయ్యారు, బుగ్గి అయ్యారు. మంచు కొండల్లో చల్లారని మంటలా ఆ సమస్య రగులుతూనే ఉన్నది. ఉగ్రవాదమైనా, అగ్రవాదమైనా ఆ సమస్యను పరిష్క రించలేదు. పైగా దానిని మరింత రావణకాష్టం చేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు యుద్ధ భేరీలు మోగించింది. పుల్వామా ఘటన దాని కి సాకుగా దొరికింది. 44 మంది సైనికుల ప్రాణాలు దానికి సరుకుగా మారాయి. సైనిక విన్యాసాలు ప్రచారాస్త్రాలయ్యాయి.
పుల్వామాలో సైనికుల తరలింపే అనుమానాస్పదంగా మారింది. 2వేల మందికిపైగా సైనికులను రోడ్డు ద్వారా ఒకేసారి తరలించడం కాకతాళీయమా? సాధారణమా? సాధారణమే అనుకుంటే అంత మందిని తరలిస్తుంటే తీసుకున్న జాగ్రత్త చర్యలు ఏమిటీ? అదీగాక నిత్యం ఉద్రిక్తతలు ఉండే లోయ ప్రాంతంలో 300 కేజీల మందుగుండు నింపిన ఒక కారు యధేచ్చగా ఎదురుగా నడుపుకుంటూ సైనిక కాన్వాయిలోని బస్సును ఢీ కొట్టడమేమి టి? నిఘా వ్యవస్థ ఏమైంది? ఒక మంత్రి రోడ్డున పోతుంటేనే వాహనాలు ఆపి, బందోబస్తు పెట్టి నానా యాగీ చేసే పోలీసు వ్యవస్థ, ఇంత భారీ కాన్వాయిలోకి దూసుకువస్తున్న కారును ఎందుకు ఆపలేదు? ఈ విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు పోవడం పట్ల విచారించాల్సిందే. కానీ తరువాత పరిణామాలు చూస్తుంటే ఈ పేలుళ్ల వెనుక ఒక సందర్భం, రాజకీయ చాణక్యం, కుట్ర కోణాలు దాగి ఉన్నయనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి.
ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు గంటలకుపైగా ప్రధాని మోడీ యాడ్ షూటింగ్ నిర్విఘ్నంగా జరిపారు. 40 మంది సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతే 130 కోట్ల మంది ప్రజల ప్రతినిధి, సైనికులకు మద్దతే దేశభక్తి అనే వాచాలత్వం ప్రదర్శించే మోడీ అంత నింపాదిగా, నిదానంగా, ఆనందంగా, ఆహ్లాదంగా షూటింగ్లో ఎలా పాల్గొంటారు. అలాగే పొరుగు దేశాలపై దాడులు చేయాలనే రాజకీయ నిర్ణయం తీసుకొని, దేశంలో సకల పక్షాలను కూడగట్టి మరోవైపు రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఆ ప్రసంగాలు సైనికుల త్యాగాల చిత్రీకరణలో, యుద్ధ ప్రేలాపనలతో సాగాయి. అందివచ్చిన అవకాశమో, ముందే వేసుకున్న ప్రణాళికలో భాగమో తెలియదు కానీ పొరుగు దేశంపై యుద్ధ విన్యాసం బీజేపీకి, నరేంద్రమోడీకి రాజకీయ ఆయుధం అయ్యింది.
అందుకే సోషల్మీడియాలో బీజేపీ, సంఫ్ పరివార్ వర్గీయులు విద్వేషపు విషబాండాలను, ఉన్మాదపు ప్రచారాలను వండి వారుస్తున్నారు. మోడీని 'వీర యోధుణ్ణి' చేసి చూపుతున్నారు. యుద్ధంలో ముందు మరణించేవి సత్యాలని, ఆ తరువాతే సైనికులని అంటారు. అసత్యాలు అంతగా ప్రచారం అవుతాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా, మన వాయుసేన పాక్ భూ భాగంలోకి వెళ్లి 20 నిమిసాల్లో జైషే ఉగ్ర వాద స్థావరాల మీద బాంబు దాడులు చేసిందని, 300 మందికి పైగా శిక్షణ పొందుతున్న టెర్రరిస్టులు చనిపోయారని వార్తలు వండి వార్చారు. ప్రతీకారం తీర్చుకున్నామని తొడలు కొట్టారు. సహించేది లేదని, అంతు చూస్తామని హెచ్చరికలు చేశారు. సైనిక చర్యకు వంత పాడితేనే దేశభక్తులన్నట్టుగా వాతావరణాన్ని సృష్టించారు. ఇదొక ప్రమా దరకమైన మనస్తత్వం. ప్రజాస్వామికీకరణే సమాజం మీద మిలటరీకరణ రుద్దే భావజాలం. మా భూభాగంలోకి వచ్చి బాంబులు వేసి పోయారనీ, కానీ ఎవరూ చనిపోలేదని పాక్ ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ మన భూభాగంలో బాంబులు వేసి పోయింది. ఇక్కడ ఎవరికీ ఏమీ కాలేదని మన పాలకులు ప్రకటించారు. అటూ, ఇటూ సత్యాలను తొక్కిపడుతున్నారు. తమ మిలటరీ ధీరత్వాలపై గొప్పలు పోతున్నారు. అలాగే మిరాజ్ 2000 విమానాన్ని కూల్చామని, అందులోని పైలెట్ అభినందన్విక్రమ్ తమ బంధీగా ఉన్నాడని పాక్ ప్రకటించింది. దౌత్య నియమాల రీత్యా ఆయనను అప్పగించామని కూడా పాక్ ప్రకటించింది. దీనిని తమ ఒత్తిడికి లొంగి పాక్ దిగివచ్చిందంటూ మన సంఫ్ పరివారీయులు గొప్పలకు పోతున్నారు. మొత్తంగా ఎన్నికల వేళ ఈ యుద్ధ విన్యాసాలు ఎక్కడికి దారి తీస్తాయోనని ఆందోళన ప్రజాస్వామికవాదులలో, దేశభక్తులలో ఉన్నది. యుద్ధం అంటూ ఆరంభమైతే ముగింపు ఒక్కరి చేతులలో ఉండదనేది వాస్తవం. చర్చల ద్వారా పరిష్క రించుకుందామని పాక్ ప్రధాని చేసిన ప్రకటన దౌత్య రీత్యా, రాజకీయంగా చూస్తే ఆహ్వానించదగినదే. దీనిని బేలతనంగా, దిగివచ్చిన చేతగాని తనంగా, మన వాళ్లు ప్రకటిస్తున్నారు. చిన్న దేశం తమ అంతరంగిక పరిస్థితుల రీత్యానే కావచ్చు. చర్చించుకుందా మంటే యుద్ధానికి పోవడం మనకు ఔచిత్యం కాదు. అమెరికా అండ చూసుకొని యుద్ధానికి పోతే నష్టపోయేది రెండు దేశాలే. సామ్రాజ్యవాదులకు యుద్ధాలు కావాలి. ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవడం కోసం. పెట్టుబడిదారీ వ్యాపార రీతిలో యుద్ధాలూ ఒక భాగం. భారత్- పాక్లు ఇరుగు పొరుగు దేశాలు. 70 ఏండ్లుగా దాయాది దేశాలు. అటు, ఇటు ఎందరో ప్రజల జీవితాలు ముడి పడి ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మనవి. నిరుద్యోగం, అవినీతి, రాజకీయ అనిశ్చిత్తి, ధరలు, వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామిక సంక్షోభాలు తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాలు. అటైనా, ఇటైనా సైనికులు సాధారణ కుటుంబాల వారే. ఎవరి ప్రాణాలైనా విలువైనవే. అంతకుమించి బాంబు దాడుల్లో మరణించేది సామాన్యులు. ఎవరు చనిపోయినా మానవులమే కాదా! అందుకే యుద్ధమంటే వీరోచిత దృశ్యమే కాదు. మారణహోమ బీభత్సమూ ఉంటుందని సోకాల్డ్ దేశ భక్తులు గమనించాలి. యుద్ధం- దేశభక్తి అంటే పొరుగు దేశంపై తొడగొట్టడమే కాదు. మన సమస్యలపై తొడగొట్టడంలోనూ దేశభక్తి చూపాలి. నోట్ల రద్దును కూడా దేశభక్తిగానే పొగిడారు మోడీ అనుచరులు. నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థకు విషాదంగా మారింది. అయినా నోరు మెదప కుండా ఏడాదికి రెండు కోట్ల ఉ ద్యోగాలు అన్న నినాదం వట్టిపోతుంటే మారు మాట్లాడరు. ఇలా ఎన్నో రుగ్మతలపై యుద్ధం చేయాలి. అంతకు మించి ప్రజాస్వామిక, లౌకిక విలువలను పెంపొందించడానికి కృషి జరగాలి. ఎన్నికలలో లబ్ది పొందడానికి మోడీ చేస్తున్న ఈ రాజకీయ, ఎన్నికల యుద్ధం దేశానికి నష్టం. అనివార్యం కాదు. అవసరం లేనిది. పొంగేదంతా దేశభక్తి కాదు. ఉన్మాదం మాత్రమే. అందుకే యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం. చర్చల ద్వారా రాజకీయ సమస్యల, ఉద్రిక్తతల పరిష్కారానికి కృషి జరగాలని డిమాండ్ చేద్దాం.
- పోటు రంగారావు
poturangarao1@gmail.com