Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ హేతువాది, నూతన యుగ విప్లవశీలి - పెరియార్ ఇ.వి. రామస్వామి స్వీయగౌరవ హేతువాద ఉద్యమానికి ఆకర్షితురాలై ఉద్యమానికే తన జీవితం అంకితం చేసిన అమ్మ మణియమ్మై మార్చి 10, 1920న వెల్లూర్లో జన్మించింది. అసలు పేరు గంధిమతి. పెరియార్ మానస పుత్రిక జస్టీస్ పార్టీలో పనిచేసే ఆమె తండ్రి కనగసబై ముదలియార్ మరణానంతరం పెరియార్ నడిపే స్వీయగౌరవ ఉద్యమంలో చేరింది. జస్టీస్ పార్టీనే 1944లో ద్రవిడ కజగంగా మారింది. కొన్ని సంవత్సరాలలోనే పెరియార్ యొక్క ఆత్యంత విశ్వసనీయురాలైన అనుచరురాలిగా ఎదిగింది. సాధారణ కార్యకర్తగా చేరిన ఆమె పెరియార్తో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటించింది. పెరియార్ ప్రసంగాలను చిన్న పుస్తకాలుగా ప్రచురించేది. ద్రవిడ కజగం సమావేశాలలో స్వయంగా కరపత్రాలను పంచిపెట్టేది. సమావేశ ప్రాంగణం బయట పుస్తకాలను స్టాల్గా పెట్టి అమ్మేది. 1949 నాటికే పెరియార్ మణియమ్మైని తన రాజకీయ వారసురాలిగా ప్రకటించాడు. పెరియార్ మొదటి భార్య నాగమ్మాళ్ పిల్లలు లేకుండానే మరణించాక, పెరియార్ ఆరోగ్యం కాపాడటం కోసం, సంఘ సంస్కరణ ఉద్యమం కొనసాగేలా చూసేందుకు, ఉద్యమ ఆస్తులు తప్పుదోవ పట్టకుండా ఉండడం కోసం, చట్టబద్ధమైన వారసత్వం కోసం తన 31ఏండ్ల వయస్సులో 69ఏండ్ల పెరియార్ని 1949 జులై 9న ఆదర్శ వివాహం చేసుకుంది. 1958లో ద్రవిడ కజగం ఉద్యమకారులు కుల నిర్మూలన దిశగా కులం పేరుని కులాధిక్య భావనని సూచించే తోకలను తీసేయాలని బ్రాహ్మణ హౌటల్ లాంటి సైను బోర్డులని కొట్టివేసే మలిపేసే క్రమంలో విద్వేషాలు రెచ్చగొట్టారనే బూటకపు కేసు కింద పెరియార్తో పాటు 10మందికి 6నెలల జైలు శిక్ష విధిస్తే, జైలులోనే మార్చి 8, 10వ తేదిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు.. ఆ మృత దేహాలని అప్పజెప్పేందుకు జైలర్ నిరాకరిస్తే మణియమ్మై అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ నాడర్కి రిప్రజెంట్ చేసి ఆ ఇద్దరి మృత దేహాలని తీసుకొని అంత్యక్రియలు నిర్వహించింది. 19 జనవరి 1958న 'విడుతలై' (విమోచకులు) పత్రికలో ఒక ఆర్టికల్ రాసినందుకు ఆ పత్రిక పబ్లిషర్, ఎడిటర్ ఐన మణియమ్మైను అరెస్ట్ చేస్తే నెల రోజులు జైలు జీవితాన్ని గడిపింది.
ద్రవిడ కజగం హేతువాద ఉద్యమాన్ని పెరియార్తో పాటు నడిపిస్తూ బర్మా ప్రపంచ బౌద్ధ మహాసభలకి పెరియార్, బాబా సాహెబ్ అంబేద్కర్లతో పాటు హాజరయింది. 1973లో పెరియార్ మరణానంతరం ప్రపంచంలోనే అతిపెద్ద హేతువాద ద్రవిడ కజగం ఉద్యమాన్ని తానే పెరియార్ ని మించి తీవ్ర స్థాయిలో నడిపించింది. తమిళనాడులో ఆమె మొదటి మహిళా రాజకీయ నాయకురాలు.రాష్ట్రమంతా తిరిగి ద్రవిడ కజగం పార్టీని బలోపేతం చేసింది.
ఏప్రిల్ 3, 1974న గుడులల్లో అన్ని కులాల వారిని పూజారులుగా నియమించాలని తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. మే 26, 1974న ఆ డిమాండ్ని పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా పర్యటనకొచ్చిన కేంద్ర మంత్రి వై.బి. చవాన్కి నల్ల జెండాల ద్వారా నిరసన తెలియజేసింది. 1974 అక్టోబర్లో ఈ దేశ మూలవాసియైన ద్రవిడుడైన చక్రవర్తి రావణుని దహనం చేసే ఉత్తర భారత 'రాంలీలా' ఉత్సవంలో అప్పటి ప్రధాని పాల్గొనబోతున్నారని తెలిసి అది లౌకికవాద సూత్రాలకు విరుద్ధమని తప్పుడు ఆలోచనలనీ దేశ పౌరులపై రుద్దడమనీ రామాయణంలో ఈ దేశ మూలవాసులని ఎంతో ఘోరంగా రాక్షసులుగా చిత్రించారనీ అవమానించారనీ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రధానికి టెలిగ్రాం పంపించింది. ప్రధాని నిర్ణయంలో పునరాలోచన లేకపోవడంతో నిరసనగా ఆ కార్యక్రమంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పాల్గొన్నందుకు ప్రతి చర్యగా 'రావణ లీల' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జరుగుతుండగానే మణియమ్మై మరో 14మంది ఉద్యమకారులని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకపోతే ఆ కేసులో అందరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తే అనుభవించింది. ఆ తర్వాత 1977లో ఇందిరా గాంధీకి నల్ల జెండాలతో నిరసన తెలియచేసి అరెస్ట్ చేయ బడ్డది.దేశంలో ఎమర్జెన్సీ విధించబ డినపుడు అనేక బాధలకి గురైంది.తను చనిపోయే ముందు 1974లో ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి తమ వ్యక్తిగత ఆస్తినంతా ఆ ట్రస్ట్ కి ఇచ్చేసింది. ప్రస్తుతం ఆ ట్రస్టు ఆధ్వర్యంలో 40విద్యాసంస్థలు, అనాధ శరణాలయాలు నడుస్తున్నాయి. అందులో ఎక్కువ మహిళలకి సంబందించినవే. ''ఆమె చాలా నిరాడంబరమైన మనిషి. ఆమె తన జీవితంలో పట్టుచీరలు గానీ లేదా ఆభరణాలను ఎన్నడు ధరించలేదు. ఆమె జీవితం మహిళల విముక్తికి అంకితం చేయబడింది'' అని మణియమ్మైతో కలిసి పని చేసిన పెద్దవాడైన విడుతలై రాజేంద్రన్ అంటాడు. ద్రావిడ ఉద్యమంలో ప్రముఖుడైన, మణియమ్మై కంటే ఇరవై ఏండ్లు పెద్దవాడైన భారతీదాసన్ ఆమెని ''అమ్మై (తల్లి)'' అని పిలిచాడు. ప్రపంచంలోనే అతిపెద్ద హేతువాద ఉద్యమాన్ని నడిపించి, గొప్ప నాయకత్వం అందించిన మణియమ్మై 1978 మార్చి 16న మరణించింది. తన జీవితాంతం బడుగుల, స్త్రీల స్వేచ్ఛ కోసం పరితపించిన, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె భావజాలంపై దాడి జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రతి భారతీయ మహిళ మణియమ్మై కావలసిన అవసరం ఉంది.
(మణియమ్మై శత జయంతి (1920 - 2019) సందర్భంగా)
- వెంకటకిషన్ ఇట్యాల
సెల్: 9908198484