Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడికి వెళ్లే వయసులోనే పిల్లలు మద్యానికి అలవాటుపడు తున్నారు. పార్టీ కల్చర్ వల్ల మైనర్లు క్రమంగా మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పార్టీల పేరుతో యువతీయువకులు జల్సాలు చేసుకుంటూ, మందుకు అలవాటు పడి, పాఠశాలలో ఉండగానే మద్యం, బీరు తాగుతూ ఎంజారు చేయాలనే కల్చర్ విద్యార్థులలో పెరిగిపోతుంది. ఇటీవలి కాలంలో సంగారెడ్డి శివారులోని ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు స్కూల్కి డుమ్మా కొట్టి బీరుసీసాలతో పొలం గట్ల మీద తిరగడం చూసి వాళ్ల టీచర్ పట్టుకొని మందలించి వదిలేసారు. మెదక్జిల్లా నర్సాపూర్లో ఓ ప్రయివేట్ స్కూల్ వెనుక 9వ తరగతి బాలుడు బీరు సీసాతో పీఈటీకి దొరికాడు. తల్లిదండ్రులను పిలిపించి ఆ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు తమ వెంట తెచ్చుకున్న మద్యంను శీతల పానీయంలో కలుపుకుని తరగతి గదిలోనే తాగారు. మందు తాగిన విద్యార్థినులతో మిగిలిన విద్యార్థులకు నష్టం కలుగుతుందనే కారణంతో టీసీిలు ఇచ్చి పంపించారు. ఇవి మన తెలుగు రాష్ట్రాలలో మచ్చుకు కొన్ని ఘటనలు.
పిల్లలు చిన్నతనంలోనే మద్యానికి అలవాటుపడటానికి, మద్యాన్ని రుచి చూడాలనే ఆలోచనలు రావడానికి కారణాలేమిటి? సినిమాలలో టీవీలలో మద్యం తాగటం తప్పు కాదు కదా స్టేటస్గాను ఆధునిక సంస్కతిగాను చూపటం, ఇండ్లలోనే తల్లిదండ్రులు మద్యం సేవించడం, పిల్లలు ప్రత్యక్షంగా చూడటం, నేటి యువత పార్టీలు, ఫంక్షన్ల పేరుతో మద్యాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడానికి తోడు గ్రామాలలో ఇండ్ల మధ్యనే బెల్టుషాపులు, పట్టణాలలో వీధి వీధికి బార్లు, వైన్షాపులు పెరిగిపోవడం విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు దాన్నొక ఆదాయవనరుగా భావించి ప్రోత్సహించడం, ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికలలో మద్యాన్ని విచ్చలవిడిగా వినియోగించి యువతను మద్యానికి బానిసలయ్యేలా చేయడం కూడా పిల్లలను మద్యానికి ఆకర్షితులను చేస్తోంది.
భారతదేశంలో మద్యం వినియోగం గడిచిన పన్నెండు ఏండ్లలో రెట్టింపు అయ్యింది. తెలుగు రాష్ట్రాలు మద్యం వినియోగంలో ముందంజలో ఉన్నాయి. దేశంలోని 16కోట్లమంది ప్రజలు అనగా మొత్తం ప్రజల్లో 14.6శాతం మంది మద్యానికి బానిసలుగా మారినట్టు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖ ఎయిమ్స్తో కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. మద్యం మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో గంజాయి, నల్ల మందు లాంటి మత్తుపదార్థాల వినియోగం ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలుపుతోంది. 3.1కోట్లమంది గంజాయికి బానిసలుగా మారారని, ఏపీలో నల్లమందు వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలిపింది. మద్యం అధికంగా సేవించడం వల్ల 2016లో ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలమంది చనిపోయారని, ప్రపంచంలో ప్రతీ 20 మరణాలలో ఒక మరణం మద్యపానం వల్లనే జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. మద్యం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఎన్నో లక్షలమంది మద్యానికి బానిసలై తమ కుటుంబాలను రోడ్డు కీడుస్తున్నారు. కోట్ల మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మ ద్యం మత్తులో జరుగుతున్న నేరాలు రోజురోజుకు పెరుగుతు న్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే నిందితు ల్లో అత్యధికశాతం మంది మద్యం మత్తులో చేస్తున్న వారే. మద్యం మత్తులో భార్యలను, తల్లిదండ్రులను చంపుతున్నవా రినే కాదు, తోటి విద్యార్థినులపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కూడా మనం నేడు చూస్తున్నాం.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనను, అలవాట్లను గమనిస్తూ మద్యం జోలికి పోకుండా నియంత్రించాలి. విద్యార్ధులకు మద్యం వల్ల కలిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలు గురించి వివరించి తగిన అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు మద్యపానం నియంత్రించేలా తగిన చర్యలు తీసుకోవాలి. యువత, విద్యార్థులు మద్యం జోలికి పోకుండా ఉండేలా పాఠ్యాంశాలలో మద్యపాన అనర్థాలు తెలిపే అంశాలు చేర్చాలి. విద్యార్థులకు, యువతకు, ప్రజలకు మద్యపాన అనర్ధాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. మద్యం వినియోగం క్రమేపీ తగ్గించి ఒక్కసారిగా లేదా విడతల వారీగా అయినా మద్యపాన నిషేధం అమలు కు కృషి చేయాలి. తద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. అఘాయిత్యాలను నిరోధించాలి. విద్యార్థులు మద్యం మత్తుకు బానిసలు కాకుండా చూడాలి. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేసే పాలకులను ప్రజలు ఎంపిక చేసుకోవాలి.
- వాసిలి సురేష్
సెల్: 9494615360