Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈమధ్య హైదరాబాద్లోని గాంధీభవన్కు, ప్రగతిభవన్కు దూరం బాగా తగ్గింది. ఎంత బాగా తగ్గిందంటే నిమిషం క్రితం గాంధీభవన్లో కనపడ్డవాళ్లు.. మరో నిమిషంలో ప్రగతిభవన్లో ప్రత్యక్షమవుతున్నారు. ఆ విధంగా సీఎం నివాసంలో కాలుమోపిన వారికి రాష్ట్రాభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి, దేశ క్షేమం గురించి ఒకటే కవిత్వం తన్నుకొస్తున్నది. టన్నుల కొద్దీ తన్నుకొస్తున్న ఈ కవిత్వాన్ని చూసి ఇటు జనాలకు, అటు పాత్రికేయులకు కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. మొన్నటిదాకా ప్రగతి భవన్పైనా, అందులో ఉన్న పెద్దాయనపైనా అదే విమర్శలు గుప్పించిన ఈ హస్తం పార్టీ నాయకులకు.. ఇప్పుడు అదే పరమ పవిత్ర ప్రదేశమైపోయింది. ఆలోచన వచ్చిందే తడవుగా గోడ దూకి కారెక్కి రయ్యున దూసుకుపోవాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. అంతేనా.. ఆ పరమ పవిత్ర ప్రగతి భవన్లో కాలు మోపి, ఆ వెంటనే ఒక ప్రకటన రాసి మీడియా ముఖాన పడేస్తున్నారు. 'అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కారెక్కటానికి సిద్ధమయ్యా... అవసరమైనప్పుడు అవసరమైతే హస్తం పార్టీకి రాజీనామా చేస్తా.. గులాబీ పార్టీ బీ-ఫారమ్పై పోటీ చేయడానికైనా రెడీ...' అనేది ఆయా ప్రకటనల్లోని సారాంశం. ఇక్కడే అసలు గమ్మత్తు దాగుంది. గోడ దూకిన ఏ ఎమ్మెల్యే ప్రకటన చూసినా అదే రాతలు, అదే సారాంశం. కింద సంతకం మాత్రమే తేడా. ఫార్మేట్ మాత్రం సేమ్ టు సేమ్. ఈ ముచ్చటైన కథలు విని జర్నలిస్టులు ముక్కున వేలేసుకుంటున్నారు. అరే.. ఇంతకీ ఈ స్టేట్మెంట్లు గోడ దూకినోళ్లు రాసి పంపిస్తున్నరా..? లేక వాళ్లను చేర్చుకున్న అధికార పార్టోళ్లు రాసి పంపిస్తున్నరా...? అనేది అర్థంగాక వారు బుర్రలు గోక్కొంటున్నారు. కాబట్టి.. యావత్ తెలంగాణ ఓటరు మహాశయులారా... ఘనాతి ఘనులైన మన నాయకులకు ఓట్లేసి గెలిపించిన మీరైనా జర ఈ చిక్కుముడి విప్పుతారా...? విప్పి సారాంశం జెప్పుతారా...?
-బి.వి.యన్.పద్మరాజు